Begin typing your search above and press return to search.

నయీం కుటుంబానికి ఐటీ నోటీసులు...ట్విస్ట్‌?

By:  Tupaki Desk   |   26 Sep 2017 4:15 AM GMT
నయీం కుటుంబానికి ఐటీ నోటీసులు...ట్విస్ట్‌?
X
రాష్ట్రంలోనే కాకుండా...జాతీయ స్థాయిలో సంచలనం రేపిన గ్యాంగ్‌ స్టర్ నయీమొద్దీన్ అలియాస్ నయీం ఎన్‌ కౌంటర్‌ లో హతమై ఏడాది దాటిపోయిన త‌ర్వాత కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ఉద్దేశ‌పూర్వ‌కంగానే నీరుగార్చార‌ని...ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న స‌మ‌యంలో...ఐటీ శాఖ తెర‌మీద‌కు వ‌చ్చింది. పోలీస్ ఎన్‌ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులకు ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అది కూడా వారి కుటుంబ స‌భ్యులకు నేరుగా కాకుండా...యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని నయీం ఇంటికి నోటీసులు అంటించారు.

నయీం తల్లి తాహెరా బేగం - సోదరి సలీమా బేగం - హుసేనా బేగం - అహేళ బేగం - హీనా కౌసర్ పేర్లతో ఈ నోటీసులు జారీ చేసి వాటిని ఆయ‌న ఇంటికి అంటించారు. భువనగిరి - పరిసర ప్రాంతాలు - యాదగిరి గుట్ట - ఔషపూర్ - కుందన్ పల్లి కీసర - హైదరాబాద్ - ఆదిభట్ల - శంషాబాద్ - సరూర్ నగర్ - మిర్యాలగూడ - గొల్లగూడ - నల్లగొండ - ద్వారకా నగర్ - హైదరాబాద్ - అబ్దుల్లాపూర్ మెట్ - చౌటుప్పల్ లో ఉన్న భూములపై వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. బినామీ ఆస్తుల లావాదేవీలపై ఐదుగురు నయీం కుటుంబ సభ్యుల పేరుతో నోటీసులు జారీ చేసిన ఐటీ అధికారులు..వచ్చే నెల 3వ తేదీలోగా సమాధానమివ్వాలని ఆదేశించారు. కాగా, ఎన్‌ కౌంట‌ర్ అనంత‌రం రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌ర్యాప్తులో మెజార్టీ వివ‌రాలు దొరికాయని - న‌యీం బాధితులు సైతం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ కు వివ‌రాలు స‌మ‌ర్పించార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో తాజా ద‌ర్యాప్తుతో పోలీసులు ఏం సాదించనున్నారో అర్థం కావ‌డం లేద‌ని అప్పుడే విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

2016 ఆగస్టు 8న షాద్‌ నగర్‌ లోని మిలీనియం కాలనీలో గ్యాంగ్‌ స్టర్‌ నయీం ఎన్‌ కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. నయీం డెన్‌ లలో నుంచి కోట్లాది రూపాయలు - నగలు - భూముల దస్తావేజులు - ఆయుధాలు - కార్లను సిట్‌ స్వాధీనం చేసుకుంది. ఒకపక్క సిట్‌ - మరోపక్క మహబూబ్‌ నగర్‌ రంగారెడ్డి - సైబరాబాద్‌ - రాచకొండ - నల్లగొండ - వరంగల్‌ - కరీంనగర్‌ - ఖమ్మం పోలీసులు నయీంకు సంబంధించి 340కి పైగా కేసులను నమోదు చేసి దర్యాప్తు జరిపారు. నయీం భార్య - కుటుంబసభ్యులతో పాటు మొత్తం 270 మందికి పైగా అతని గ్యాంగ్‌ సభ్యులను అరెస్టు చేశారు. అయితే న‌యీం కేసు ముందుకు సాగడం లేద‌ని బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. నయీంను ఎన్‌ కౌంటర్‌ చేసి - అతని నేర సామ్రాజ్యానికి అడ్డుకట్ట వేసిన పోలీస్‌ శాఖే గ్యాంగ్‌ స్టర్‌ మూలాలన్నిటినీ పెకలించి వేస్తుందని బాధితులు ఆశించారు. కానీ, ఇప్పటి వరకూ నయీంతో కలిసి ఘోరమైన నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలున్న కుడిభుజం శేషన్నతో పాటు అతని 30 మంది సభ్యుల ముఠా ఇంకా సిట్‌ కు చిక్కక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము గాలిస్తున్నామని... త్వరలో పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అయితే, ఏడాది కావస్తున్నా ఫలితం లేక పోవడంతో బాధితులకు ఆందోళన కలిగిస్తోంది. బెదిరించి - కిడ్నాప్‌ లకు పాల్పడి తమ నుంచి నయీం కబ్జా చేసిన వందల ఎకరాల భూమిని తిరిగి ఇప్పించే విషయమై ప్రభుత్వం నుంచి తగిన చర్యలు లేవని వందలాదిమంది బాధితులు వాపోతున్నారు. అదే సమయంలో శేషన్నవంటి కరడుగట్టిన గ్యాంగ్‌ స్టర్‌ పట్టుబడక పోవడంతో తాము ఫిర్యాదు చేస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుందని మరి కొందరు బాధితులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మ‌రోవైపు దాదాపు 20 ఏళ్ల‌కు పైగా నయీంకు చేయూతనిచ్చి అతని నేరాలు పెరగడానికి కారణమవటమే గాక, తామూ కోట్లాది రూపాయల అక్రమాస్తులను కూడబెట్టుకున్న కొందరు పోలీసు అధికారుల విషయంలో తగిన దర్యాప్తు సాగడం లేదని బాధితుల నుంచి విమర్శలున్నాయి. అలాగే నయీంతో అంటకాగి ప్రస్తుతం అధికార పార్టీతో సంబంధాలు ఉన్న కొందరు నాయకుల విషయంలోనూ నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగడం లేదని ఆరోపణలొస్తున్నాయి.