Begin typing your search above and press return to search.

బీజేపీ వింత: హైద‌రాబాద్ పేరు మారుస్తార‌ట‌

By:  Tupaki Desk   |   9 Nov 2018 4:30 PM GMT
బీజేపీ వింత: హైద‌రాబాద్ పేరు మారుస్తార‌ట‌
X
దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న బీజేపీ పేర్ల మార్పు ప‌ర్వం తెలంగాణ‌కు కూడా చేరింది. అయితే, ఈ నిర్ణ‌యం తీసుకునేది అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ కాదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ. వారు మార్చేది కూడా ఏకంగా రాష్ట్ర రాజ‌ధాని పేరే. ఈ ప్ర‌తిపాద‌న పెట్టింది ఎవ‌రో కాదు బీజేపీ మాజీ ఎమ్మెల్యే - ఆ పార్టీ ఫైర్‌ బ్రాండ్ నాయ‌కుడు రాజాసింగ్. త్వ‌ర‌లో జరగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌ గా మారుస్తామని తెలిపారు. హైదరాబాద్ నగర పేరుతో పాటు సికింద్రాబాద్ - కరీంనగర్‌ ల పేర్లను కూడా మార్చనున్నట్లు చెప్పారు.

రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ మొదట్లో భాగ్యనగర్‌ గా పిలువబడేదన్న ఆయన.. ఎప్పుడైతే కులీ కుతుబ్ షాహీల పాలన ప్రారంభమైందో భాగ్యనగర్‌ ను హైదరాబాద్‌ గా మార్చినట్లు తెలిపారు. మొగల్స్ - నిజాంలు పెట్టిన పేర్లను దేశం కోసం పనిచేసిన త్యాగధనుల పేర్లతో తిరిగి మార్చాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ చర్యను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. అలహాబాద్‌ ను ప్రయాగ్‌ రాజ్‌ గా.. ఫజియాబాద్‌ ను ఆయోధ్యగా - మొగల్‌ సరాయ్ రైల్వే స్టేషన్‌ ను పండిట్ దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌ గా మార్చినట్లు తెలిపారు. అదేవిధంగా గుజరాత్‌ లోని అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ వెల్లడించినట్లు చెప్పారు.