Begin typing your search above and press return to search.

20 ల‌క్ష‌ల మందికి బాబు మోసం

By:  Tupaki Desk   |   23 March 2017 11:34 AM GMT
20 ల‌క్ష‌ల మందికి బాబు మోసం
X
అగ్రిగోల్డ్ అంశంపై చ‌ర్చ‌ సంద‌ర్భంగా స‌భ‌లో అధికార‌ - ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వాదోప‌వాదాలు జ‌రిగాయి. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ వివ‌రించారు. అగ్రిగోల్డ్ పై చర్చ జరుగుతున్నప్పుడు దాదాపుగా 20 లక్షల కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తే చంద్రబాబు మాత్రం త‌న‌దైన శైలిలో దాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని జ‌గ‌న్ అన్నారు. స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడలేదు. కానీ దాన్ని పక్క‌దారి ప‌ట్టించేందుకు ఎప్పుడో 40 రోజుల కిందట ఏపీలో జరిగిన మహిళా పార్లమెంట్ సదస్సు ప్రస్తావనకు తెచ్చారు. త‌ద్వారా అగ్రిగోల్డ్ టాపిక్ పక్కకు పోయేలా చేశారు. మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా మీడియాతో స్పీకర్ మాట్లాడుతూ మహిళలు ఇంట్లోనే ఉంటే అత్యాచారాలు జరగవన్నారు. కార్లు షెడ్ లో ఉండాలి. ఆడవాళ్లు వంటింట్లో ఉండాలని స్పీకర్ అన్న మాటలు ఇవాళ సభలో ప్రస్తావనకు తేవ‌డం ఏంటి? వాటి ఆధారంగా సాక్షిపైనే విమ‌ర్శ‌లు ఎందుకు? ఈ మాటలు అన్ని ఛానల్స్ లో ప్రస్తావనకు వచ్చాయి. ఏపీ ఛానల్స్ మాత్రమే కాదు.. నేషనల్ ఛానల్స్ కూడా ప్రసారం చేశాయి. ఢిల్లీలో ఎమ్మెల్యేలు స్పీకర్ వ్యాఖ్యల్ని ఖండించారు. ఇండియాటుడే - హెడ్ లైన్స్ టుడే - టైమ్స్ టుడే - డక్కన్ క్రానికల్ - డీఎన్ ఏ - వీ6 - ఎన్టీవీ - టీవీ9 - అన్ని ఛానల్స్ వేశాయి. అందరూ వేసినా.. చంద్రబాబు డైరెక్షన్ కాల్వ శ్రీనివాసులు యాక్షన్ స్పీకర్ రియాక్షన్ కలసి వచ్చి...అగ్రిగోల్డ్ టాపిక్ పక్కకు పోయేలా స్కెచ్ వేశారు" అని అన్నారు.

