Begin typing your search above and press return to search.

వైసీపీకి కొత్త‌ టెన్షన్‌

By:  Tupaki Desk   |   28 July 2015 3:30 PM GMT
వైసీపీకి కొత్త‌ టెన్షన్‌
X
వైసీపీకి కొత్త టెన్షన్‌ పట్టుకుంది. తమ పార్టీలో ఎవరెవరు చేరాలనుకుంటున్నారో... వారి పేర్లు చేరిక‌కు ముందే లీకవుతుండటం తమకు తలనొప్పిగా మారిందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఇచ్చిన షాక్‌... వైసీపీకి చాలా గుణపాఠాలే నేర్పుతోంది. వైసీపీలో చేరతానని చెప్పిన డొక్కా...టీడీపీ ఎంపీ, డొక్కా రాజ‌కీయ గురువు అయిన రాయపాటి సాంబ‌శివ‌రావు ఎంట్రీతో మనసు మార్చుకొన్నారు. అసలు డొక్కా చేరిక గురించి ముందుగా మీడియాకు పార్టీ నేత‌లు లీకులు ఇవ్వ‌డం వల్లే రాయపాటి ఎంటరయ్యారని ఇలా జ‌రిగింద‌ని భావిస్తున్నారు. నేరుగా వైసీపీ అధినేత జగన్‌ ను కలిసి పార్టీ కండువా కప్పుకొని ఉంటే...ఇలా జరిగేది కాదన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మ‌రోవైపు ఈ వ్యవహారాన్ని డీల్‌ చేసిన అంబటి రాంబాబు ఇరుక్కుపోయారు. డొక్కా చివరికి హ్యాండ్‌ ఇవ్వడంతో ఇబ్బంది పడ్డ అంబటి పార్టీ పెద్దలకు ఏం చెప్పాలో తెలియక స‌త‌మ‌త‌మ‌తున్నారని సమాచారం.

డొక్కా వ్యవహారంతో ఓ గుణపాఠం నేర్చుకున్నట్టు ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇకపై పార్టీలో చేరికలేవి ఉన్నా... మీడియాకు లీక్‌ కాకుండా జాగ్రత్తపడాలని ముఖ్యనేతలు సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఆనం బ్ర‌దర్స్ చేరిక విష‌యంలో పార్టీ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలోనే ఈ వార్త‌లు ఎలా మీడియాకు పొక్కాయి? పెద్ద ఎత్తున ఎలా ప్ర‌చారం అయ్యాయి? అని పార్టీలో అంత‌ర్గ‌తంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. భవిష్యత్తులో లోటస్‌ పాండ్‌ వైపు అడుగులు వేసే వారి గురించి జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఆ క్ర‌మంలో జ‌రిగే చ‌ర్చ‌ల‌ను సైతం సీక్రెట్‌ గా ఉంచాల‌ని జగన్ పార్టీ శ్రేణుల‌కు సీరియస్‌గా చెప్పిన‌ట్లు స‌మాచారం.