Begin typing your search above and press return to search.

భార‌త్ లో కుబేరులు ఎంత‌గా పెరుగుతున్నారంటే..

By:  Tupaki Desk   |   22 Jan 2019 5:04 AM GMT
భార‌త్ లో కుబేరులు ఎంత‌గా పెరుగుతున్నారంటే..
X
రోజు అంటే.. పొద్దున్నే లేచి.. కాసేపు పేప‌ర్లు చూసి.. టిఫిన్ తిని.. అప‌సోపాలు ప‌డుతూ ఆఫీసుకు వెళ్లి.. ఇంటికి రావ‌టం.. కాసేపు టీవీ చూడ‌టం.. మ‌ళ్లీ తినేసి నిద్ర‌పోవ‌టం. ఈ దిన‌చ‌ర్య మ‌ధ్య‌లో కాసిన్ని ఫోన్లు.. గంట‌ల కొద్దీ వాట్సాప్ అప్డేష‌న్స్ తో పాటు.. సోష‌ల్ మీడియాను చూసుకోవ‌టం. ఇవ‌న్నీ మీరు ఎంత సంపాదిస్తారు? అన్ని బంద్ చేసి కేవ‌లం ప‌ని చేస్తూనే ఉన్నా ఎంత సంపాదించ‌గ‌ల‌రు? రోజుకు ల‌క్ష రూపాయిలు? వామ్మో.. అంతా? ఓకే యాభై వేలు.. అంత కుదురుతుందా? స‌రే.. రోజుకు ప‌ది వేల రూపాయిలు.. అది కూడా ఎక్కువే. పోనీ.. ఐదు వేలు.. వోకే.. వోకే అనేయొచ్చు.

మ‌రి.. స‌గ‌టు జీవి లెక్క ఇలా ఉంటే.. సంప‌న్నుల లెక్క ఎలా ఉంది? అందునా.. భార‌త కుబేరులుగా పేరున్న సంప‌న్నుల వార్షిక ఆదాయం రోజు లెక్క‌న లెక్కిస్తే ఎలా ఉంటుంద‌న్న‌ది చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. మీరు క‌ల‌లో కూడా ఊహించ‌లేనంత భారీగా కుబేరుల సంప‌ద అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీనికి సంబంధించి ఆక్స్ ఫామ్ సంస్థ ఒక అధ్య‌య‌నం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా వారు ఆశ్చ‌ర్యానికి గురి చేసే విష‌యాల్ని చెప్పుకొచ్చారు.

భార‌త కుబేరుల సంప‌ద గ‌త ఏడాది రోజుకు రూ.2200 కోట్ల చొప్పున పెరిగింద‌ని తేల్చారు. అదే స‌మ‌యంలో ప్ర‌పంచ కుబేరుల సంప‌ద రోజుకు 250 కోట్ల డాల‌ర్ల మేర పెరిగిన‌ట్లుగా వెల్ల‌డించింది. పేద‌ల సంప‌ద 11 శాతం క్షీణించింద‌ని పేర్కొంది. దేశంలో అత్యంత ఐశ్వ‌ర్య‌వంతుల సంప‌ద 39 శాతం వృద్ధి చెంద‌గా.. జనాభాలో స‌గం మంది సంప‌ద 3 శాత‌మే పెరిగిన‌ట్లుగా వెల్ల‌డించారు. భార‌త్ లో సంప‌ద కొంద‌రు కుబేరులే అనుభ‌విస్తున్నార‌ని.. పేద‌లు మాత్రం ఒక పూట కూడా గ‌డ‌వ‌ని.. పిల్ల‌ల‌కు మందులు కూడా కొనివ్వ‌లేని దుర్బ‌ర ప‌రిస్థితుల్లో ఉన్నారు. ఇదే తీరులో అస‌మాన‌త‌లు పెరిగిన ప‌క్షంలో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంద‌ని పేర్కొన్నారు.

భార‌త్ లో అత్యంత పేద‌లైన 13.6 కోట్ల మంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నార‌ని.. భార‌త జాతీయ సంప‌ద‌లో 77.4 శాతం కేవ‌లం ప‌ది మంది సంప‌న్నుల చేతిలో ఉంద‌ని వెల్ల‌డించింది. దేశ జాతీయ సంప‌ద‌లో 52 శాతం ఒక్క శాతం కుబేరుల చేతిలో ఉన్న వైనాన్ని వెల్ల‌డించింది. దేశ జ‌నాభాలో 60 శాతం మంది చేతిలో ఉన్న సంప‌ద కేవ‌లం 4.8 శాత‌మేన‌ని వెల్ల‌డించింది. దేశంలోని అత్యంత సంప‌న్నులైన తొమ్మిది మంది సంప‌ద దేశ జ‌నాభాలోని స‌గం మందితో సంప‌ద‌తో స‌మానంగా పేర్కొంది. 2022లో భార‌త్ లో రోజుకు 70 మంది కొత్త కుబేరులు పుట్టుకొస్తార‌న్న అంచ‌నాను వెల్ల‌డించింది.

గ‌త ఏడాది కొత్త‌గా 18 మంది బిలియ‌నీర్లు పుట్టుకురాగా.. మొత్తం బిలీయ‌నీర్లు 119కు చేరుకున్నారు. వీరింద‌రి సంప‌ద ఏకంగా రూ.28 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. కేంద్ర ప్ర‌భుత్వం.. అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల వైద్య‌.. ప్ర‌జారోగ్యం.. పారిశుద్ధ్యం.. నీటి స‌ర‌ఫ‌రాల కోసం చేస్తున్న ఖ‌ర్చు రూ.2.08ల‌క్ష‌ల కోట్లు కాగా.. దేశంలో అత్యంత ధ‌న‌వంతుడైన ముకేశ్ అంబానీ సంప‌ద రూ.2.8ల‌క్ష‌ల కోట్ల కంటే త‌క్కువ కావ‌టం గ‌మ‌నార్హం.