Begin typing your search above and press return to search.

బాబుకు నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ ఇచ్చిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   20 March 2017 2:08 PM GMT
బాబుకు నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ ఇచ్చిన జ‌గ‌న్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సెటైర్ల‌తో కూడిన విమ‌ర్శ‌లు చేశారు. అభివృద్ధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముందుంద‌ని పేర్కొంటూ టీడీపీ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. విష‌యం తెలియ‌ని విప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ ఏపీ నంబ‌ర్ వ‌న్ అనే విష‌యంలో సీఎం చంద్ర‌బాబు కీల‌క విష‌యం ఒక‌టి మ‌ర్చిపోయారని అన్నారు. ఎన్‌ సీఏఈఆర్ సర్వే ప్రకారం అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్థానంలో ఉందని తేలిందని జగన్ అన్నారు. ఈ నంబ‌ర్ వ‌న్ ర్యాంకింగ్ ఘ‌న‌త కూడా టీడీపీ ఖాతాలో వేసుకోవాల‌ని ఎద్దేవా చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం తీరును జ‌గ‌న్ త‌ప్పుప‌ట్టారు. విద్యుత్‌ కు సంబంధించిన డిస్కమ్‌ లు నష్టాల్లో ఉంటే మనకు ఐదు అవార్డులు వచ్చాయని చంద్రబాబు మభ్యపెడుతున్నారని జగన్‌ మండిపడ్డారు. ఈ డిస్కమ్‌ లు రూ.2400 కోట్లు నష్టాల్లో ఉన్నాయని, అయినా ఐదు అవార్డులు వచ్చాయని అసత్యాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఎన్నికలకు ముందుకు కాపులకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విస్మరించారని జగన్ త‌ప్పుప‌ట్టారు. కాపులకు సంబంధించి ప్రతి ఏటా బడ్జెట్లో వెయ్యి కోట్ల కేటాయిస్తానని హామీ ఇచ్చారని, అయితే టీడీపీ కేటాయించింది కేవలం రూ.380 కోట్లు మాత్రమే అన్నారు. మంజునాథన్‌ కమిషన్‌ వేసి 8 నెలల్లో రిపోర్టు వస్తుందని చెప్పినా ఇంతవరకు ఎలాంటి నివేదికలు రాలేదని ఆక్షేపించారు. మైనార్టీలపై చంద్రబాబు ప్రేమ ఒలకబోశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 4800 మసీదులకు ప్రభుత్వం కేవలం రూ.3.50 కోట్లు ఇచ్చి గొప్పలు చెబుతున్నారని జ‌గ‌న్ మండిపడ్డారు. వరుస మూడేళ్లుగా కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాను నాలుగు రోజుల్లో కరువు వెళ్లిపోయిందని ప్రభుత్వం అసత్య ప్రచారం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు నిజాలు చెప్పి ఉంటే సంతోషించేవాళ్లమని, ఇలా కట్టుకథలు చెప్పి ప్రజలను మోసం చేయడం సరికాదన్నారు. కరువును పారద్రోలేందుకు ఎయిర్‌గన్లు కొనుగోలు చేసిన దానికంటే, వాటిని ఆపరేట్‌ చేసేందుకు అంతకంటే ఎక్కువ నిధులు ఖర్చు చేశారని, నిధులు దుర్వినియోగానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని చెప్పారు.

ఇదిలాఉండ‌గా...అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సంద‌ర్భంగా స‌భ‌లో ఒకింత గంద‌ర‌గోళం నెల‌కొంది. వైఎస్‌ జగన్‌ మాట్లాడుతుండగా స్పీకర్ కోడెల శివప్ర‌సాద‌రావు మైక్‌ కట్‌ చేశారు. దీంతో తమ నేతకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు కోరుతూ స్పీకర్ పోడియం వ‌ద్ద‌కు చేరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/