Begin typing your search above and press return to search.

ఇంద్రాణీ క‌థ‌లు ఇన్నిన్ని కాదు....

By:  Tupaki Desk   |   28 Aug 2015 3:36 PM GMT
ఇంద్రాణీ క‌థ‌లు ఇన్నిన్ని కాదు....
X
తీగలాగే కొద్దీ డొంకంతా కదులుతోంది. స్టార్ ఇండియా నెట్ వర్క్ సీఈవో పీటర్ ముఖర్జీ భార్య ఇంద్రాణీ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంద్రాణి అరెస్టు అయిన నేపథ్యంలో మరింత ఆసక్తికరంగా చర్చలు సాగుతున్నాయి. తను పాల్పడిన ఘాతుకాలను ఇంద్రాణి ఒప్పుకుంటే సరి లేకుంటే తాను బయట పెట్టాల్సి వస్తుందని కొడుకు మిఖయిల్ అంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇంద్రాణి వ్యక్తిగత వివరాలు సర్వత్రా ఆసక్తిగా మారాయి.

ఇంద్రాణి అస్సాం గవర్నమెంట్ లో పనిచేసిన ఇంజినీర్ కూతురు. స్కూల్ ఎడ్యుకేషన్ గౌహతిలో సాగింది. గౌహతిలో ఉండగానే సిద్ధార్ధ్ తో పెళ్లయింది.ఆ ఇద్దరికీ షీనా, మిఖయిల్ పుట్టారు. తర్వాత కోల్ కత వెళ్లింది. ఇంద్రాణి గౌహతి నుంచి కోల్ కతకు రాగానే బిజినెస్ మేన్ సంజీవ్ తో పరిచయమైంది. అప్పటికే తనకు ఇద్దరు పిల్లలున్నారన్న మాటే మరచి అతడి ప్రేమలో పడింది. అంతే కాదు పెళ్లి కూడా చేసుకుంది. అతడితోనూ ఒక కూతుర్ని కనింది. ఆమె షీనా బోరా. ముంబై, సెయింట్ జేవియర్స్ లో ఎకనామిక్స్ లో బీఏ చదివింది. 2011 జూన్ 20 వరకూ ముంబై మెట్రోలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసింది.

ఇంద్రాణి కోల్ కతా నుంచి ముంబై మకాం మార్చింది. అక్కడ స్టార్ ఇండియా నెట్ వర్క్ హెచ్ ఆర్ లో పనిచేయసాగింది. అక్కడే పీటర్ ఇంద్రాణిల పరిచయమైంది. అప్పుడు పీటర్ ముఖర్జీ స్టార్ సీఈఓగా పనిచేసేవాడు. 2002లో పీటర్, ఇంద్రాణిల పెళ్లి జరిగింది. తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఒక మీడియా కంపెనీ పెట్టారు. దీనికి పీటర్ చైర్మెన్ కాగా, ఇంద్రాణి సీఈఓ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఎఫైర్స్ దాచిపెడుతూ ఇంద్రాణి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది.

ఇంద్రాణి కెరీర్ లో ఎదిగే క్రమంలో తన వివరాలను గోప్యంగా ఉంచడం మీద ఎక్కువ కాన్ సన్ ట్రేట్ చేసేది. అందులో భాగంగా ఎవరికీ నిజాలు చెప్పేది కాదు. ఇంద్రాణి సంజీవ్ ని పెళ్లాడినప్పుడు కూడా సేమ్ సీన్. ఆమె దగ్గర ఒక ఫోటో ఉండేదని. ఆ ఫోటోలోని వాళ్లెవరని అడిగితే.. తన చెల్లెలూ తమ్ముడని చెప్పేదని అంటాడు సంజీవ్. పీటర్ ని పెళ్లాడినప్పుడు కూడా ఇదే పరిస్థితి. తనకసలు కొడుకు కూతురున్నారన్న విషయమే తెలీకుండా దాచింది. ఇంద్రాణికి పెళ్లయిందని తెలుసుగానీ అవి రెండు పెళ్లిళ్లనీ మొత్తం ముగ్గురు పిల్లలున్నారని తనకు తెలీదంటాడు పీటర్.

ఈ మొత్తం క్రైమ్ సీన్ సాగిన విధం తెలుసుకునే కొద్దీ భర్త పీటర్ మతిపోతోంది. తానిన్నాళ్లూ ఇలాంటి కిలాడీతో కాపురం చేశానా? అన్న ఆందోళనలో పడ్డాడు. పోలీసులకు తన నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తానని అంటున్నాడు. అసలు తాను ఇన్నేళ్లుగా షీనా అమెరికాలో ఉందనే నమ్మానని వాపోతున్నాడు. పైపెచ్చు ఆమె ఇంద్రాణి చెల్లెలుగానే భావించానని చెబుతున్నాడు.

ఇంద్రాణి కొడుకు మిఖయిల్ బోరా తల్లిని తీవ్రంగా తప్పు పడుతున్నాడు. తనకు నిజం తెలుసునని అంటున్నాడు. తల్లి తన సోదరిని చంపడం వెనక అసలు కారణం వేరే ఉందని చెబుతున్నాడు. ఇన్ని సంబంధాలను అవలీలగా మార్చగలిగిన ఇంద్రాణి షీనా ప్రేమను తప్ప పడుతూ హత్య చేసే పరిస్థితే లేదని అంటున్నాడు. ఇందులో మనీ మేటర్ చాలానే దాగుందని చెబుతున్నాడు. ఒక సమయంలో ఇంద్రాణి, కొడుకు మిఖయిల్ ని సైతం హతమార్చడానికి ప్రయత్నించిందన్న కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఒక్క మిఖాయిలే కాదు ఈ హత్య వెనుక కేవలం కుటుంబ సంబంధాలన్న కోణం మాత్రమే ఉందనుకోవడం లేదని అంటున్న వాళ్లు లేక పోలేదు.

