Begin typing your search above and press return to search.

కాకినాడ‌లో జ‌గ‌న్‌ కి హార‌తి ప‌ట్టారుగా!

By:  Tupaki Desk   |   27 Aug 2017 9:24 AM GMT
కాకినాడ‌లో జ‌గ‌న్‌ కి హార‌తి ప‌ట్టారుగా!
X
కాకినాడ కార్పొరేష‌న్‌ కి మంగ‌ళ‌వారం జర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార‌ - విప‌క్ష పార్టీల ప్ర‌చారం ఊపందుకుంది. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఎవ‌రికివారే త‌మ త‌మ ప్ర‌చారాల‌తో హోరెత్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆదివారం కాకినాడ‌లో ప్ర‌చారం ప్రారంభించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌ కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మ‌హిళ‌లైతే అడుగ‌డుగునా ఆయ‌న‌కు హార‌తి ప‌ట్టారు. జ‌న నేత‌కు యువ‌త జేజేలు కొట్టి హోరెత్తించారు. ఈ సంద‌ర్భంగా కాకినాడ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన జ‌గ‌న్‌.. టీడీపీ అధినేత‌ - సీఎం చంద్ర‌బాబుపై కౌంట‌ర్ల మీద కౌంట‌ర్లు పేల్చారు. బాబు చేసిన ప్ర‌తి విమ‌ర్శ‌కూ కౌంట‌ర్‌ తో బ‌దులిచ్చారు. దీంతో జ‌నాల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.

నిన్న కాకినాడ‌లో ప్ర‌చారం నిర్వ‌హించిన సీఎం చంద్ర‌బాబు.. వైసీపీకి ఓటేస్తే.. మురిగిపోతుంద‌ని టీడీపీకి మాత్ర‌మే ఓటేయాల‌ని పిలుపునిచ్చారు. దీనికి కౌంట‌ర్‌ గా జ‌గ‌న్‌.. టీడీపీకి వేసిన ఓటే మురిగిపోతుంద‌ని కౌంట‌ర్ వేశారు. ఒక్క ఏడాదిలోనే ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు నంద్యాల‌లో వెల్ల‌డించార‌ని, ఆ త‌ర్వాత రాష్ట్రంలో ఎలాగూ వైసీపీనే ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని జ‌గ‌న్ అన్నారు. దీంతో యువ‌త త‌మ చ‌ప్ప‌ట్లు ఈల‌ల‌తో ప్రాంగ‌ణాన్ని హోరెత్తించింది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్.. గ‌త మూడేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌పైనా దుమ్మెత్తి పోశారు. మూడున్నరేళ్లలో ఒక్క ఇల్లు కట్టించారా అని ప్రశ్నించారు. రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమైనా ఇచ్చారా అని నిలదీశారు.

38 నెలల తన పాలనలో చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికీ రూ.78 వేలు బాకీ పడ్డారన్నారు. బాబు వ‌స్తే.. జాబు వ‌స్తుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. త‌న కొడుక్కి మంత్రిగా ఉద్యోగం ఇప్పించుకోవ‌డం మిన‌హా రాష్ట్ర యువ‌త‌కు చేసింది ఏమీలేద‌ని నిప్పులు చెరిగారు. పేద‌ల న‌డ్డి విరిచేలా.. కరెంట్ బిల్లు, ఇంటి పన్ను అన్నీ పెంచారన్నారు. చంద్రబాబు జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పరన్నారు. కాగా, జగన్ మాట్లాడుతుండగా అభిమానులు సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాకినాడ కార్పొరేష‌న్‌లో బాబు ఎన్ని జిమ్మిక్కుల‌కు పాల్ప‌డ్డా వైసీపీ విజయం ఖాయ‌మ‌నే చ‌ర్చ మొద‌లైంది.