Begin typing your search above and press return to search.

రైతు భరోసాతోనే రైతు కుటుంబానికి భ‌రోసా..

By:  Tupaki Desk   |   15 Oct 2019 8:34 AM GMT
రైతు భరోసాతోనే రైతు కుటుంబానికి భ‌రోసా..
X
దేశానికి వెన్నెముక రైతు.. ఆ రైతే రాజు అయిన‌ప్పుడే దేశం బాగుప‌డుతుంది అని దివంగ‌త‌ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు రైతుల కోసం ప్ర‌వేశ‌పెట్టారని సీఎం జ‌గన్ అభిప్రాయం. అందుకే రైతు సంక్షేమ కోసం అధికారంలోకి రాగానే రైతు భ‌రోసా కార్య‌క్ర‌మం ఏర్పాటు చేస్తూ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ రైతు భ‌రోసాతోనే రైతు కుటుంబానికి త‌ద్వారా దేశానికి భ‌రోసా క‌లుగుతుంద‌ని జ‌గ‌న్ ఆలోచించి రైతు భ‌రోసా కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ రైతు భ‌రోసా కార్య‌క్ర‌మంలో భాగంగా ఈరోజున శ్రీ‌పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లిలో లాంఛ‌నంగా సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు.

వైఎస్సార్ రైతు భ‌రోసా - పీఎం కిసాన్ ప‌థ‌కం పేరుతో రైతుల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాంతో దాదాపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని 40 ల‌క్ష‌ల మందికి మేలు జ‌రుగుతుంది. ఈ ప‌థకంతో ఏపీలోని ప్ర‌తిరైతుకు ఏడాదికి రూ.13500లు ముట్ట‌నున్నాయి. రైతులు త‌మ పెట్టుబ‌డి కోసం ఈ సొమ్ము ఎంతో ఉప‌యోగ ప‌డుతుంది. అందుకే ముందుగా సీఎం జ‌గ‌న్ రైతు భ‌రోసా కింద ఏడాదికి రూ.12500 ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కానీ ఎందుకో దానికి మ‌రో రూ.1000 అద‌నంగా క‌లిపి దాన్ని రూ.13500లుగా నిర్ణ‌యించారు. మేలో రూ. 7,500, అక్టోబర్‌లో రూ.4,000, సంక్రాంతికి రూ.2,000 రైతుల అకౌంట్‌లోకి నేరుగా జమచేస్తాం.

ఇక ఈ ప‌థ‌కం ప్రారంభ విష‌యానికి వ‌స్తే మంగ‌ళ‌వారం ఉద‌యం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలో ప్రారంభించిన జ‌గ‌న్ దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం.... మాజీ రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్‌ అబ్దుల్‌ కలాం చిత్రపటానికి సీఎం వైఎస్‌ జగన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ ప‌థ‌కం ప్రారంభంతో దాదాపు 40ల‌క్ష‌ల రైతులు కుటుంబాల్లో వెలుగు నిండ‌నున్నాయి. వాస్త‌వానికి ఈ ప‌థ‌కం 2020 ఏడాదిలో ప్రారంభించాల‌ని అనుకున్నారు. కానీ జ‌గ‌న్ రైతులుకు త‌క్ష‌ణ‌మే మేలు చేయాల‌నే ఆలోచ‌న‌తో ఈ ప‌థ‌కాన్ని ఐదేళ్ల‌కు పెంచి - వెంట‌నే ప్రారంభించాల‌ని అనుకున్నారు. అనుకున్న‌దే త‌డువుగా ఈ ప‌థ‌కం ప్రారంభించారు. దీంతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.