Begin typing your search above and press return to search.

హ్యాండిచ్చే నేత‌ల ఇష్యూపై జ‌గ‌న్ ఏమంటున్నారు?

By:  Tupaki Desk   |   7 Dec 2017 10:30 AM GMT
హ్యాండిచ్చే నేత‌ల ఇష్యూపై జ‌గ‌న్ ఏమంటున్నారు?
X
ఒక జెండా మీద గెలిచిన ఎమ్మెల్యేలు మ‌రో జెండా మోయ‌టానికి వెళ్లిపోవ‌టం ఇప్పుడు కామ‌న్ అయిపోయింది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో అధికార‌ప‌క్షాలు చేస్తున్న వికృత రాజ‌కీయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ త‌ర‌హా రాజ‌కీయాలు రోజులు గ‌డుస్తున్న కొద్దీ అంత‌కంత‌కూ పెరిగిపోవ‌ట‌మే కాదు.. ఒక దారుణ‌మైన రాజ‌కీయ ప్ర‌క్రియ దిశ‌గా సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఇలాంటి జంపింగ్‌నేత‌ల్ని ప్ర‌జ‌లు చీ కొడుతున్నా ప‌ట్టించుకోని అధికార‌ప‌క్షం.. వారి కార‌ణంతో త‌మ బ‌లం మ‌రింత పెరిగింద‌ని మురిసిపోతున్నారు.

అయితే.. వాస్త‌వం అందుకు భిన్నంగా ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించ‌టం లేదు. ఇదిలా ఉంటే.. జంపింగ్ నేత‌లు పోతున్న వేళ‌.. విప‌క్షంలో నేత‌లు అన్నోళ్లు ఉండ‌రంటూ ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో నిజం ఎంత‌? జ‌ంపింగ్ నేత‌ల విష‌యంలో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న ఏమిటి? ఆయ‌నేం అనుకుంటున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఇలాంటి సందేహాల‌కు స‌మాధానాలు ఇచ్చారు జ‌గ‌న్‌.

ఎన్నిక‌ల వేళ‌కు పార్టీలో మీరొక్క‌రే మిగులుతారంటూ అధికార ప‌క్ష నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. "ఎవరో ఒక మనిషిని తీసేస్తేనో - ఒక లీడర్‌ నో - ఒక ఎమ్మెల్యేనో తీసేస్తేనో పార్టీ ఉండదన్న తప్పుడు అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి ఆలోచన చేయడం మూర్ఖత్వం. 2011లో పార్టీ పెట్టినప్పుడు నేను, అమ్మ మాత్రమే ఉన్నాం. 175 సీట్లలో పులివెందుల తప్ప మిగతా 174 ఖాళీయే. ఆ తర్వాత ప్రజలు దీవించారు, దేవుడు ఆశీర్వదించారు. ఈ నాయకుడు కాకపోతే ఇంకో నాయకుడు మన జెండా మోస్తారు. ఒక నాయకుడు పోతే ఇంకొకరు వస్తారు. ప్రజలు వాళ్లవైపు నిలుస్తారు. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలి. అవతలి మనిషికి రూ.25 కోట్లో - రూ.30 కోట్లో ఇచ్చి పదవుల వ్యామోహం చూపించి తీసుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.

"చంద్రబాబు లాంటి వ్యక్తులు వాళ్లకు హామీలు ఇవ్వడం - ప్రలోభ పర్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజ్యాంగం ప్రకారం చట్టం చేయాల్సిన చట్టసభల్లోని వ్యక్తులే చట్టాలకు తూట్లు పొడుస్తూ ఉంటే చంద్రబాబు అనుకూల మీడియా ఆహా ఓహో అంటూ కీర్తిస్తూ ప్రచారం చేస్తుండటం - తప్పును తప్పు అని చెప్పలేకుండా ఉండడం విస్మయం కలిగిస్తోంది" అని చెప్పారు. ఎమ్మెల్యేల్ని ఎందుకు నిల‌బెట్టుకోలేక‌పోతున్నార‌ని నింద‌లు వేస్తున్నారు క‌దా? అన్న సందేహానికి జ‌గ‌న్ స‌మాధాన‌మిస్తూ.. ఎమ్మెల్యేల్ని నిల‌బెట్టుకోవ‌టం లేదూ అంటే నేను కూడా రివర్స్‌లో రూ.25 కోట్లో - రూ.30 కోట్లో ఇవ్వాలి.. అయితే నా ద‌గ్గ‌ర‌ అంత డబ్బు నా దగ్గర లేదన్నారు. "చంద్రబాబు అవినీతితో విపరీతంగా సంపాదించాడు కాబట్టి కొంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు కాబట్టి ఆ పని చేస్తున్నాడు. కానీ, నాకు ప్రజలపై - దేవుడిపై విశ్వాసం ఎక్కువ. మనుషులకు వ్యక్తిత్వం ఉండాలని నేను ఆశిస్తా. నేనూ అలాగే ఉంటా. నాతోపాటు నడిచే ఎమ్మెల్యేలు - నాయకులూ అలాగే ఉండాలని భావిస్తా. అప్పుడు మాత్రమే ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకోగలుగుతాం. ఒక నాయకుడు పోతే ఇంకొకరు ఆ ఖాళీని భర్తీ చేస్తారు. ప్రజలే నాయకులను తయారు చేస్తారు" అని చెప్పారు.