Begin typing your search above and press return to search.

పుల్వామా ఎఫెక్ట్.. ఇండియాలో ఒలింపిక్స్ లేనట్టే..

By:  Tupaki Desk   |   23 Feb 2019 3:53 AM GMT
పుల్వామా ఎఫెక్ట్.. ఇండియాలో ఒలింపిక్స్ లేనట్టే..
X
పుల్వామాలో 43 మంది భారత సైనికులపై దాడిని ఇండియా ఇంకా మర్చిపోవడం లేదు. ఈ ఒక్క సంఘటనతో భారత్, పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్ని విషయాల్లోనూ పాకిస్తాన్ తో సంబంధాలను భారత్ తెంచుకుంటోంది. క్రీడల విషయంలోనూ పాకిస్తాన్ తో ఆడకూడదని దేశానికి చెందిన అన్ని క్రీడాసంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

తాజాగా న్యూఢిల్లీలో జరిగే క్రీడలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న ఇద్దరు పాకిస్తానీ ఆటగాళ్లకు భారత్ వీసాలను నిరాకరించింది. ఒలింపిక్ ప్రపంచకప్ అర్హత పోటీల్లో భాగంగా న్యూఢిల్లీలో జరిగే షూటింగ్ పోటీల్లో పాల్గొనడానికి వారిని ఒలంపిక్ కమిటీ (ఐవోసీ) ఆహ్వానించింది. కానీ భారత్ వీసాలు నిరాకరించడం.. నిషేధించడంపై ఐవీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి భారత్ లో ఒలింపిక్ క్రీడలు కానీ.. సన్నాహక మ్యాచ్ లు కానీ జరగనివ్వమని ఐవీసో స్పష్టం చేసింది. భారత్ ను ఒలింపిక్ మ్యాచ్ ల నుంచి దూరం పెడుతున్నామని పేర్కొంది. క్రీడల విషయంలో రాజకీయ జోక్యాన్ని ఒలింపిక్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

‘ఈ సమస్య పరిష్కరించడానికి భారతీయ అధికారులతో చర్చలు జరిపామని.. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసి ఒప్పించాలని చూసినా పాకిస్తాన్ ఆటగాళ్ల బృందానికి భారత దేశంలో ప్రవేశించడానికి అనుమతించలేదని’ ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారత్ లో భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలు నిర్వహించమని.. సంబంధిత క్రీడల నిర్వహణ బాధ్యతలను కూడా భారత్ కు ఇచ్చేది లేదని.. ఒలింపిక్ క్రీడల నిర్వహణ బాధ్యతల నుంచి భారత్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ఐవీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు పేర్కొంది. భవిష్యతుల్లో భారత్ లో జరిగే అంతర్జాతీయ పోటీలకు, ఫెడరేషన్లు నిర్వహించే పోటీలకు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు తమ ఆటగాల్లను పంపవద్దంటూ ఐవీసీ ప్రపంచ దేశాలను కోరడం సంచలనంగా మారింది.

కాగా భారత ఒలింపిక్ అసోసియేషన్ 2026లో దేశంలో యూత్ ఒలింపిక్స్ నిర్వహణకు ఇప్పటికే ఒప్పుకుంది. 2030లో ఆసియా గేమ్స్, 2032లో మొదటిసారిగా సమ్మర్ ఒలింపిక్స్ ఆతిథ్యమివ్వడానికి భారత్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో ఈ క్రీడల ఆతిథ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.