Begin typing your search above and press return to search.

భారత సైన్యం పాక్ పై యుద్ధం మొదలెట్టిందా?

By:  Tupaki Desk   |   29 Sep 2016 8:56 AM GMT
భారత సైన్యం పాక్ పై యుద్ధం మొదలెట్టిందా?
X
జరుగుతున్న పరిణామాల్ని మొహమాటం లేకుండా చెప్పాలంటే అవుననే చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ఎక్కడా ఉండదు. కశ్మీర్ సరిహద్దుల్లోని ఉరీ ఉగ్రదాడి ఘటన అనంతరం పాక్ తీరుపై భారత్ సర్కారు సీరియస్ గా ఉంది. ఉరీ ఉగ్రదాడిలో పాక్ ప్రమేయం ఉందన్న విషయం సాక్ష్యాలతో సహా లభించిన నేపథ్యంలో దాయాదికి గట్టిగా బుద్ది చెప్పాల్సిందేనన్న భావనలో మోడీ సర్కారు వచ్చేసింది. దీనికి తగ్గట్లే దేశంలోని అత్యధికులు పాక్ తీరును ఖండించటమే కాదు.. సైనిక చర్య చేపట్టటం ద్వారాపాక్ పీచమణచాలన్న భావనకు రావటం కనిపించింది.

ఉరీ ఘటన జరిగిన రెండు.. మూడు రోజుల్లోనే పాక్ అక్రమిత కశ్మీర్ లోకి వెళ్లిన సైనికులు ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసినట్లుగా కథనాలు వచ్చాయి. దానిపై అధికారిక ప్రకటన చోటు చేసుకోలేదు. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం నియంత్రణ రేఖ (భారత.. పాక్ సరిహద్దు ప్రాంతంలో) వద్ద తాజా పరిస్థితిపై ప్రదాని మోడీ నేతృత్వంలో హైలెవల్ మీటింగ్ ఒకటి నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ ఈ రోజు పాక్ అత్యంత అనుకూల దేశం అన్న హోదా ఉంచాలా? తీసేయాలా? అన్న విషయం మీద చర్చించాల్సిన నేపథ్యంలో.. దాన్ని వాయిదా వేసుకొని మరీ.. భద్రతా అధికారులతో సమావేశమయ్యారు.

ఇది జరిగిన కాసేపటికే డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ మీడియా ముందుకు వచ్చేశారు. నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉగ్రవాద స్థావనరాలపై దాడులు చేస్తున్నామన్న విషయాన్నిఅధికారికంగా చెప్పేశారు. తాము చేస్తున్న దాడుల వివరాల్ని పాక్ కు చెప్పినట్లుగా ఆయన వెల్లడించారు. సరిహద్దుల్లో పాక్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. కాల్పుల్లో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

నియంత్రణ రేఖ వద్ద బుధవారం రాత్రి దాడులు నిర్వహించామని.. వారికిదో గుణపాఠంగా ఆయన అభివర్ణించారు. ‘‘నియంత్రణ రేఖ వెంట ఉన్న ఉగ్రవాదుల లాంచ్ పాడ్లపై భారత సైన్యం నిన్నరాత్రి సునిశిత దాడులు చేసింది. ఈ దాడిలో భారత సైన్యం నుంచి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. మన భూభాగంలోకి చొరబడాలని కుట్రపన్నుతున్న ఉగ్రవాదులను మట్టికరిపించటమే ఈ దాడుల ఉద్దేశం’’ అని రణబీర్ సింగ్ మీడియాతో చెప్పారు. భారత సైన్యం దాడులపై దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే.. భారత్ షేర్ మార్కెట్ మాత్రం ఒక్కసారిగా పడిపోయింది. నియంత్రణ రేఖ వద్ద దాడులు చేస్తున్నామన్న ప్రకటన అనంతరం సెన్సెక్స్ భారీగా పతనమైంది. బీఎస్ ఈ సెన్సెక్స్‌ దాదాపు 573 పాయింట్లు కోల్పోయి 27,719 వద్దకు చేరింది. నిఫ్టీ 186.90 పాయింట్ల నష్టపోయి, 86వేల దిగువకు చేరింది. ప్ర‌స్తుత‌మున్న ఉద్రిక్త‌ ప‌రిస్థ‌తి రెండు దేశాల మ‌ధ్య పూర్తి స్థాయి యుద్ధంగా ప‌రిణ‌మిస్తే మార్కెట్ల‌కు అది ఆశ‌నిపాత‌మ‌నే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. భారత సైన్యం దాడులు చేయటాన్ని ఖండిస్తున్నట్లుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. శాంతి కావాలని కోరుకునే వారు తమ విధానాన్ని తమ బలహీనతగా భావించకూడదని వ్యాఖ్యానించిన ఆయన.. తమ దేశ రక్షణ..భద్రత విషయంలో తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.