Begin typing your search above and press return to search.

ఆ ప‌థ‌కాన్నిబ‌తికించండంటున్న జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   20 Jan 2017 1:57 PM GMT
ఆ ప‌థ‌కాన్నిబ‌తికించండంటున్న జ‌గ‌న్‌
X
ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో నేరుగా వారి వ‌ద్ద‌కే వెళ్లి తెలుసుకుంటున్న విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఈ క్ర‌మంలో ప్రకాశంలో జిల్లాలోని పీసీపల్లిలో ఫ్లోరోసిస్‌ - కిడ్నీ బాధితులతో స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా కిడ్నీ బాధితులు కిడ్నీ బాధితుల త‌మ ఆవేద‌న పంచుకుంటూ డ‌యాలసిస్‌ కు తమకు రూ.20 వేలు అవుతుందని వాపోయారు. స‌రైన వైద్యం అంద‌క‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని వాపోయారు. త‌మ ప్రాంతంలో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. వెలుగొండ జలాలకోసం పోరాటం చేయాలని ఆయనను కోరారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ త‌మ‌కు న‌చ్చిన ప్రాజెక్టుల కోసం వేల కోట్లు రూపాయ‌లు కేటాయిస్తున్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌లంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య శ్రీ విష‌యంలో మాత్రం ప‌ట్టింపులేన‌ట్లుగా ఉంద‌ని మండిప‌డ్డారు. ఆరోగ్యశ్రీ కోసం రూ.910కోట్లు కావాలని సంబంధిత శాఖ కోరితే రూ.568 కోట్లు మాత్రమే ఇవ్వ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఇందులో రూ.368కోట్లు బకాయిలకే సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ‌ని ప‌ట్టించుకోక‌వ‌పోవ‌డం - వైద్యం చేయించుకునేందుకు సొమ్ములు లేక‌పోవ‌డంతో పేదలు చనిపోతున్నారని జ‌గ‌న్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ప్రకాశం జిల్లాలో 424 మంది కిడ్నీ వ్యాధితో చనిపోయినా సర్కార్‌ పట్టించుకోవడం లేద‌ని మండిప‌డ్డారు. ఏ రోగికైనా క్యాన్సర్‌ వస్తే రూ.8లక్షలు అవసరం అవుతాయని, అది ప్రభుత్వం చేయాల్సిన బాధ్య‌త ఉండ‌గా...ఈ విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తోందని జ‌గ‌న్‌ మండిపడ్డారు. కిడ్నీ సమస్యతో చనిపోయినవారికి రూ.10లక్షలు ఇవ్వాలని - నెలకు మందుల కోసం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పది లేఖలు రాసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేద‌ని జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. కిడ్నీ సమస్యపై చంద్రబాబు ఇప్పటికైనా స్పందించకుంటే ఉధృతంగా పోరాటం చేసి తీరుతామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో చిన్నపిల్లలకు ఎలాంటి సమస్య వచ్చిన నాటి వైఎస్‌ సర్కార్‌ ఆదుకునేదని - కానీ ఈ ప్రభుత్వం వారికి రెండేళ్ల గడువు పెట్టి ఆరోగ్యాన్ని దూరం చేస్తోందని జ‌గ‌న్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 108కి ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ వస్తుందో లేదో తెలియడం లేదని, గత ఐదు నెలల నుంచి ఆశా వర్కర్లకు జీతాలే రావడం లేదని వైఎస్‌ జగన్‌ చెప్పారు. జిల్లాలోని 56 మండలాలకు 48 మండలాల్లో ఫ్లోరైడ్‌ సమస్యతో తాగడానికి నీళ్లు లేకుండా పోయాయని, వెలుగొండ ప్రాజెక్టు వస్తేనే ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య పోతుందని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి రాగానే వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులుపాలు కాకుండా చూసుకుంటానని, ఈ విషయం గతంలోనే చెప్పామని, ఒక వేళ వైద్యంలో భాగంగా ఇంటి వద్దే ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకుంటుంటే అతడి కుటుంబం నడిచేందుకు కావాల్సిన సహాయం కూడా చేస్తామని జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/