Begin typing your search above and press return to search.

ఐఎస్ లో భారత్ ముస్లింల పట్ల వివక్ష

By:  Tupaki Desk   |   24 Nov 2015 4:11 AM GMT
ఐఎస్ లో భారత్ ముస్లింల పట్ల వివక్ష
X
తన ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం యువకుల్ని ఆకర్షిస్తున్న ఇస్లామిక్ స్టేట్ కి సంబంధించి తాజాగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ మాట విని.. కొందరు భారతీయ ముస్లింలు తప్పు దారి పడుతున్నారు. ఇలాంటి వారి పట్ల ఐఎస్ ఎలా వ్యవహరిస్తుంది? ఐఎస్ లో చేరిన వారి పట్ల ఎలాంటి వ్యవహారశైలి ఉంటుందన్న విషయంపై తాజాగా వెలువడిన సమాచారం సంచలనం సృష్టిస్తోంది.

భారత్.. చైనా.. పాక్.. బంగ్లాదేశ్.. నైజీరియా.. సూడాన్ తదితర దేశాలకు చెందిన ముస్లిం యువకులు ఐఎస్ లో చేరితే వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ దేశాల ముస్లింల పట్ల వివక్ష ప్రదర్శించటం.. వారిని తక్కువగా చూడటం లాంటివి ఐఎస్ చేస్తుందంటున్నారు. దీనికి భిన్నంగా సౌదీ అరేబియా.. పాలస్తీనా.. ఇరాక్.. సిరియా.. ట్యునీషియా దేశాలకు చెందిన ముస్లింలకు మాత్రం పెద్ద పీట వేయటం.. వారికి చక్కటి వసతులు కల్పించటంతో పాటు.. అత్యాధునిక ఆయుధాలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక.. భారత్.. పాక్.. బంగ్లాదేశ్.. ఆఫ్రికా దేశాలకు చెందిన ముస్లింలలో ఎక్కువగా ఆత్మహుతి దాడికి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా చోటు చేసుకున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేయటం గమనార్హం. అంతేకాదు.. వీరిని బ్యారెక్ లలో ఉంచటం.. కాలం చెల్లిన ఆయుధాలు ఇవ్వటం గమనార్హం. అదే సమయంలో ఆరబ్ దేశాలకు చెందిన ముస్లింలకు విలాసవంతమైన భవనాలు కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. అరబ్ ఫైటర్లతో పోలిస్తే భారతీయులు.. పాక్.. బంగ్లాదేశ్ కు చెందిన ముస్లింలు గొప్ప పోరాట యోధులు కాదన్న భావనలో ఐఎస్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అరబ్ ఫైటర్ల కంటే అయా దేశాలకు చెందిన ముస్లింలను తక్కువ దృష్టితో చూస్తున్నట్లుగా తాజాగా విడుదల చేసిన ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది.

భారత్.. పాక్.. బంగ్లాదేశ్.. ఆఫ్రికా దేశాలకు చెందిన ముస్లింలు ఐఎస్ కు చేరిన వెంటనే వారి పాస్ పోర్ట్ లు తగలబెట్టేసి.. వారికి ఏ మాత్రం తెలీకుండానే సూసైడ్ బాంబర్లుగా మార్చేస్తున్నారు. వారి చేతికి ఆయుధాలు ఉన్న వాహనం ఇచ్చేసి.. ఎక్కడికి వెళ్లాలో చెప్పేసి.. ఒక ఫోన్ ఇవ్వటం.. చెప్పిన స్థలానికి వెళ్లిన తర్వాత ఫోన్ చేస్తే.. ఒక వ్యక్తి వచ్చి వారిని తీసుకెళతారని చెబుతున్నారని.. అది నమ్మి ఫోన్ చేస్తే.. వాహనంలోని బాంబులు పేలి విధ్వంసం సృష్టించటంతోపాటు.. సదరు వ్యక్తి ఆత్మాహుతి సభ్యుడిగా మారిపోతున్నారని చెబుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ లో చోటుచేసుకున్న ఈ వివక్షకు సంబంధించిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.