Begin typing your search above and press return to search.

జగన్ ద్రోహుల చేతిలో ‘సాక్షి’ బందీ!!

By:  Tupaki Desk   |   21 Jan 2017 7:45 AM GMT
జగన్ ద్రోహుల చేతిలో ‘సాక్షి’ బందీ!!
X
‘సాక్షి’ తెలుగు జర్నలిజంలో రెండో కోణాన్ని ఆవిష్కరిస్తూ మొదలైన సంచలనం. అంత వరకూ కొంతమంది చేతిలోని మీడియా సామ్రాజ్యం తెలుగు ప్రజలకు కళ్లు - చెవులూ తనే అయ్యింది. ఆ మీడియా వర్గాలు నంది అంటే నంది, పంది అంటే పంది! తాము కోరుకున్న వాళ్లను అధికారంలో ‘ఉంచుకునేందుకు’ వీలుగా ప్రజలకు వార్తలను వండి వారుస్తూ వచ్చిన వారు ‘సాక్షి’ ఆరంభంతోనే కలవరపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘సాక్షి’ పై వారి దాడి కొనసాగుతూనే ఉంది.

అలాంటి మీడియా అధికార పార్టీలకు అనుంగులుగా ఉంటూ.. అనునిత్యం ‘సాక్షి’ పై దాడిని కొనసాగిస్తూనే ఉన్నా.. ఆ మీడియా గ్రూప్ ను లక్ష్యంగా చేసుకుని తమకు అయిన వారి చేత అస్త్రశస్త్రాలనూ సంధింపజేస్తున్నా..ఆ పేపర్ ను, టీవీని అరచేతిలో దాచుకుని కాచుకుంటోంది వైఎస్ ఫ్యామిలీ. స్వయంగా వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి చైర్మన్ హోదాలో ఉంటూ.. ‘సాక్షి’ ప్రమాణాలను, నవ్యతను కాపాడుకుంటున్నారు.

తెలుగు పాఠకుల ఆదరణను కూడా చూరగొని, సర్క్యులేషన్ విషయంలో సగర్వంగా చెప్పుకోగల స్థాయిలో ఉన్న ‘సాక్షి’ పత్రిక కొన్ని చోట్ల, కొన్ని విషయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ద్రోహం చేసిన వారి చేతిలో బందీ కావడమే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం. ఎవరైతే జగన్ దయతో ప్రజాప్రతినిధి హోదాను సంపాదించుకున్నారో, ఎవరైతే జగన్ మోహన్ ను చూసి ప్రజలేసిన ఓట్లతో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో, ఎవరైతే కృతజ్ఞత, నైతిక విలువలు లేకుండా నీఛమైన ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడ్డారో.. అలాంటి వారి చేతిలోనే ఇప్పుడు ‘సాక్షి’ బందీ అయిపోయింది.

ఎవరి మీదనైతే ‘సాక్షి’ అంకుశంలా పనిచేయాల్సి ఉందో, ఎవరి విలువల హననాన్ని అయితే ‘సాక్షి’ ఎండగట్టాల్సి ఉందో.. వారి చేతికే అస్త్రంగా మారుతోంది ‘సాక్షి’. ఈ అంశం యాజమాన్యం దృష్టికి ఇంకా వెళ్లిందో లేదో కానీ, క్షేత్ర స్థాయి లో ‘సాక్షి’ తీరు ఆ పత్రిక పాఠకులను నివ్వెరపోయేలా చేస్తోంది!
ఇంతకీ ఏం జరుగుతోంది?

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి, ప్రజాదరణ పొంది.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో కొంతమంది పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. డబ్బుకోసం అమ్ముడుపోయి.. పచ్చ పార్టీ కండువాలు వేయించుకున్న సంగతి అందరికీ ఎరుకే. పార్టీ మరి, ప్రజలను వెక్కిరిస్తూ, తిరిగి ఎన్నికయ్యే దమ్ములేక పదవులకు రాజీనామా చేయని వాళ్లకు అనుకూలంగా పని చేస్తోంది ‘సాక్షి’. రక్తంచల్లబడి, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఫిరాయింపుదారులకు ‘సాక్షి’ ఇప్పటికీ బాగా ఉపయోగపడుతోంది!

ఫిరాయింపు దారులైన ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో.. తమ పరపతిని ఉపయోగించుకుని, ‘సాక్షి’లో కొంతమంది తమ వాళ్లను నియమించుకున్నారు. రిపోర్టర్లు, డెస్క్ ఇన్ చార్జిలు, కంట్రిబ్యూటర్ల స్థాయిల్లో వాళ్లు ఉన్నారు. అందరూ మన వాళ్లే కదా.. అనే పెద్ద మనసు వీళ్లకు అవకాశం ఇచ్చింది. వీళ్లను నియమించుకున్న ఎమ్మెల్యేలు తమ వార్తలను బాగా తీర్చిదిద్దుకోవడానికి బాగా ఉపయోగించుకున్నారు. అంత వరకూ బాగానే ఉండింది.

