Begin typing your search above and press return to search.

లోకేశ్‌ నా కొడుకే..జ‌శోదా నీ భార్య అని తెలుసా?

By:  Tupaki Desk   |   10 Feb 2019 2:15 PM GMT
లోకేశ్‌ నా కొడుకే..జ‌శోదా నీ భార్య అని తెలుసా?
X
ఏపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన కామెంట్ల‌పై ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఘాటుగా స్పందించారు. విజయవాడలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.తనను లోకేశ్ తండ్రి అని అనడంపై సీరియస్ అయిన చంద్రబాబు తాను లోకేశ్ తండ్రి అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఐతే…ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కుటుంబ బంధాల విలువ తెలియదన్నారు. ముస్లిం మహిళల సంక్షేమం పేరుతో.. ట్రిపుల్ తలాఖ్ బిల్లు తెచ్చిన ప్రధానమంత్రి… తన కుటుంబం నుంచి విడిపోవడాన్ని ప్రస్తావించారు. తాను లోకేశ్ తండ్రి అయితే… ప్రధానమంత్రి మోడీ జశోదా బెన్ భర్త అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని విమర్శించారు. తన కుటుంబం గురించి మాట్లాడారు కాబట్టి తాను కూడా ఈ వ్యాఖ్యలు చేయాల్సి రావడం బాధగా అనిపిస్తోందని అన్నారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ మోడీ చేసిన కామెంట్ల‌కు బాబు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయడం చేతగాని మోడీ.. ఇక్కడకొచ్చి తిట్టి పారిపోయారని ఆరోపించారు. తాను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదని.. మోడీనే తన గురువు అద్వానీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. గో బ్యాక్ అంటే.. ఢిల్లీలో మళ్లీ అధికారంలో కూర్చోమని కాదన్న బాబు.. మోడీ ప్రధాని సీట్లోంచి దిగిపోయి.. గుజరాత్ వెళ్లిపోవాలన్నారు. ఏపీకి ఎంతో చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుంటూరులో చెప్పిన లెక్కలపై సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ఆనాడు లోటు బడ్జెట్‌ లో ఉన్న ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, రాజకీయాల కోసం కాదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే మరో 15 సీట్లు గెలిచేవాళ్లమని అన్నారు. ఏపీకి రూ. 3 లక్షల కోట్లు ఇచ్చామని మోడీ చెబుతున్నారని, ఎక్కడ ఇచ్చారు? దేనికి ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. పెత్తందారీ వ్యవస్థను టీడీపీ ఉపేక్షించదన్నారు. ఎదురు ప్రశ్నిస్తే ఐటీ, ఈడీలతో దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం ఎలాంటి దాడులు చేసినా తాము భయపడేది లేదని, జగన్‌ భయపడతారన్నారు.

తాము మోడీకి ఊడిగం చేయడం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఊడిగం చేయడానికి తాము కేంద్రానికి బానిసలం కాదన్నారు. తనపై నమ్మకంతో రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని సీఎం స్పష్టం చేశారు. రైతులకు ఉన్న స్ఫూర్తి ఈ ప్రధానికి లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బీజేపీ సభకు మనుషులు రారు కాబట్టి.. వైసీపీ నేతలు జనసమీకరణ చేశారని చంద్రబాబు విమర్శించారు. రాజధానికి డబ్బులు ఇవ్వరని, పోలవరానికి ఇంకా రూ. 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, వెనుకబడిన ప్రాంతాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. గతంలో తనపై మోడీకి ఉన్న నమ్మకం ఇప్పుడు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇవ్వడం చేతకాక తనను విమర్శిస్తున్నారని అన్నారు. విభజన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని చంద్రబాబు, మోడీని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్ర గడ్డపైకి వచ్చిన ప్రధాని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. మోడీ ఒక ప్రచార ప్రధాన మంత్రి అని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని, మన గ్యాస్‌ ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం జరిగిందా? అని ప్రశ్నించారు. నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్‌ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.