Begin typing your search above and press return to search.

ఐటీ శాఖా డేగ‌క‌న్ను మొద‌లైంది

By:  Tupaki Desk   |   22 Jan 2017 9:46 AM GMT
ఐటీ శాఖా డేగ‌క‌న్ను మొద‌లైంది
X
ఐటీ శాఖ త‌న పంజా విస‌ర‌డం మొద‌లు పెట్టింది. బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు - ఫిక్స్‌ డ్ డిపాజిట్లు - క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు - స్థిరాస్తి క్రయ - విక్రయాలు.. ఇలా అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపైనా ఐటీ శాఖ కన్నేసింది. అనుమానిత - సందేహాస్పద లేదా నిర్దిష్ట పరిమితికి మించిన లావాదేవీలపై బ్యాంకులు - ఇతర ఆర్థిక సంస్థలు వారికి సమాచారం అందించేందుకు వీలుగా ఐటీ డిపార్ట్‌ మెంట్ ప్రత్యేకంగా ఈ-ప్లాట్‌ ఫాంను ఏర్పాటు చేసింది. ఏయే లావాదేవీలపై వారికి సమాచారం అందించాలన్న విషయంపై ఈనెల 17న ఐటీ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ లోని కీలక అంశాలు..

-ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తికి చెందిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో రూ.10 లక్షలు - అంతకు మించి నగదు డిపాజిట్ (కరెంట్ ఖాతా - ఎఫ్‌ డీలు కాకుండా) చేసిన వివరాలు.

-ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు - అంతకు మించి ఫిక్స్‌ డ్ డిపాజిట్ (ఎఫ్‌ డీ) చేసిన సమాచారం.

-నగదు రూపంలో రూ.లక్ష అంతకంటే ఎక్కువ మొత్తంలో చెల్లించిన క్రెడిట్ కార్డు బిల్లులు. చెక్కులు - ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిపిన క్రెడిట్ కార్డు బిల్లు సెటిల్‌ మెంట్లు.

-గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్యకాలంలో ఒక వ్యక్తికి చెందిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో రూ.2.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వివరాలు. కరెంట్ ఖాతాల విషయానికొస్తే.. రూ.12.5 లక్షలు - అంతకు మించిన డిపాజిట్ అయిన పక్షంలో ఐటీ శాఖకు బ్యాంకులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

-గత సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 మధ్యలో ఏదేని ఖాతాలో చోటు చేసుకున్న అనుమానిత లావాదేవీలపై ఐటీ డిపార్ట్‌మెంట్‌ కు ఈనెల 31లోగా సమాచారం అందించాలి.

-ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి బాండ్లు - డిబెంచర్లలో రూ.10 లక్షలు, అంతకు మించి పెట్టుబడులు పెట్టిన పక్షంలో ఆ బాండ్లు లేదా సెక్యూరిటీలు జారీ చేసిన కంపెనీలు పన్ను శాఖకు వివరాలు అందించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, షేర్ల బైబ్యాక్ విషయంలోనూ అంతే మొత్తానికి మించిన లావాదేవీలపై కంపెనీలు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

-ఏదేని వ్యక్తి రూ.10 లక్షలకు మించి విలువ చేసే ట్రావెలర్ చెక్కులు, ఫారెక్స్ కార్డు లేదా ఇతర మార్గాల్లో కొనుగోలు చేసిన విదేశీ మారకం వివరాలు.

-రూ.30 లక్షలు, అంతకు మించి విలువ చేసే స్థిరాస్తి క్రయ, విక్రయాలపై రిజిస్ట్రార్ ఆఫీసులు సైతం ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/