అయితే.. సదరు ఎమ్మెల్యేలు తమ మోసపూరిత వైఖరిని చాటుకున్నారు. పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డారు. విశ్వాసఘాతకులుగా నిలిచారు. ఇలాంటి వారిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలు కూడా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బుకు అమ్ముడుపోయిన వీరిని పరమ నీఛులుగా చూస్తోంది ప్రజానీకం.

అయితే.. విస్మయకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ‘సాక్షి’లో అగ్రతాంబూలం దక్కుతుండటం. మెయిన్ ఎడిషన్ సంగతి ఎలా ఉన్నా.. జిల్లా, నియోజకవర్గ సంచికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రథమ ప్రాధాన్యతను పొందుతున్నారు వైఎస్ ఫ్యామిలీ సొంత పత్రికలో. ఈ ఫిరాయింపు దారులను ప్రజలు నిలదీస్తున్న వైనం గురించి రాయాల్సిన పత్రికల్లో.. ఫిరాయింపుదారుల భజన జరుగుతోంది! ఆ ఎమ్మెల్యేల సిగ్గులేని తనాన్ని వివరించాల్సిన ‘సాక్షి’ వారి గురించి సానుకూల కథనాలను రాస్తోంది!

జిల్లా స్పెషల్స్, నియోజకవర్గ స్పెషల్స్ లో ఇలాంటి కథనాలు అగుపిస్తున్నాయి. కర్నూలు, అనంతపురం, ప్రకాశం వంటి జిల్లాల్లోని ఫిరాయింపుదారులు ఇప్పటికీ ‘సాక్షి’లో రాజాల్లాగా చెలామణి అయిపోతున్నారు! మరి దీనికంతటికీ కారణం ఏమిటి? అని ఆరా తీస్తే.. గతంలో వీళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నియమించిన ‘సాక్షి’ రిపోర్టర్లు, డెస్క్ ఇన్ చార్జిలు, కంట్రిబ్యూటర్లే అని తెలుస్తోంది. ఎమ్మెల్యేల సిఫార్సులతో జరిగిన ఆ నియామకాల్లో కుదురుకున్న వాళ్లు.. ఇప్పటికీ వారికి అనుకూలంగానే పని చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఆ ఎమ్మెల్యేలు ద్రోహం చేసి వెళ్లినా.. సాక్షిలోని వారి ఏజెంట్లు మాత్రం ఫిరాయింపుదారులపై స్వామిభక్తిని చూపుతున్నారు! వాళ్లకే జై కొడుతున్నారు. వాళ్ల కోసమే పని చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు ఫిరాయించిన చోట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ నేతలను ఇప్పటికే సిద్ధం చేశారు. ద్రోహం చేసిన వారిని దూరం పెట్టేసి.. వేరే నేతలను ఇన్ చార్జిలుగా ప్రకటించారు. ఆశ్చర్యం ఏమిటంటే.. ఇలాంటి ఇన్ చార్జిలకు ‘సాక్షి’ సరైన కవరేజీ ఇవ్వకపోవడం! వీరు పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలను, ప్రజల్లోకి వెళుతున్న వైనాన్ని, ప్రజలకు చేస్తున్న సేవను ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో సరిగా చూపడటం లేదు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేసే మీడియా వర్గాలు చాలా ఉన్నాయి. చివరకు ‘సాక్షి’లో కూడా పార్టీకి ప్రాధాన్యత దక్కకపోవడం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉండటం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది!

పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాకుండా, ద్రోహం చేసిన వెళ్లిన వారిని ‘సాక్షి’ భుజానికెత్తుకుంటోంది. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డారు. కానీ.. ఇప్పటికీ ‘సాక్షి’లో ఫిరాయింపు ఎమ్మెల్యేల మనుషులున్నారు. వీళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్రోహులకు ప్రాధాన్యతను ఇస్తూ మరింత ద్రోహం చేస్తున్నారు. పార్టీ ఊసు ను వినిపించనీయకూడదని ప్రయత్నిస్తున్నారు. మరి ఈ విషయం వైఎస్సార్ సీపీ అధినాయకత్వానికి తెలుస్తుందా? ‘సాక్షి’లో ఈ పరిస్థితి మారుతుందా? అనేవి శేష ప్రశ్నలు!