Begin typing your search above and press return to search.

ఇండియా-పాక్ వ్యవహారంపై ఏమి జరిగింది?

By:  Tupaki Desk   |   1 Oct 2016 6:01 PM GMT
ఇండియా-పాక్ వ్యవహారంపై ఏమి జరిగింది?
X
పాక్ ఉడీ ఉగ్రదాడి... ఇండియా సర్జికల్ స్ట్రైక్... అనంతరం యుద్ద వాతావరణం... భారత్ కు మద్దతిస్తూ, పాక్ కు అక్షింతలేస్తున్న ప్రపంచ దేశాలు... పాక్ అప్రకటితసైన్యం (ఉగ్రవాదులు) కయ్యానికాలు దువ్వే వ్యాఖ్యలు... ఎవరికి తోచిన స్థాయిలో వారు పాక్ కు ఇస్తున్న షాక్ లు ఇస్తూనే ఉన్నారు - మొట్టికాయలేస్తూనే ఉన్నారు... నలువైపులా వాయింపుల దశలో పాక్ లో సామాజిక - రాజకీయ పరిస్థితులు కూడా మారబోతున్నాయి. ఒక్క శనివారమే పాకిస్థాన్ దేశ చరిత్రలో ఎన్నో మలుపులు - మరెన్నో దశలు... పాక్ కి చెందినవారు ఎవరికి వారే మైకుల ముందుకొచ్చి తమకు తెలియకుండానే పాక్ కు నష్టంకలించిన సందర్భాలు... అవెంటో ఇప్పుడు చుద్దాం...

* పాకిస్థానీలు భారత్‌ తో స్నేహానికి సిద్ధంగా ఉన్నారంటూ మాజీ క్రికెటర్‌ - రాజకీయ నాయకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్నేహ హస్తం అందించారు. భారత సైన్యం సర్జికల్‌ దాడుల నేపథ్యంలో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

* సరిహద్దుల్లో దాక్కుంటే సర్జికల్ స్ట్రైక్ పేరుచెప్పి భారత్ మట్టుబెడుతుందనే భయం మొదలైందో ఏమో కానీ... వ్యూహం మార్చిన పాక్ జనావాసాల్లో ఉగ్ర శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. పీఓకే లోని ముజఫరబాద్‌ నుంచి లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్‌ - హిజ్‌బుల్ ముజాహిద్దీన్ కు చెందిన సుమారు 12 ఉగ్ర శిబిరాలను హుటాహుటిన జనావాస ప్రాంతాలకు తరలించారని - ఈ 12 శిబిరాల్లో సుమారు 500 మంది ఉగ్రవాదులు ఉండవచ్చని హోంశాఖ తాజా నివేదిక తెలిపింది!!

* సర్జికల్ స్ట్రైక్ తర్వాత మాంచి ఊపుమీదున్న భారత్ బలగాలు... పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ లో ఉగ్రవాద శిబిరాలపై తాజాగా జరిపిన మెరుపు దాడితో 300 మంది టెర్రరిస్టులు పరారయ్యారు.

* ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా మారిన పాకిస్థాన్‌ కు తాజాగా బీసీసీఐ తనవంతు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పెద్ద టోర్నీల్లో ఒకే గ్రూపులో పాకిస్థాన్‌ తో క్రికెట్ ఆడబోమని బీసీసీఐ తెగేసి చెప్పింది. రెండు జట్లూ సెమీ ఫైనల్ - ఫైనల్లో తలపడాల్సి వస్తే ఆ పరిస్థితిని ఆలోచిస్తామని.. అప్పటివరకూ పాక్ కు వీలైనంత దూరంగా ఉంటామని తెలిపింది. ఐసీసీకి ఏ మాత్రం భయపడకుండా బీసీసీఐ తన ఉద్ధేశ్యాన్ని బాహాటంగా ప్రకటించడం గమనార్హం.

* నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత యత్నాలకు చైనామళ్లీ అడ్డుకుంది. సాంకేతిక కారణాలు చెప్పి మరో ఆరు నెలల పాటు పాత నిర్ణయానికే కట్టుబడినట్లు యూఎన్‌ కు వెల్లడించింది. అయితే ఆరు నెలల తర్వాత చైనా మళ్లీ ఆదుకుంటుందా లేక ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత డిమాండ్‌కు మద్దతిస్తుందా అన్నది వేచి చూడాలి.

* ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ను భూతల స్వర్గంగా మార్చడంపై మండిపడిన బ్రిటన్... ఇప్పటికైనా పాక్ తమ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని - ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది.

* భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న టెన్షన్ వాతావరణం మరింత ఉధృతం కాక ముందే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలని రష్యా సూచించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటంలో తాము అన్నివేళలా సహకరిస్తామని పరోక్షంగా పాకిస్తాన్ కు హెచ్చరికలు చేసింది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులపై పాక్ దేశ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రష్యా హెచ్చరించింది.

* అణ్వాయుధాల వాడకం విషయంలో పాకిస్తాన్ నిగ్రహాన్ని పాటించాలని అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్ కు సందేశాన్ని పంపింది. పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాద సంస్థల మీద చర్యలు తీసుకోవాలని పాక్ కు సూచించింది. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు.

* ఈ హడావిడిలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్.. అవినీతి ఆరోపణల విషయంలో తీవ్ర రాజకీయ సంక్షోబాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ కంపెనీల ముసుగులో వేల కోట్ల అక్రమ సంపాదనను పోగేసుకున్నవారి పనామా పేపర్స్ జాబితాలో షరీఫ్ పేరు పై వరుసలో కనిపించింది. దీంతో పాటు ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాది బుర్హాన్ వనీని కీర్తించడమేకాక, ఉడీ ఉగ్ర దాడి కశ్మీర్ ఆందోళనలకు కొనసాగింపని వ్యాఖ్యానించడంపై కూడ పాక్ ప్రధానిపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయని కథనాలు వస్తున్నాయి.