Begin typing your search above and press return to search.

బాబు ర్యాంక్ గొప్ప‌లపై జ‌గ‌న్ భారీ పంచ్‌ లు!

By:  Tupaki Desk   |   19 July 2018 4:24 AM GMT
బాబు ర్యాంక్ గొప్ప‌లపై జ‌గ‌న్ భారీ పంచ్‌ లు!
X
కొన్నిసంద‌ర్భాల్లో ర్యాంకులు.. అవార్డులు.. ప్రొసీజ‌ర్ ప్ర‌కారం వ‌స్తుంటాయి. అలాంటి వాటిని గొప్ప‌లుగా ప్ర‌చారం చేసుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. ప్ర‌తి చిన్న విష‌యానికి తన పాల‌న‌ను గొప్ప‌గా ప్ర‌చారం చేసుకునే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరు అంద‌రికి తెలిసిందే. ప్ర‌చార ఆర్భాట‌మే త‌ప్పించి మ‌రింకేమీ లేని ఈ తీరు ప్ర‌జ‌ల్లో చిరాకు తెప్పించ‌ట‌మే కాదు.. అస‌లీ ర్యాంకులు ఎలా ఇస్తార‌న్న విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ర్యాంకును సొంతం చేసుకుంది ఏపీ స‌ర్కారు. అయితే.. ఈ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని హామీ ఇచ్చి ప‌త్తా లేని పారిశ్రామిక‌వేత్త‌లు వంద‌ల్లో ఉంటారు. వారు ప్రామిస్ చేసిన‌ట్లుగా ప‌రిశ్ర‌మ‌లు ఏపీకి వ‌స్తే.. ఇప్ప‌టికి ల‌క్ష‌ల కోట్ల రూపాయిల పెట్టుబ‌డులు ఏపీని ముంచెత్తి ఉండాల్సిన ప‌రిస్థితి. కానీ.. అదేమీ క‌నిపించకున్నా.. కేంద్రం ప్ర‌క‌టించిన ర్యాంకును చూసుకొని మురిసిపోతున్న బాబు తీరును ఏపీ విప‌క్ష నేత తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

బాబు పాల‌న‌లో ఉండేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాద‌ని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ క‌ర‌ప్ష‌న్ అంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న పాద‌యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బాబు పాల‌న‌పై నిప్పులు చెరిగారు. బాబు ప్ర‌చార ఆర్భాటంపై విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించారు. ఆయ‌నేమ‌న్నారంటే..

+ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు ఒక్క ఇటుకైనా పేర్చలేదు. కానీ.. సీఎం సింగపూర్‌ వెళ్లి.. బాహుబలి గ్రాఫిక్స్‌ చూపుతూ గారడీ చేస్తున్నారు. సింగపూర్‌ లో చంద్రబాబు కోసిన కోతలు ఎలా ఉన్నాయంటే.. అమరావతిలో ఉద్యోగులు కేవలం 15 నిమిషాల్లో అలా నడుచుకుంటూ తమ కార్యాలయాలకు వెళ్లి పోవచ్చట.

+ అక్కడ 1,400 కిలోమీటర్ల మేర సైకిళ్లు తొక్కుకునే మార్గాలున్నాయట. అమరావతి అద్భుతమైన గార్డెన్‌ సిటీ అట. అంతటితో ఆగలేదు. 180 కి.మీల మేర అక్కడ రవాణా కోసం కాలువలు కూడా ఉన్నాయట. అక్కడ వాడే వాహనాలన్నీ ఎలక్ట్రికల్‌ వాహనాలట. కాలుష్యమే ఉండదట.

+ అక్కడ చంద్రబాబు ఇలా కోతలు కోస్తే.. ఇక్కడ ఆహా... రాజధాని.. ఓహో రాజధాని.. అని ప్రచారం. నేను పొద్దున్నే లేచి చంద్రబాబు కరపత్రం ఒక పేపర్ ఏం రాసిందోనని చూశాను. ‘ఆహా... రాజధాని - ఓహో రాజధాని - అమరావతి రాజసం' అని అందులో రాశారు.

+ వాస్తవానికి అమరావతికి వెళ్లి చూస్తే అక్కడ గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అక్కడ శాశ్వత నిర్మాణం కోసం ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా వేయక పోవడం కనిపిస్తుంది. చంద్రబాబు గారి.. ఎమ్మెల్యే గారి గేదెలు గడ్డి మేస్తూ కనిపిస్తాయి.

