Begin typing your search above and press return to search.

బాబును యావత్ తెలుగుజాతి ఏమంటోందో చెప్పిన జగన్

By:  Tupaki Desk   |   16 Feb 2017 10:15 AM GMT
బాబును యావత్ తెలుగుజాతి ఏమంటోందో చెప్పిన జగన్
X
ఏపీకి ప్రత్యేక హోదా మీద ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మరోసారి గళం విప్పారు. హోదా సాధన కోసం తరచూ ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించటమే కాదు.. హోదాతో ఎంత లాభం.. ఏపీకి ఏం వస్తుందో చెబుతున్న ఆయన.. ఏపీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత నష్టం చేస్తున్నారన్న విషయాన్ని వివరంగా చెప్పుకొచ్చారు. గుంటూరు సమీపంలోని నల్లపాడులో నిర్వహించిన ‘యువభేరీ’లో ఏపీ సీఎం తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. రాష్ట్రానికి హోదా రావటం ఆలస్యమయ్యే కొద్దీ జరిగే నష్టాన్ని కళ్లకు కట్టేలా వివరించారు. హోదాపై బాబుతీరుపై ఏపీ ప్రజలేం అనుకుంటున్నారో చెప్పిన జగన్.. బాబు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఏమన్నారో.. ఆయన మాటల్లో చూస్తే..

= ఏ దేశమైనా - రాష్ట్రమైనా.. గ్రామమైనా.. కుటుంబమైనా ఏం కోరుకుంటుంది? మొన్నటి కంటే నిన్న. నిన్నటి కంటే నేడు. నేటి కంటే రేపు బాగుండాలనేకోరుకుంటారు. దీన్నేఆర్థిక శాస్త్రంలో ‘‘సస్టెయినబుల్ డెవలప్‌ మెంట్’’ అంటారు. ఇంతకుముందు సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకుంటూ.. మరింత ప్రగతి సాధించడం దాని అర్థం. ఒక కుటుంబాన్నే తీసుకుంటే తాత కంటే తండ్రి - తండ్రికంటే కొడుకు ఎక్కువ చదువుకోవాలి, ఆర్థిక పరిస్థితి - నివసించే ఇల్లు - మొత్తం జీవితం నాణ్యత మెరుగుపడాలి. దీన్ని సస్టెయినబుల్ డెవలప్‌ మెంట్ అంటారు. అది కుటుంబానికి రాష్ట్రానికి చాలా అవసరం.

= ఇక్కడున్న చాలామంది దగ్గర 3జీ - 4జీ మొబైల్స్ కనిపిస్తాయి. మీ తల్లిదండ్రుల చిన్నతనం గురించి అడిగితే.. 40 ఏళ్ల క్రితం ఇంట్లో ఫోన్ ఉంటే చాలా సంపన్నుల కుటుంబం అనేవారు. ట్రంక్ కాల్ బుక్ చేస్తే ఆ రోజు కనెక్ట్ కాదు.. మర్నాడు వచ్చేది. బైకులు అందుబాటులో లేవు. కార్లు కూడా అరుదుగా ఉండేవి. కరెంటులేని ఇళ్ల కథ దేవుడెరుగు.. కరెంటు లేని గ్రామాలు కనిపించేవి. టీవీ చూడాలంటే ఊరంతా ఒక్కచోట ఏకం కావాలి.. ఆ ఒక్క ఇంట్లోనే దూరదర్శన్ మాత్రమే చూసేవారు. పూరిగుడిసెలు ఉండేవి తప్ప మేడలంటే ఏంటో తెలిసేది కాదు. ప్రభుత్వ బడుల్లో కూడా చదివించే స్థోమత లేక తల్లిదండ్రులు అగచాట్లుపడేవారు. కడుపు మాడ్చుకుని, తమ కనీస అవసరాల్ని త్యాగం చేసి పైసలులెక్క పెట్టి పిల్లల్ని చదివించిన మహానుభావులు మనందరి తల్లిదండ్రులు.