మహిళా పార్లమెంట్ సదస్సుకు సంబంధించిన కామెంట్లు అన్ని ఛానల్స్ ప్రసారం చేస్తే.. కేవలం సాక్షి మాత్రమే టెలికాస్ట్ చేసినట్లు - రాసినట్లు దాన్ని ప్లే చేయటం కోసం సభను వాయిదా వేశార‌ని, దాన్ని టీవీల్లో చూపించటానికి సభా సమయాన్ని వాడుకుంటున్నారని జగన్ అన్నారు. అయితే ఇది సభకు సంబంధంలేని అంశమన్నారు. స్పీకర్ ఎక్కడో సభ పెట్టి అంటే.. దాన్ని చూపించటం కోసం సభా సమయం కేటాయించటం దారుణమన్నారు. జాతీయ న్యూస్ ఛానల్స్ , పేపర్స్ రాస్తే.. చంద్రబాబు డైరెక్షన్ మేరకు సాక్షి వేసింది మాత్రమే చూపించే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్యం బతకాలంటే.. అందరూ ఒకతాటి మీదకి రావాలని జ‌గ‌న్ కోరారు. "న్యూస్ ఛానల్స్ - పేపర్ నచ్చకపోతే ఇష్టమొచ్చినట్లు తీర్మానాలు చేసేసి, చర్యలు తీసుకునే అవకాశాలు కల్పిస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంది. ఇదే న్యూస్ ఛానల్స్ లో చంద్రబాబు అన్న మాటల్ని ప్లే చేయలేదు. ఇదే చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీని గెలిపించేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయ‌డానికి సూట్ కేసుల్లో నల్లధనం తీసుకువెళ్లి.. ఆడియో- వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో సుప్రీంకోర్టు వాజ్యాన్ని విని నోటీసులు ఇచ్చిన పరిస్థితిలో కూడా ఆ టేపులు ప్లే చేయాలని చంద్రబాబుకు, స్పీకర్ కు అనిపించలేదు. సభకు సంబంధంలేని స్పీకర్ వ్యాఖ్యల్ని అన్ని ఛానల్స్ తో పాటు సాక్షి కవర్ చేస్తే.. దాని మీద యాక్షన్ తీసేందుకు ప్రదర్శిస్తున్నారు" అంటూ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం స్టేట్ మెంట్ ఇచ్చి.. డిబేట్ లేకుండా చేయటానికి ప్రయత్నిస్తోందని జ‌గ‌న్ మండిప‌డ్డారు. "ఆగ్రిగోల్డ్ మీద బాధితులు 20 లక్షల మంది ఉన్నారు. 19.5లక్షల బాధితులు ఏపీలో ఉన్నారు. అందులో 13లక్షల83వేల మందికి రూ.1182 కోట్లు చెల్లిస్తే వాళ్ల జీవితాలు బాగుపడతాయి. వారు ప్రధానమైన డిమాండ్ అడుగుతున్నారు. అగ్రిగోల్డ్ కు 18వేల ఎకరాలకు పైగా భూములున్నాయి. 90వేల చ.గజాల అర్బన్ ప్రాపర్టీ ఉంది. దీని విలువ రూ.7600 కోట్లు. ఇంత విలువ చేసే భూములు ఉన్నా.. ఒకటిన్నర సంవ‌త్స‌రం నుంచి 1600కోట్లు మాత్రమే అమ్మారు. మేమంతా నాశనమయ్యే పరిస్థితుల్లో ఉన్నామని అగ్రిగోల్డ్ బాధితులు అంటున్నారు. వడ్డీలు కట్టే పరిస్థితులు లేవు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నామంటున్నారు. వారందరికీ ప్రభుత్వమే డిపాజిట్లు చెల్లించి వారికి ఉపశమనం కల్పించాలని అగ్రిగోల్డ్ బాధితులు తమ ప్రధాన డిమాండ్ కోరుతున్నారు. ఆ రూ.1182 కోట్లు ఇస్తే 14 లక్షల మందికి న్యాయం జరుగుతుందని వారిని పూర్తిగా వదిలేశారు. 105 మంది చనిపోయారు." అంటూ జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు .తాము వాయిదా తీర్మానం ఇచ్చాక చనిపోయిన కుటుంబాలకు 3 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారని వివ‌రించారు. ఇవాళ చంద్రబాబు రాక్షసపాలన కనిపిచిందని జ‌గ‌న్ మండిప‌డ్డారు. హిట్లర్ పుట్టింది.. ఏప్రిల్ 20 తారీఖు. చంద్రబాబు కూడా అదే రోజు పుట్టారని జగన్ ఎద్దేవా చేశారు. "అగ్రిగోల్డ్ ఆస్తుల్లో హాయ్ ల్యాండ్ ఆస్తులు అమ్మకాలకు ఎందుకు రావటం లేదు? విశాఖలో యారాడ వద్ద ఉన్న ప్రైమ్ ప్రాపర్టీ అమ్మకానికి ఎందుకు రావటం లేదు? వీటన్నింటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రత్తిపాటి పుల్లారావు కోసం స్పీకర్ ను, సభను వాడుకుంటున్నారు. ప్రివిలేజ్, హౌస్ కమిటీ అంటున్నారు కానీ ఆ కమిటీల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి"అని జ‌గ‌న్ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/