ఇంద్రాణి, పీటర్ ఐఎన్ఎక్స్ అనే మీడియా కంపెనీకి సీఈఓ, ఛైర్మెన్ గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ నుంచి బయటికొచ్చే సమయంలో భారీ మొత్తంలో డబ్బు బయటకు తీసినట్టు చెబుతున్నారు. అంత మొత్తం ఒకే ఖాతాకు మళ్లించడం ప్రమాదకరం కాబట్టి దాన్ని తమ కుటుంబానికి చెందిన పలువురు ఖాతాల్లోకి మళ్లించారని అంటారు. షీనా అకౌంట్లో కూడా ఇందులోంచి కొంత అమౌంట్ పడిందనీ ఆ డబ్బు వాపస్ ఇవ్వమంటే షీనా అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఈ గొడవ అటు తిరిగి ఇటు తిరిగి షీనా హత్యకు దారి తీసిందని చెబుతున్నారు.

ఇంద్రాణి, పీటర్ స్థాపించిన కంపెనీలో సింగపూర్ బేస్డ్ కంపెనీ వాటాలున్నాయని,ఒక దశలో ఈ కంపెనీ ఆడిటింగ్ చేయగా అందులో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. కంపెనీ అకౌంట్ నుంచి పెద్ద మొత్తం డబ్బు ఇంద్రాణి,పీటర్ కుటుంబ సభ్యుల ఖాతాలోకి వెళ్లాయని.. ఒక్క షీనాయే కాకుండా.. పీటర్ సోదరుడు గౌతమ్ ముఖర్జీ ఖాతాలోకి కూడా డబ్బు వెళ్లిందని అంటున్నారు. ఇందులో మనీ మేటర్ దాగి ఉండటం వల్లే.. ఇంద్రాణి షీనాను హత్య చేయాల్సి వచ్చిందన్నకోణం వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. షీనా,మిఖయిల్ చెల్లెలు, తమ్ముడని చెబితే సంజీవ్, పీటర్ లాంటి వాళ్లు ఎలా నమ్మారన్న ప్రశ్నలకు సమాధానం రాబడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పీటర్ తో పాటు కొడుకు రాహుల్ ని కూడా పోలీసులు ప్రశ్నించారు.

చనిపోయేనాటికి షీనా వయసు ఇరవైనాలుగేళ్లని ఆమె లింక్ డెన్ ప్రొఫైల్ ని బట్టీ తెలుస్తోంది. దానికి తోడు ఆమె రాహుల్ ని వదిలి వేరొకళ్లతో సహజీవనం సాగిస్తున్నట్టు చెబుతున్నారు. ఇంద్రాణి తన కూతురు రాహుల్ తో సన్నిహితంగా ఉండటమే ఆటంకమైతే ఆ కోణంలో హత్య చేసే అవకాశమే లేదు. కాబట్టి ఇందులో కుటుంబ సంబంధాలనే మాటకు తావులేదనే వాళ్లున్నారు.

ఎన్నెన్నో సందేహాలు….

దానికి తోడు ఇంత సమాచార విప్లవం గల ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఎంత విదేశాల్లో ఉన్నా.. ఎలాగోలా ఆచూకీ దొరుకుతుంది. ఫేస్ బుక్, ట్విట్టర్లంటూ ఎంతో నెట్ వర్క్ విస్తరించింది. ఈ పరిస్థితుల్లో షీనాను ఇంతకాలం యూఎస్ లో ఉందని ఇంద్రాణి మభ్యపెడుతుంటే మిగిలిన కుటుంబ సభ్యులు ఎలా నమ్మారు? ఆమె కేవలం ఒక్క ఫోటో చూపి అందరినీ ఎలా సమాధానపరచగలిగింది? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

మొత్తం మీద షీనా హత్యకేసులో డ్రైవర్, రెండో భర్త సంజీవ్ ఖన్నా పాత్ర ఎంత? ఇంద్రాణి మూడో భర్త పీటర్, పీటర్ కొడుకు రాహుల్ నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టారు? ఇందులో పీటర్ పాత్ర ఏంటి? ప్రస్తుతం పీటర్ యాక్టివిటీస్ ఎలాంటివి?మీడియా ప్రపంచంలో ప్రముఖుడైన పీటర్,షీనా చనిపోయిన నాటి నుంచి అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏంటి?ఒక కేసులో అరెస్టయిన డ్రైవర్ మరొక కేసు గురించి పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా? అన్న చిక్కుముడులు కూడా వీడాల్సి ఉంది.

ఇప్పటి వరకూ ఇది పరువు హత్యగానే భావిస్తోందీ సమాజం. నాణేనికి మరో వైపునుంచి చూస్తే ఇదో కార్పొరేట్ మర్డర్ గానూ కనిపిస్తోందని అంటున్నారు కొందరు. ఇలాంటి పరిస్థితుల నడుమ పోలీసులు నిజాలు రాబట్టడంలో విజయం సాధిస్తారా? లేక విఫలమవుతారా? ఇంద్రాణి కొడుకు ఆధారాలతో సహా చూపించే వరకూ వ్యవహారం సాగుతుందా? తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.