= వాళ్ల గతం ఏంటో వాళ్లనే ఒక్కసారి అడిగి చూడండి.. మీ పెద్ద చదువుల వెనకపెద్ద మనసులు. వాళ్లు చేసిన పెద్ద త్యాగాలు ఉన్నాయి. ఆ తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తూ యువభేరిని మొదలుపెడుతున్నా. ప్రభుత్వం బాగుంటేపురోగతి బాగా కనిపిస్తుంది. అది బాగోకపోతే వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ నగరాన్నే మనం గమనిస్తే.. బీడీఎల్ - హెచ్ ఏఎల్ - బీహెచ్ ఈఎల్ ఫ్యాక్టరీలు - ఇక్రిశాట్ - మిధాని - సీసీఎంబీ - ఐఐసీటీ - ఈసీఐఎల్ - హెచ్ ఎంటీ - డీఆర్‌ డీఓ - డీఆర్‌ డీఎల్ - డీఎంఆర్ ఎల్.. ఇలా అనేక సంస్థలు కనిపిస్తాయి. హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరు అన్నీ ఈ 70 ఏళ్లలో ప్రభుత్వాలు అందించినతోడ్పాటుతో అభివృద్ధి చెందిన నగరాల జాబితాలో నిలిచాయి. మనం ఇప్పుడీ నగరాలతో మనం పోటీ పడాల్సి వస్తోంది. మరి.. కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా ఎలా పోటీ పడగలమని ప్రశ్నిస్తున్నా.

= రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లపోతే.. 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే మన పరిస్థితి ఏంటని అడుగుతున్నా. సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకోవాలి, మరో మెట్టుఎదగాలి. ఇలా ఎదగాలంటే దీనికి ప్రత్యేక హోదా అనే ఒకే ఒక్కటి బ్రహ్మాస్త్రంగా తోడైతేనే ఇది సాధ్యం అవుతుంది. ఈ విషయాలన్నీ ఈ ప్రభుత్వాలకు తెలియనివి కావు. గత ఎన్నికలకు ముందు వెంకయ్యనాయుడు - చంద్రబాబుకూడా హోదా గురించి మాట్లాడారు.

= ప్రత్యేక హోదా అంటే ఏంటంటే.. మన పిల్లలకు మన ప్రాంతంలోనే.. మనజిల్లాలోనే.. మన రాష్ట్రంలోనే మంచి జీతంతో మంచి ఉద్యోగాలు రావడం. ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి అవసరం లేకుండా.. ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి రావడమే ప్రత్యేకహోదా. ఇలాంటి ప్రత్యేక హోదాను దగ్గరుండి చంద్రబాబు కత్తితో పొడుస్తున్నారు. తాను పోరాటం చేయక పోగా చేసేవాళ్లను కూడా అణిచేస్తున్నారు.

= ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తే, దగ్గరుండి ఆర్టీసీ బస్సులు తిప్పిస్తారు. ధర్నాలు చేస్తే దగ్గరుండి ధర్నాలను నీరుగార్చే కార్యక్రమాలు చేస్తారు, ఎవరైనావస్తే పిల్లలని కూడా చూడకుండా వాళ్ల మీద పీడీయాక్ట్ పెట్టాలని ఆదేశిస్తారు. జనవరి 26న కొవ్వొత్తులతో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ర్యాలీలుచేయాలని తలపెడితే ఇదే చంద్రబాబు దగ్గరుండి ర్యాలీలో పాల్గొనకుండా ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎయిర్‌ పోర్టులోనే రన్‌ వే మీదే ఆపడాన్ని చూశాం.

= మనం బస్సు రోకో.. రైల్ రోకో చూసి ఉంటాం.. విమానాల రోకో కూడా చంద్రబాబు హయాంలో తొలిసారి చూశాం. గతంలో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్‌ అన్న మాటలు గుర్తుకొస్తాయి. సీజర్‌ ను తన స్నేహితుడు బ్రూటస్ కత్తితో వెన్నుపోటు పొడిచినప్పుడు ''యూ టూ.. బ్రూటస్'' అంటారు. సీఎం స్థానంలో ఉండి తెలుగుజాతి కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు యావత్ తెలుగుజాతి ''నువ్వు కూడానా చంద్రబాబూ'' అని ప్రశ్నిస్తోంది.