+ ఇంకా అక్కడ చంద్రబాబు గారి బాహుబలి గ్రాఫిక్స్‌ కనిపిస్తాయి. ఈయన గారి గిమ్మిక్కులు కనిపిస్తాయి. రాజధాని పేరు చెప్పి లంచాలు పుచ్చుకుని తనకు కావాల్సిన వాళ్లకు, తన బినామీలకు భూములు అమ్మేయడం కనిపిస్తోంది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో ఈ పెద్దమనిషి తొలుత చేయాల్సింది ఏమంటే పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వడం.

+ చంద్రబాబు పరిపాలనలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని గత రెండేళ్లలో మూడు ప్రఖ్యాత సంస్థలు...నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ రీసెర్చ్ - సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్ - ట్రాన్స్‌ పరెన్సీ ఇంటర్‌ నేషనల్‌ తేల్చి చెప్పాయి.

+ ఇలా బాబు పాల‌న ఉంటే.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో ప్రథమ స్థానం ఇచ్చిన వారికి బుద్ధి - జ్ఞానం ఉందా?

+ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు రూ,6,800 కోట్లు అయితే, ఇచ్చింది కేవలం రూ.3,200 కోట్లు మాత్రమే. అంటే ఈ పెద్దమనిషి నాలుగేళ్లుగా రూ.3,600 కోట్ల రాయితీ బకాయిలు పరిశ్రమలకు ఇవ్వలేదు. ఇలాంటి వ్యక్తికి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఎవరైనా ఇచ్చారు అంటే.. నిజంగా ఇచ్చినోడికి బుద్ధి ఉందా?

+ చంద్రబాబు పాలనలో ఏ జిల్లాలో చూసినా మూతపడిన పరిశ్రమలే కనిపిస్తాయి. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు - 40 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి?

+ చంద్రబాబు మోసాలు - అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. ఈయనకు నంబర్‌ వన్‌ వచ్చిందని పత్రికల్లో పెద్ద పెద్ద అడ్వర్టయిజ్‌ మెంట్లు ఇచ్చుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అబద్దాలాడే బాబును మళ్లీ క్షమిస్తే...హామీలన్నీ నెరవేర్చానని - కేజీ బంగారం - బెంజికారు ఇస్తానంటారు.

+ బాబు మాట‌ల్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌రు కాబట్టి ప్రతి ఇంటికి సాధికార మిత్ర పేరుతో ఒకరిని పంపిస్తారు. వాళ్లు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. వద్దు అనద్దు...రూ.5 వేలు అడిగి తీసుకోండి. అదంతా మనడబ్బే...మన జేబుల్లో నుంచి కొట్టేసిన డబ్బే. మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. ఈ వ్యవస్థలో మార్పు కోసం మీ ముందుకు వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించండి. మన ప్రభుత్వం రాగానే పేదలందరినీ నవరత్నాలతో ఆదుకుంటాం.

+ ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏపీపీఎస్సీ - డీఎస్సీ నోటిఫికేషన్లన్నీ క్రమం తప్పకుండా విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తాం. పెన్షన్ - రేషన్‌ కార్డు - మరుగుదొడ్లు.. ఏది కావాలన్నా 72 గంటల్లో మంజూరు చేసే వ్యవస్థను తీసుకొస్తాం.

+ గ్రామ సచివాలయాల్లో 10 మందికి ఉద్యోగాలిస్తాం. ఈ లెక్కన లక్షా యాభై వేల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం తీసుకొస్తాం. ప్రత్యేక హోదా విషయంలో ఏ పార్టీని కూడా మీరు నమ్మొద్దు...నమ్మి నమ్మి అలసిపోయాం...వద్దు వద్దంటున్నా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి మోసం చేసింది. అందువల్ల కాంగ్రెస్‌ ను నమ్మొద్దు.

+ నరేంద్రమోదీ ఎన్నికలప్పుడు తిరుపతి సభలో స్వయంగా ఆయనే ప్రత్యేక హోదా ఇస్తాం - పదేళ్ల పాటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉండీ కూడా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తోంది. ఇక చంద్రబాబు.. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తాను అంటున్నారు. ఇప్పుడు 20 మంది ఎంపీలను ఇస్తే ఏం ఒరగబెట్టావ్‌ అని నిలదీయండి.

+ నాలుగేళ్ల పాటు బీజేపీతో సంసారం చేసి.. ఇప్పుడు అన్యాయం చేసిందని, తాను మాత్రం మంచోడినని మోసం చేస్తున్నారు. కాబట్టి ఏ పార్టీనీ నమ్మొద్దు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వెయ్యండి. ప్రత్యేక హోదాకు ఎవరు సంతకం పెడితే వారికే మా మద్దతు. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాం. ఉద్యోగాలు రావాలి అంటే ప్రత్యేక హోదా రావాలి.