Begin typing your search above and press return to search.

చెప్పేశారు.. ఎంపీ సీటు కోసం యాభై కోట్లు ఖర్చు చేశారట!

By:  Tupaki Desk   |   22 April 2019 9:33 AM GMT
చెప్పేశారు.. ఎంపీ సీటు కోసం యాభై కోట్లు ఖర్చు చేశారట!
X
బోల్డ్ గా మాట్లాడటంలో జేసీ దివాకర్ రెడ్డి కి సాటి వచ్చే వారు లేరు. అయితే ఆయన బోల్డ్ గా మాట్లాడటం ఒక్కోసారి ఆయనకు, ఆయన పార్టీకే తలనొప్పిగా మారుతూ ఉంటుంది. ఒకవేళ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను ఈసీ సీరియస్ గా తీసుకుంటే అది పెద్ద వివాదం అవుతుంది. ఆ స్థాయిలో మాట్లాడారు దివాకర్ రెడ్డి.

అనంతపురం ఎంపీ సీటు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్ రెడ్డి ఈ సారి తన తనయుడిని అక్కడ పోటీ చేయించిన సంగతి తెలిసిందే. ఇటీవలే పోలింగ్ ముగిసిన నేపథ్యంలో.. ఈ ఎన్నికల అనుభవాన్ని జేసీ వివరించారు. ఆయన చెప్పిన దాన్ని ప్రకారం.. ఏకంగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. తన తనయుడి విజయం కోసం అంత సొమ్మును ఖర్చు పెట్టినట్టుగా జేసీ చెప్పుకొచ్చారు.

ఓటుకు రెండు వేల రూపాయల చొప్పున పంచినట్టుగా, స్థూలంగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుగా జేసీ చెప్పుకొచ్చారు! ఇదీ దివాకర్ రెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఇంకా చాలా విషయాలే చెప్పారాయన. కొంతమంది ఓటుకు ఐదు వేల రూపాయలు అడిగారని,అయితే అంత ఇవ్వలేక రెండు వేల రూపాయలతో సరి పెట్టినట్టుగా జేసీ వివరించారు. రాజకీయాలు ఇలా ఖరీదుగా మారాయని, అవినీతి సొమ్మునే అలా పంచినట్టుగా కూడా జేసీ చెప్పారు. తాము మాత్రమే అని రాష్ట్రమంతా ప్రతి పోటీ చేసిన వారంతా ఆ స్థాయిలో ఖర్చు పెట్టినట్టుగా జేసీ చెప్పారు.

ఆయన పచ్చిగా చెప్పిన మరో మాట ఏమిటంటే.. 'పసుపు –కుంకుమ డబ్బులు జనాలు అందాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే మరింత డబ్బులను పంచాల్సి వచ్చేది..' అనేది! ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చిన పసుపు- కుంకుమ డబ్బులు అలా ఓట్ల కొనుగోలుకు ఉపయోగపడిందని కూడా ఈ తెలుగుదేశం నేత ఓపెన్ గా చెప్పారు.

మరి ఈ మాటలను బట్టి చూస్తే.. ఎన్నికలు ఏ రీతిన జరిగాయో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ఒక ప్రముఖనేతే ఈ విషయాలను చెప్పారు కాబట్టి ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుకు ఇంతకన్నా వేరే ఉదాహరణలు అవసరం లేదేమో!