Begin typing your search above and press return to search.

మీడియా అధినేత‌పై పోసాని ఫైర్!

By:  Tupaki Desk   |   21 March 2019 10:54 AM GMT
మీడియా అధినేత‌పై పోసాని ఫైర్!
X
సినీన‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌జ్యోతి అధినేత ఆర్కేపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌కు ఈసీ నుంచి వ‌చ్చిన నోటీసుల‌కు సంబంధించి ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛాన‌ల్ లో ప్ర‌సార‌మైన వార్త‌పై ఆయ‌న మండిప‌డ్డారు. ఇటీవ‌ల ఆయ‌న నిర్మించిన సినిమాకు సంబంధించి ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి ద‌ర్శ‌క నిర్మాత పోసానికి నోటీసులు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి.. తన‌కు వ‌చ్చిన నోటీసుల గురించి.. సినిమా గురించి వెల్ల‌డించారు. తాను తీస్తున్న సినిమా ఫ‌స్ట్ కాపీ ఇంకా సిద్ధం కాలేద‌ని.. సినిమాలో ఏముందో ఎవ‌రికి తెలీద‌ని.. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగా లేనందున తాను ఏపీకి వ‌చ్చిన ఈసీ ఎదుట హాజ‌రు కాలేక‌పోతున్న‌ట్లుగా పేర్కొన్నారు.

దీనికి సాక్ష్యంగా త‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేద‌న్న విష‌యాన్ని ఆసుప‌త్రి వ‌ర్గాలు ఇచ్చిన ప‌త్రాల‌ను జ‌త చేశారు. అయితే.. తాను చెప్పిన మాట‌ల్ని వ‌క్రీక‌రిస్తూ ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నం ప్ర‌సారం చేసింద‌ని పోసాని ఫైర్ అయ్యారు. త‌న‌పై అబ‌ద్దాలు ప్ర‌సారం చేస్తారా? అంటూ రాధాకృష్ణ‌ను నిల‌దీశారు.

పోసాని తీస్తున్న సినిమాపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఈసీ కోరితే.. అందుకు భిన్నంగా చంద్ర‌బాబును కులం పేరుతో విమ‌ర్శించినందుకు ఈసీ నోటీసులు ఇచ్చిన‌ట్లుగా వార్త‌ను ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ప్ర‌సారం చేయ‌టాన్నిపోసాని త‌ప్పు ప‌ట్టారు. అదే స‌మ‌యంలో ఆంధ్ర‌జ్యోతి లైవ్ లో కుటుంబరావు మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగాలేద‌న్న విష‌యాన్ని అబ‌ద్ధాలుగా చెబితే అది పెద్ద నేర‌మ‌వుతుందంటూ పోసానిపై చేసిన వ్యాఖ్య‌ల‌పైనా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌కు అబ‌ద్ధాలు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న‌.. అబ‌ద్ధాలు చెప్ప‌టం.. మోసం చేయ‌టం.. వెన్నుపోటు పొడ‌వ‌టం చంద్ర‌బాబు నైజంగా ఆయ‌న మండిప‌డ్డారు.