Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'రిటర్న్ గిఫ్ట్' పై జగన్ ఏమ‌న్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   17 Dec 2018 8:01 AM GMT
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై జగన్ ఏమ‌న్నారో తెలుసా?
X
రిట‌ర్న్ గిఫ్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవ‌ల బాగా పాపుల‌రైన ప‌దం ఇది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తాము వ‌స్తామ‌ని, చంద్ర‌బాబు క‌థ‌ల‌న్నీ బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో త‌మ‌కు చేస‌న‌దానికి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ క‌చ్చితంగా ఇచ్చితీరుతామ‌న్నారు. దీంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆ మాటపై విస్తృత చ‌ర్చ న‌డుస్తోంది. కేసీఆర్ మాట‌ల‌పై బాబు కాస్త భ‌యంభ‌యంగా స్పందించారు.

తాజాగా కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ మాట‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిపక్ష నేత - వైసీపీ అధినేత జ‌గ‌న్ స్పందించారు. రిటర్న్ గిఫ్ట్ అంటే ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని బాబును డిమాండ్ చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వ‌హించిన భారీ బహిరంగ సభలోజ‌గ‌న్ మాట్లాడుతూ.. "చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు టీఆర్ఎస్ నేతలు ఏపీకి వస్తామన్నారు. వాళ్లు ఇలా ప్రకటించిన వెంటనే ఊసరవెల్లి కంటే వేగంగా చంద్రబాబు రంగులు మార్చారు. ప్రత్యేక హోదాను టీఆర్ ఎస్ వ్యతిరేకించింద‌ని.. అలాంటి పార్టీ ఏపీకి రావడం ఏంట‌ని ప్ర‌జ‌ల ముందు దొంగ ఏడుపు ప్రారంభించారు" అని విమ‌ర్శించారు.

నిజంగా ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ అడ్డుకుందని చంద్రబాబు భావిస్తే.. ఆ పార్టీతో పొత్తు కోసం తెలంగాణ‌లో ఎందుకు అర్రులు చాచారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా పొత్తు ప్ర‌తిపాద‌న తీసుకొచ్చింది నిజం కాదా అని నిల‌దీశారు. ఇప్పుడు టీఆర్ ఎస్ పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు ఆయ‌న రెండు నాల్క‌ల ధోర‌ణికి అద్దం ప‌డుతున్నాయంటూ విమ‌ర్శించారు. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి రంగులు మారుస్తూ చంద్ర‌బాబు ఊస‌ర‌వెల్లిని త‌ల‌పిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఈ పెద్దమనిషి బీజేపీతో కలిస్తే బీజేపీ మంచిది. కాంగ్రెస్ తో కలిస్తే కాంగ్రెస్ మంచిది. ఈ చంద్రబాబు మురికి కాలువలో దూకితే అదే గంగానది అని చెబుతాడు. ఆ స్థాయిలో చంద్రబాబు రాజకీయాల్ని బ్రష్టు పట్టించాడు అంటూ తీవ్ర‌స్థాయి విమ‌ర్శ‌లు గుప్పించారు. బాబు అవినీతిపై కాంగ్రెస్ గ‌తంలో పుస్త‌కం విడుద‌ల చేసిన సంగ‌తిని జ‌గ‌న్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ ఏక‌మ‌వ్వ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. బాబు అవినీతి సొమ్ములో కాంగ్రెస్ కు వాటా దొరికి ఉండొచ్చ‌ని ఎద్దేవా చేశారు.