Begin typing your search above and press return to search.

పరిటాలకు ఈజీ కాదంటున్న టీడీపీ మీడియా!

By:  Tupaki Desk   |   24 March 2019 6:12 PM GMT
పరిటాలకు ఈజీ కాదంటున్న టీడీపీ మీడియా!
X
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం పరిస్థితి పట్ల తెలుగుదేశం అనుకూల మీడియానే ఆసక్తిదాయకమైన కథనాలను ఇస్తోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ సారి పరిటాల వాళ్ల గెలుపు ఈజీ కాదని టీడీపీ మీడియానే కోడై కోస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో హోరాహోరీ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ మీడియానే చెబుతూ ఉండటం ఆసక్తిదాయకం.

ఇటీవలే ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. టీడీపీకి అనుకూలంగానే వ్యవహరించే ఆ టీవీ చానల్ తో ప్రకాష్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. తమ విజయం ఖరారు అయ్యిందనేంత విశ్వాసాన్ని వ్యక్తం చేశారాయన. నియోజకవర్గంలో పరిస్థితుల గురించి, తమకు ఇప్పుడున్న అనుకూలతల గురించి ప్రకాష్ రెడ్డి విపులంగా చెప్పారు.

ఇక నియోజకవర్గంలో పరిస్థితులు గతంలా లేవని కూడా స్పష్టం అవుతూనే ఉంది. పరిటాల అనుచరులు చాలా మంది ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గ్రామాల్లో పరిటాల కుటుంబం మనుషులుగా చలామణి అయిన చాలా మంది బీసీ నేతలు తెలుగుదేశం పార్టీకి తలాక్ చెప్పారు. తమను పరిటాల కుటుంబం పట్టించుకోకపోవడంతో, డబ్బు ఇస్తేనే పని చేశారు.. ఊరికే ఏం చేయలేదు కదా అనే భావనతో వారు వ్యవహరించారని.. అందుకే తెలుగుదేశం పార్టీని వీడినట్టుగా సదరు గ్రామస్థాయి నేతలు ప్రకటించారు.

ఇక హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాధవ్ బరిలోకి దిగడం కూడా కురుబ సామాజికవర్గాన్ని కొంత వరకూ ప్రభావితం చేస్తూ ఉంది. బీసీల్లో గతంలాగా పరిటాల కుటుంబానికి పట్టు లేదని మాత్రం స్పష్టం అవుతోంది.నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి కూడా లేకపోవడం ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రకాష్ రెడ్డి విజయం పట్ల ధీమాతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ పోటాపోటీ పరిస్థితి ఉందని తెలుగుదేశం వీరాభిమాన మీడియా వర్గమే ప్రకటిస్తోంది. హోరాహోరీ పోరు అని ఆ మీడియా వర్గం అంటోంది. మరి తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైన మీడియానే ఇలా చెబుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.