Begin typing your search above and press return to search.

హామీలు నిల‌బెట్టుకోమంటే అరెస్టులా?: జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   26 July 2017 12:59 PM GMT
హామీలు నిల‌బెట్టుకోమంటే అరెస్టులా?: జ‌గ‌న్‌
X
కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రపై చంద్రబాబు అణచివేయాలని చేస్తున్న ధోరణిపై వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. త‌న నివాసంలో ముద్ర‌గడ‌ను హౌస్ అరెస్ట్ చేసిన తీరుపై జ‌గ‌న్ ట్వీట్ ద్వారా తీవ్రంగా స్పందించారు. ``ఒక్క విషయం చెప్పండి ముఖ్యమంత్రి గారూ.. ముద్రగడను ఎందుకు హౌస్‌ అరెస్టు చేశారు..? కాపులకు మీరు ఇచ్చిన హామీని, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోండి అనే కదా వారు మిమ్మల్ని నిలదీస్తున్నది..? ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్టులు, హౌస్‌ అరెస్టులు, బైండోవర్లు చేయడం ఏమిటి? వేల మంది పోలీసుల్ని మోహరించడం ఏమిటి? తప్పు చేస్తున్నారు చంద్రబాబు`` అంటూ ట్వీట్‌ చేశారు.

మ‌రోవైపు హౌస్‌ అరెస్ట్‌పై ముద్ర‌గ‌డ సైతం స్పందించారు.తనను హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముద్రగడ తాను తీవ్రవాదిని కానని, కేసులుంటే అరెస్ట్‌ చేయండని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నిరోజులు అడ్డుకున్నా పాదయాత్ర ఆగదని, ఖచ్చితంగా పాదయాత్రను చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజా స్వామ్యమా..? లేక పోలీస్‌ రాజ్యమా ? అని ముద్రగడ ప్రశ్నించారు. పాదయాత్ర చేసేందుకు వీలులేదని తనను అడ్డుకుని గృహ నిర్భంధం చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన హక్కుల్ని కాలరాస్తున్నారని, తమ జాతికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని వాపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగేందుకు పాదయాత్ర చేపడుతుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం పాదయాత్రకు అనుమతి ఇచ్చేంత వరకూ ప్రతిరోజు ఉదయం 9-10 గంటల మధ్యలో కాపులంతా కిర్లంపూడి రావాలని పిలుపునిచ్చారు. ఇదిలాఉండ‌గా ముద్ర‌గ‌డ హౌస్ అరెస్ట్ తీరును నిరసిస్తూ ఆయన మద్దతుదారులు కిర్లంపూడిలో రోడ్డెక్కారు.

మ‌రోవైపు ముద్రగడ రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసేందుకు తాము అనుమతులు తీసుకున్నామని, తనమాట నెగ్గించుకునేందుకే ముద్రగడ అనుమతి తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. అనుమతి లేనిదే ఎట్టిపరిస్థితుల్లోనూ పాదయాత్ర జరగనివ్వమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఇదిలాఉండ‌గా.... కాపులను బీసీల్లో చేర్చుతానని ఎన్నికల ముందు వాగ్ధానం ఇచ్చి సమస్య సృష్టించిన చంద్రబాబే దీనికి పరిష్కారం చూపాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు డిమాండ్‌ చేశారు. ఈ సమస్యను విపరీతంగా పోలీసులను ఏర్పాటు చేసి పరిష్కరించేది కాదు.. శాంతిభద్రతల సమస్య అంతకంటే కాదని చెప్పారు. ఏ చట్ట పరిధిలో తూర్పుగోదావరిలో పెద్ద ఎత్తున పోలీసులను ఏర్పాటు చేశారని కన్నబాబు డీజీపీని ప్రశ్నించారు. చట్టాలు కేవలం ప్రజలు మాత్రమే వర్తిస్తాయా.. ప్రభుత్వానికి వర్తించవా అని నిలదీశారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చమని జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు శాంతిభద్రతల కోణంలో చూస్తూ పోలీసులను ప్రయోగిస్తూ సమస్యను పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య దేశం అనేక ఉద్యమాలు, చాలా ప్రభుత్వాల ఉక్కుపాదాలు చూసిందని, ఎవరూ భయపడే పరిస్థితుల్లో లేరన్నారు. ఇచ్చిన హామీలను మీరెప్పుడైనా చదువుకున్నారా అని చంద్రబాబును ప్రశ్నించారు. కేవలం కాపులకే కాకుండా ఎన్నో కులాలు, సామాజిక వర్గాలకు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం వేరొకరి మీద నిందమోపడం సరికాదని చెప్పారు.

ముద్రగడ దీక్ష చేస్తున్న సమయంలో ఏడు నెలల్లో మంజునాథ కమిసన్‌ నివేదిక ఇస్తామని, ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో అనుమానం పెరిగి కాపులంతా ఉద్యమానికి శ్రీకారం చుట్టారని క‌న్నబాబు తెలిపారు. నివేదికపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ప్రజల గొంతు నొక్కడం సరైన విధానం కాదన్నారు. కాపులు ఒకరే కాదు.. భవిష్యత్తులో అనేక కులాలు రోడ్డు ఎక్కి ప్రభుత్వానని నిలదీసే పరిస్థితులు వస్తాయని క‌న్న‌బాబు హెచ్చరించారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుంటున్నాడన్నారు. కొన్ని సమాజిక వర్గాల మధ్య గొడవలు సృష్టించే నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉందని, పోలీసులు వారిపై నిఘా పెట్టాలని కన్నబాబు కోరారు. అన్యాయంగా ఏ సంబంధం లేని వారిని పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టడం మంచిది కాదని చెప్పారు.