Begin typing your search above and press return to search.

జనసేనకు షాక్.. జేడీ ఆ పార్టీలోకే..

By:  Tupaki Desk   |   17 Jun 2019 9:43 AM GMT
జనసేనకు షాక్.. జేడీ ఆ పార్టీలోకే..
X
ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఇంత వరకు మళ్లీ మీడియా ముందుకు రాలేదు. పవన్ పెట్టిన సమీక్షలకు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమావేశాలకు హాజరుకాలేదు. ఇటీవల పవన్ మంగళగిరిలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కనిపించలేదు. దీంతో ఎక్కడో తేడా కొడుతున్నట్టే కనిపిస్తోంది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితంతో జేడీ లక్ష్మీనారాయణ తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం. గెలవగానే కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. ఇక విశాఖపట్నంలో తనపై గెలిచిన వైసీపీ అభ్యర్థి కి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మళ్లీ మీడియాకంట పడలేదు.

సీబీఐ జేడీగా జగన్ కేసు సహా చాలా విప్లవాత్మక కేసులను డీల్ చేసి దేశంలోనే పవర్ ఫుల్, నిజాయితీ గల ఆఫీసర్ గా లక్ష్మీనారాయణ పేరు తెచ్చుకున్నారు. ఆయన తన ఐపీఎస్ పదవికి స్వచ్చంధంగా రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఏపీ వ్యాప్తంగా పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. ఇక కొత్త పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన అందుకు సాహసించలేదు. లోక్ సత్తా, కాంగ్రెస్, టీడీపీ నుంచి ఆఫర్లు వచ్చాయి. బీజేపీ అయితే ఏపీ రాష్ట్ర శాఖ బాధ్యతలు అప్పగిస్తామని.. సీఎం కేండిడేట్ గా ప్రకటిస్తామని ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరిగింది.

అయితే జేడీ టీడీపీవైపు మొగ్గు చూపారని వార్తలొచ్చాయి. కానీ వైసీపీ వాళ్లు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కేసును టీడీపీ తో కుమ్మక్కై డీల్ చేశాడని.. బాబు తొత్తు అని ఆడిపోసుకున్నారు. దీంతో జనసేనలో చివరి నిమిషంలో చేరారు. విశాఖ ఎంపీ స్థానానికి పోటీచేశారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. వైసీపీ గాలిలో జేడీ లక్ష్మీనారాయణ మూడో స్థానానికి పడిపోయారు.

దీంతో తత్త్వం బోధపడిన జేడీ ఇప్పుడు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కేంద్రంలో బీజేపీ రాదనుకొని ఆ పార్టీ ఆఫర్ ను కాలదన్నిన జేడీ ఇప్పుడు జనసేన కాడి వదిలి మళ్లీ బీజేపీ పగ్గాలు చేపట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీలో చేరితేనే బెటర్ అని యోచించి ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

ఇక సీబీఐ జేడీని చేర్చుకునేందుకు బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఏపీలో టీడీపీని నామారూపాల్లేకుండా చేసి ఆ స్థానంలోకి రావాలని ఆశిస్తున్న బీజేపీ ఇప్పుడు జేడీని తమ నాయకుడిగా ఏపీలో ప్రొజెక్ట్ చేయాలని భావిస్తోందట.. సో జేడీ కూడా జనసేనను వదిలి త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.