Begin typing your search above and press return to search.

ఆ మాజీ డిప్యూటీకి..ట్రబుల్ షూటర్ కు పట్టిన గతేనా?

By:  Tupaki Desk   |   10 Oct 2019 1:56 PM GMT
ఆ మాజీ డిప్యూటీకి..ట్రబుల్ షూటర్ కు పట్టిన గతేనా?
X
కన్నడ నాట ఆదాయపన్ను(ఐటీ) - సీబీఐ - ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారుల దండయాత్రలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవన్న వాదన బలంగానే వినిపిస్తోంది. కన్నడ నాట రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై... అధికారం దక్కుతుందన్న ధీమాతో ఉన్న బీజేపీకి రిక్త హస్తం అందడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటికి మొన్న ఏకంగా సీఎం కుర్చీలో ఉన్న తాజా మాజీ సీఎం కుమారస్వామికే ఐటీ అధికారులు ముచ్చెమటలు పట్టించారు. ఆ తర్వాత కుమార సర్కారు కూలిపోవడం... ఆ వెంటనే యడ్డీ సర్కారు కొలువుదీరడంతో దర్యాప్తు సంస్థలకు మంచి ఊపు వచ్చింది. ఇప్పటికే కన్నడ కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన డీకే శివకుమార్ ను ఏకంగా జైలుకు తరలించేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు... ఇప్పుడు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత - మాజీ డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర్ ను టార్గెట్ చేశాయి.

గురువారం కన్నడ నాట రంగంలోకి దిగిన ఐటీ అధికారులు నేరుగా పరమేశ్వర్ కుటుంబం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సిద్ధార్థ విద్యా సంస్థల్లో సోదాలు మొదలెట్టేశారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి సమాచారం వచ్చేలోగానే ఐటీ అధికారులు పరమేశ్వర్ ఇంటిలోకి ఎంటరైపోయారు. ఓ వైపు పరమేశ్వర్ విద్యా సంస్థలపై సోదాలు జరుపుతూనే... ఆయన ఇంటిని కూడా జల్లెడ పడుతున్న ఐటీ అధికారులు... డీకే శివకుమార్ మాదిరే పరమేశ్వర్ ను కాస్తంత గట్టిగానే టార్గెట్ చేసినట్లుగా విశ్లేషణలు మొదలైపోయాయి. కన్నడ కాంగ్రెస్ లో డీకే మాదిరే పరమేశ్వర్ కూడా కీలక నేత కిందే లెక్క. డీకే మాదిరి ట్రబుల్ షూటర్ కాకున్నా... పరమేశ్వర్ పార్టీకి అత్యంత ముఖ్యుడిగానే కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఐటీ అధికారులు టార్గెట్ చేసిన వైనం కన్నడనాట రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

డీకే మాదిరే పరమేశ్వర్ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులపై తనదైన శైలిలో స్పందించారు. తన ఇల్లు - విద్యా సంస్థల మీద ఐటీ శాఖలు సోదాలు జరగడం చాల సంతోషంగా ఉందని పరమేశ్వర్ వ్యంగంగా స్పందించారు. దాడులు - సోదాలు చెయ్యకూడదని ఐటీ అధికారులకు చెప్పడం సరికాదని ... తాను చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని - అవినీతి సొమ్ము సంపాదించలేదని ఆయన తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాను అవినీతికి పాల్పడ్డానా? - లేదా? అనే విషయంలో ఐటీ శాఖ అధికారులే క్లారిటీ ఇస్తారని పరమేశ్వర్ వ్యాఖ్యానించారు. తాను అక్రమాలకు పాల్పడ్డానని వెలుగు చూస్తే ఐటీ శాఖా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా పరమేశ్వర్ కాస్తంత ఘాటుగానే స్పందించారు. ఇదిలా ఉంటే పరమేశ్వర్ తో పాటు కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత ఆర్ ఎల్. జాలప్పకు చెందిన ఆసుపత్రి - ఆయన ఆయన కుమారుడి ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. తాజా ఐటీ దాడులపై చాలా వేగంగానే రియాక్ట్ అయిన మాజీ సీఎం సిద్ధరామయ్య... ఈ సోదాలను రాజకీయ కక్షల కారణంగానే జరుగుతున్నవిగా అభివర్ణించారు. మొత్తంగా మరోమారు కన్నడ నాట సోదాల కలకలం మొదలైపోయిందన్న మాట.