= హోదాయే సంజీవని అని ఆవాళ చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇదే చంద్రబాబు.. ఇదే వెంకయ్యనాయుడు ఇద్దరూ కలిసిఐదున్నర కోట్లమంది ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే యావత్ రాష్ట్రం నివ్వెరపోయి చూస్తోంది. తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనిఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. తెలుగు వాళ్ల ప్రయోజనాలను ఢిల్లీలో కాళ్ల మీద పారేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమో అనిపిస్తోంది. ఇంత దారుణంగా మన జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

= కేంద్రంలో ఉన్నవాళ్లు చంద్రబాబు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారు. పరిశ్రమలు రావాలంటే అవి పెట్టడానికే రెండు మూడేళ్లు పడుతుంది కాబట్టి ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని చెప్పారు. వెంకయ్యకూడా ఐదు కాదు.. పదేళ్లుహోదా ఇవ్వాలని పార్లమెంటులో చెప్పారు. అలాంటి వాళ్లిద్దరూ ఇప్పుడు హోదా గురించి పచ్చి అబద్ధాలు చెబుతూ.. మాటలు మారుస్తున్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం వస్తుందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

=ప్రత్యేక హోదాతో లాభం ఏమిటో చూద్దాం. ఇప్పటికే హోదా ఉన్న రాష్ట్రాలకు ఎంత ప్రయోజనం చేకూరుతుంతో మీకు చెబుతా. ప్రత్యేక హోదా కలిగినరాష్ట్రాలు దేశంలో 11 మాత్రమే ఉన్నాయి. వీటి జనాభా కేవలం 7.5 కోట్లు.2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ఇది 6.5 శాతం. ఈరాష్ట్రాలకు రూ.76980 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటులు ఇచ్చారు. మిగిలిన 93.5శాతం జనాభాకు రూ.1,86,820 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటులు ఇచ్చారు. అంటే.. 6.5 శాతం జనాభాకు 30 శాతం గ్రాంటులు ఇస్తున్నారన్న మాట.

= కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా చూద్దాం. ఏపీ విభజన జరగక ముందు జనాభా 8.54 కోట్లు. 2013-14లో చూసుకుంటే కేంద్రం నుంచివచ్చిన నిధులు రూ.32,460 కోట్లు వచ్చాయి. అంటే.. ఆ 11 రాష్ట్రాలకు కలిపినా ఆంధ్ర రాష్ట్ర జనాభా కంటే తక్కువే అయినా వారికి వచ్చిన గ్రాంటురూ.91,980 కోట్లు. ఇదంతా చంద్రబాబుకు కనిపించడం లేదా?

= కేంద్రప్రభుత్వం ఏపీకి శనక్కాయలు.. పప్పు బెల్లాల్లా చిన్న చిన్న పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. వాటిని చూసి ఎవరూ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకురావట్లేదు. ఇవే రాయితీలను పక్కనున్న తెలంగాణ.. పశ్చిమ బెంగాల్.. బిహార్రాష్ట్రాలకూ ఇచ్చారు.

= మన పక్కన బెంగళూరు.. చెన్నై.. హైదరాబాద్ లు ఉన్నాయి. ప్రత్యేక హోదాలేకుంటే వాటితో మనం ఎలా పోటీ పడగలం? ప్రత్యేక హోదా అన్నది ఒక్క జగన్ మాత్రమే పోరాడితే సాధ్యమయ్యే పనికాదు.. మనం అడగడం మానేస్తే ప్రత్యేకహోదా అడిగేవాడు ఎవ్వరూ ఉండరు. మనం గట్టిగా నిలదీస్తేనే వాళ్లుమర్చిపోకుండా ఉంటారు. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్లుసాధించుకున్నారు. పార్లమెంటు సాక్షిగా మనకిచ్చిన ప్రత్యేక హోదా మాటనుమనమంతా గట్టిగా నిలబడితే ఎందుకు సాధ్యం కాదని అడుగుతున్నా. రాబోయేరోజుల్లో ఇంకా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం.

= రేపు జూన్.. జూలై నెలల్లో కేంద్రంలో మోడీ సర్కారు.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి మూడేళ్లు ముగుస్తుంది.. అప్పుడు పార్లమెంటు సమావేశాలుఎప్పుడు ఏర్పాటైతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా రాజీనామాచేస్తారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా చేస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/