Begin typing your search above and press return to search.

జేసీ ఈ సారి బాబును వాయించేశాడు

By:  Tupaki Desk   |   23 Jan 2017 7:26 AM GMT
జేసీ ఈ సారి బాబును వాయించేశాడు
X
అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌ రెడ్డి త‌న సంచ‌ల‌న కామెంట్ల‌ను వ‌దిలిపెట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అనంతపురం జిల్లాలో ఏర్పాటుచేసిన టీడీపీ వ్యవస్థాపకులు - దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గం కారణంగానే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే రెడ్డిల‌పై జ‌నాల్లో కోపం పెరుగుతోంద‌ని వ్యాఖ్యానించారు.

తాను పుట్టుకతో కాంగ్రెస్‌ వాదినని - కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి దుర్వాసన వెదజల్లుతోందని అందుకే టీడీనీ లోకి చేరానని జేసీ దివాక‌ర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం కష్టాల్లో ఉందని..అంతా క‌లిసి అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తాను అనంతపురం - కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని ప్రతి ఒక్కరినీ కలిసి విన్నవించానని, అయితే అప్పట్లో ఏ ఒక్కరూ తనకు సహకరించలేదన్నారు. తెలంగాణలో కలిసి వుంటే అనంతపురం జిల్లా వాసులు ఆనందంగా ఉండేవారని జేసీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తనకు ఒక విషయంలో ఎప్పుడూ విభేదం వస్తుంటుందన్నారు. ప్రస్తుతం ఒక బీడీ కొనాలన్నా 50 పైసలు - టీ తాగాలంటే రూ. 5 వెచ్చించాలని, ఇక ప్రభుత్వం కిలో బియ్యం రూ. 20తో కొనుగోలు చేసి రూ. 1కే అందజేయడాన్ని తాను విభేదిస్తున్నానని జేసీ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ఈ ప‌థ‌కాన్ని వెంట‌నే మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహం లేని ఊరు దేవాలయం లేని ఊరితో సమానమని ఈ సంద‌ర్భంగా జేసీ వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/