Begin typing your search above and press return to search.

పంచాయితీ చేయ‌టం త‌ప్పా అంటున్న సీఎం

By:  Tupaki Desk   |   25 Oct 2016 10:34 AM GMT
పంచాయితీ చేయ‌టం త‌ప్పా అంటున్న సీఎం
X
స‌మ‌స్య‌ను స‌కాలంలో గుర్తించి.. దాని కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యాల్ని తీసుకోవ‌టం త‌ప్పేం కాదు. కానీ.. ఇలా ఆలోచించి చేసిన ఒక ప‌ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ను చిక్కుల్లో ప‌డేయ‌ట‌మే కాదు.. బ్రోక‌ర్ అన్న విమ‌ర్శ‌ల‌కు గురి చేసేలా చేసింది. క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన యే దిల్ హై ముష్కిల్ పంచాయితీ తెలిసిందే. ఈ సినిమాలో పాకిస్థానీ న‌టులు న‌టించిన నేప‌థ్యంలో ఈ సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని న‌వ‌నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే వార్నింగ్ ఇవ్వ‌టం.. ఆ విష‌యాన్ని లైట్ తీసుకున్న క‌ర‌ణ్ కు.. షాకుల మీద షాకులు త‌గ‌ల‌టంతో ఇష్యూను క్లోజ్ చేసుకుంటే మంచిద‌న్న భావ‌న‌కు క‌ర‌ణ్ రావ‌టం తెలిసిందే.

ఐష్ అందాల ఆర‌బోత‌తో ఈ సినిమాకు వ‌చ్చిన క్రేజ్‌ను భారీగా సొమ్ము చేసుకున్న‌క‌ర‌ణ్‌.. ఈ సినిమా విడుద‌ల‌లో ఏమాత్రం తేడా కొట్టినా జ‌రిగే న‌ష్టం ఎంత‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. దీంతో.. త‌న‌కు వార్నింగ్ ఇచ్చిన రాజ్ ఠాక్రేతో ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో రాజీ చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి స్వ‌యంగా పంచాయితీ పెట్ట‌టం హాట్‌టాపిక్ గా మారింది. అయితే..అన‌వ‌స‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల్ని తొల‌గించే ప్ర‌య‌త్నంలో బాగంగా సీఎం చొర‌వ తీసుకోవ‌టాన్ని కొంద‌రు అభినందించారు. ఇదిలా ఉంటే.. ఈ పంచాయితీలో మూడు అంశాల చ‌ర్చ‌కు రావ‌టం.. వాటికి క‌ర‌ణ్ ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఓకే అనేయ‌టంతో సినిమా రిలీజ్‌ కు అడ్డంకుల‌న్నీ తొలిగిపోయాయి.

హ‌మ్మ‌య్యా అని క‌ర‌ణ్ ఊపిరి పీల్చుకుంటే.. ఈ వ్య‌వ‌హారంలో వేలెత్తిన మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి అడ్డంగా బుక్ అయ్యారు. పాకిస్థానీ క‌ళాకారులు సినిమాలో న‌టించినందుకు రూ.5కోట్ల మొత్తాన్ని సైనిక స‌హాయ నిధికి ఇవ్వ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగ‌ట‌మే కాదు.. ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్‌ ను బ్రోక‌ర్‌ గా అభివ‌ర్ణిస్తూ ప‌లువురు విమ‌ర్శ‌లు చేసేవ‌ర‌కూ వెళ్లింది. మంచికి పోతే మ‌రేదో ఎదురైన‌ట్లుగా జరిగిన వైనానికి షాక్ తిన్న ఫ‌డ్న‌వీస్‌.. తాజాగా మీడియాను ఇష్టాగోష్టిగా ఆహ్వానించారు. తాను చేసిన పంచాయితీ గురించి చెప్ప‌ట‌మే కాదు.. తాను మంచి చేయ‌బోతే అదికాస్తా త‌న‌కే రివ‌ర్స్ అయింద‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

రూ.5కోట్ల మొత్తాన్ని సైనిక స‌హాయ నిధికి ఇవ్వాల‌న్న డిమాండ్‌ ను తాను అక్క‌డు ఖండించాన‌ని.. అలాంటివి స‌రికాద‌ని చెప్పాన‌ని..కానీ.. ఆ ఇష్యూలో త‌న‌ను ఇన్ వాల్వ్ చేయ‌టంపై ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చ‌ర్చ‌ల ద్వారా తాను చేసిన ప‌నిని మెచ్చుకోవాల్సింది పోయి.. విమ‌ర్శిస్తారా?అంటూ ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. మావోల‌తో.. తీవ్ర‌వాదుల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రుపుతుంటుంద‌ని.. అలాంటిది తాను చ‌ర్చ జ‌రిపితే త‌ప్పు అని ఎందుకు అంటున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. నిజ‌మే.. ఫ‌డ్న‌వీస్ మంచి ప‌నే చేశారు. కాకుంటే.. ఆ పంచాయితీ త‌న స‌మ‌క్షంలో కాకుండా.. ఏదైనా క‌మిటీని ఏర్పాటు చేసి ఒక కొలిక్కి తెచ్చి ఉంటే బాగుండేది. కానీ.. అలాంటివి రాజ్ ఠాక్రే విష‌యంలో సాధ్యం కాని నేప‌థ్యంలో ఆయ‌నే సీన్లోకి రావ‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. మంచి మ‌న‌సుతో ప‌ని చేసినా పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లు కూడా రావొచ్చ‌న్న స‌త్యం ఫ‌డ్న‌వీస్ కు ఇక‌పై ఎవ‌రూ గుర్తు చేయాల్సిన అవ‌స‌రం రాక‌పోవ‌చ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/