Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నిల‌దీత‌!... బాబూ బీసీ స‌బ్‌ ప్లాన్ ఏమైంది?

By:  Tupaki Desk   |   16 Oct 2017 10:14 AM GMT
జ‌గ‌న్ నిల‌దీత‌!... బాబూ బీసీ స‌బ్‌ ప్లాన్ ఏమైంది?
X
వైసీపీ అధినేత జగ‌న్.. బీసీల‌పై దృష్టి సారించారు. వారు అభివృద్ధి చెందితేనే స‌మాజం అభివృద్ధి ప‌థంలో న‌డుస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బీసీలో అనేక ఉప కులాలు ఉన్నాయ‌ని, వాట‌న్నింటికీ కూడా న్యాయం జ‌ర‌గాల‌ని అన్నారు. ఈ క్ర‌మంలో తాము త్వ‌ర‌లోనే బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు. సీఎం చంద్ర‌బాబు బీసీలను ఓటు బ్యాంక్‌ గానే చూస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా సీఎం అమలు చేయలేదని దుయ్య‌బ‌ట్టారు. జగన్ అధ్యక్షతన విజ‌య‌వాడ‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం బీసీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..‘రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ అని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పి... చంద్రబాబు మాట తప్పారు. కనీసం బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కూడా చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు పర్యటించాలి. చంద్రబాబు మోసాలను ఎండగట్టాలి. బీసీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరికీ వివరించాలి. బడుగు - బలహీన వర్గాల ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావాలి`` అని జ‌గ‌న్ అన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలోని బీసీల స్థితిగతులు - వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అనే దానిపై జగన్‌ నేతల‌ అభిప్రాయాలు తీసుకున్నారు.

తాను చేస్తున్న పాద‌యాత్ర ఈ ప్ర‌భుత్వానికి క‌ళ్లు తెరిపించాల‌ని, క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని జ‌గ‌న్ చెప్పారు. `` నేను పాదయాత్ర చేస్తున్న ఆరు నెలల్లో బీసీ నేతలు గ్రామాలకు వెళ్లి అన్యాయాలను ప్రజలకు వివరించాలి. పాదయాత్ర తర్వాత బీసీ జనగర్జన ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్‌ ప్రకటిద్దాం. ప్రతి కులానికీ న్యాయం జరిగేలా వైసీపీ బీసీ డిక్లరేషన్‌ ఉంటుంది. ప్రతి పేదవాడికి వైఎస్ పాలనను గుర్తు చేయాలి. అన్న వస్తున్నాడు., రాజన్న రాజ్యం వస్తుందని చెప్పండి’ అని సూచించారు.

ఆయా జిల్లాల్లో స్థానికంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, బీసీల విషయంలో పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరు, ఇలా అనేక అంశాలపై కూలంకుషంగా చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో నేతలు వ్యక్తపరిచే అభిప్రాయాలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు - వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిని క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో మరిన్ని దఫాలు సంప్రదింపులు జరిపి.. సమగ్రంగా రూపకల్పన చేశాక తగిన సమయంలో పార్టీ తరఫున ‘బీసీ డిక్లరేషన్‌’ను చేస్తారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో టీడీపీలో అల‌జ‌డి ఖాయం అని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.