Begin typing your search above and press return to search.

ఇంత‌కీ.. ఐవైఆర్ పోస్ట్ ల‌లో ఏముంది?

By:  Tupaki Desk   |   21 Jun 2017 8:38 AM GMT
ఇంత‌కీ.. ఐవైఆర్ పోస్ట్ ల‌లో ఏముంది?
X
ఏపీ స‌ర్కారు తీరుపై త‌న‌కున్న వ్య‌క్తిగ‌త అభిప్రాయాల్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఐవైఆర్ కృష్ణారావు పోస్టులు తాజాగా క‌ల‌క‌లం రేప‌టం.. ఆగ్ర‌హించిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆయ‌నపై క‌న్నెర్ర చేయ‌టం తెలిసిందే. దీంతో.. ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టిన ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇంత‌కీ.. బాబుకు అంత ఆగ్ర‌హం క‌లిగించేలా ఐవైఆర్ ఏం పోస్టులు పెట్టారు? ఆ పోస్టుల్లో ఏముంది? అన్న‌ది చూస్తే..

జ‌గ‌న్నాథ ర‌థ‌చ‌క్రం పేరుతో మే 12న ఫేస్ బుక్ అకౌంట్లో ప‌బ్లిష్ అయిన పోస్ట్‌ ను ఐవైఆర్ షేర్ చేశారు. అందులో ఏముందంటే.. "క‌మ‌ల‌నాథులందు క‌మ్మ‌నాథులు వేర‌యా.. విశ్వ‌దాభిరామ వినుర వేమా!" అని ఉంది.

ప్ర‌ధాని మోడీని జ‌గ‌న్ ఎలా క‌లుస్తాడంటూ టీడీపీ వారు విమ‌ర్శిస్తుంటే ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు.. విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు.. బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ చౌద‌రి.. వెంక‌య్య‌నాయుడు? అని ప్ర‌శ్నిస్తూ.. ఆ మ‌ధ్య‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంక‌య్య‌ను ఉద్దేశించి పాచిపోయిన ల‌డ్డూలు అని నిప్పులు చెరిగితే.. దానిపై క‌స్సుమ‌న్నార‌ని.. కానీ.. మోడీని అన్నేసి మాట‌లు అంటే ఏ ఒక్క‌రూ నోరు విప్ప‌లేద‌న్న సారాంశంతో పోస్ట్ ఉంది.

ఇక‌.. గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమాపై ఐవైఆర్ పెట్టిన ఇంగ్లిష్ పోస్ట్‌ ను కాస్తంత స్వేచ్ఛానువాదం చేస్తే.. శాత‌క‌ర్ణి.. ఇప్పుడు విడుద‌లైన బాహుబ‌లి 2 సినిమాలు కొన్ని ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నాయి. కొన్ని ఎంపిక చేసిన చిత్రాల‌పై ప్ర‌భుత్వాలుఏ విధంగా ప‌క్ష‌పాతం చూపిస్తున్నాయో తెలుస్తోంది. ఏ కార‌ణాల‌తో శాత‌క‌ర్ణి సినిమాకు ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చారో ఎవ‌రికీ తెలీదు.. ఆ సినిమాలో చూపించింది వాస్త‌వ‌మేనా? అంటే కాద‌ని చెప్పాలి. మ‌రి.. ఎందుకు ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చిన‌ట్లు? అంటూ సందేహాన్ని వ్య‌క్తం చేశారు.

"చారిత్ర‌క వాస్త‌వాల్ని వ‌క్రీక‌రించి చూపించే వారిని క‌ఠినంగా శిక్షించాలి. దీనికి భిన్నంగా ప్ర‌భుత్వం వారికి రివార్డులు ఇచ్చింది. కోర్టు కేసు కూడా న‌మోదైంది. బాహుబ‌లి 2 టికెట్ల ధ‌ర‌ల్ని పెంచుకోవ‌టానికి ప్ర‌భుత్వం అనుమ‌తి వ‌స్తుంద‌ని నిర్మాత‌కు ముందే తెలుసా? ఇది అంద‌రికి అమ‌లు చేస్తే..రిస్క్ తీసుకొని భారీ బ‌డ్జెట్ తో సినిమాలు తీయ‌టానికి నిర్మాత‌లు ముందుకు వ‌స్తారు. అలా కాకుండా కొంద‌రికే ప‌రిమితం చేస్తే.. చ‌ట్టాన్ని ప‌రిహాసం చేయ‌ట‌మే" అని పేర్కొన్నారు. సూటిగా ఉన్న ఈ పోస్టులు బాబుకు మంట పుట్టించి ఉంటాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/