Begin typing your search above and press return to search.

పాదయాత్ర నన్ను మార్చింది

By:  Tupaki Desk   |   18 July 2018 4:43 AM GMT
పాదయాత్ర నన్ను మార్చింది
X
ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నాయకుడు - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మారారు. గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డిలో ఎంతో మార్పు వచ్చిందని - దీనికి కారణం పాదయాత్రేనని ఆయనే స్వయంగా ఓ తెలుగు ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన తండ్రితో పోలిస్తే తనకు కోపం నరం లేదని - నిజానికి తనకు కోపం అనే నరమే లేదని చెప్పారు. "దేవుడి దయ వల్ల నాకు కోపం అనే నరం లేదు. నాకు కోపం రాదు" అని ఆయన అన్నారు. పాదయాత్ర కారణంగా తనలో ఎంతో మార్పు వచ్చిందని, గతంలో చూసిన జగన్‌ కు... ఇప్పుడు చూస్తున్న జగన్‌ కు ఎంతో వ్యత్యాసముందని ఆయన చెప్పారు.

' అవును.. నాలో చాలా మార్పు వచ్చింది. పాదయాత్రలో భాగంగా నేను చాలా మందిని కలిసారు. వారి కష్టాలు - కన్నీళ్లూ నన్ను కలచివేసాయి. వారి జీవితాల పట్ల ప్రేమ పెరిగింది" అని ఆయన అన్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో అనేక మంది వాళ్ల సమస్యలు చెబుతూంటే ఎంతో కలత చెందానని - వారి కష్టాలు తీర్చి మంచి జీవితాలను ఇవ్వడమే తన ముందున్న లక్ష్యమని జగన్ చెప్పారు. తాను ఎవరి మాట వినను అనడం తప్పు అని చెప్పిన తనకు నలుగురు సలహాలు ఇస్తే వాటిలో ఏది మంచిదో దానిని ఆచరిస్తానని చెప్నారు. " నలుగురు ఇచ్చిన సలహాల్లో ఏది బాగుంటే అదే తీసుకుంటా. దీంతో మిగిలిన ముగ్గురూ జగన్ మా మాట వినలేదు అని అనుకుంటారు " అని జగన్ స్పష్టం చేశారు. ఓదార్పు విషయంలో కూడా కాంగ్రెస్ వారించినా తాను అధిష్టానాన్ని కాదన్నానని, ఇది కూడా తాను మాట వినను అనడానికి ఓ కారణమైందని జగన్ చెప్పారు. " నాన్న మరణించిన ప్రదేశానికి వెళ్లాను. అక్కడ జరిగిన సంతాప సభలో మాట్లాడాను. నాన్న మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారందరిని కలుస్తానని ఓ ఆవేశంలో చెప్పాను. వారంతా నా కుటుంబ సభ్యులే అనుకన్నాను. అందుకే కచ్చితంగా ఓదార్పు యాత్ర చేయాల్సి వచ్చింది. అధిష్టానం చెప్పినా వినలేదు కాబట్టి నేను ఎవరి మాట వినను అని ప్రచారం చేశారు" అని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

తాను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తినని - చంద్రబాబు నాయుడిలా అసత్యాలు - శుష్క వాగ్దానాలు చేసి అధికారంలోకి రాలేనని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. " రాష్ట్రంలో రైతు రుణ మాఫీ అసాధ్యమని నాకు తెలుసు. అందుకే నేను ఆ హామీ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు మాత్రం ఆ హామీ ఇచ్చారు. దాంతో అధికారంలోకి వచ్చారు. రుణమాఫీ పూర్తిగా చేశారా... అదీ లేదు. " అని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.