Begin typing your search above and press return to search.

అమ్మాయిల ఉచ్చులో చిక్కిన‌ వ‌రుణ్ గాంధీ!!

By:  Tupaki Desk   |   21 Oct 2016 1:37 PM GMT
అమ్మాయిల ఉచ్చులో చిక్కిన‌ వ‌రుణ్ గాంధీ!!
X
బీజేపీ ఎంపీ, రక్షణ రంగ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు వరుణ్‌గాంధీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వెల్ల‌డ‌య్యాయి. భారతదేశ రక్షణ శాఖ రహస్యాలను రాబట్టేందుకు ఆయుధ వ్యాపారులు విదేశీ వనితలను ఎరవేస్తున్నారని (హానీట్రాప్) ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అమెరికాకు చెంది న ఓ న్యాయవాది ఉప్పందించారు. ఇలాంటి వలలో పడినవారిలో బీజేపీ ఎంపీ, రక్షణ రంగ పార్లమెంటరీ కమిటీ సభ్యుడైన‌ వరుణ్‌గాంధీ సైతం ఉన్నారని ఆ న్యాయ‌వాది సంచలన ఆరోపణలు చేశారు. వరుణ్‌గాంధీ విదేశీ వనితలతో గడిపిన సమయంలో కొందరు ఫొటోలు తీసి బెదిరించారని.. దీనికి ఆయన లొంగిపోయి, జాతీయ భద్రతపై రాజీ పడ్డారని పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన సీ ఎడ్మండ్స్ అల్లెన్ ఓ న్యాయవాది. గత సెప్టెంబర్ 16 తేదీతో ఉన్న లేఖలో ఈ విషయాలను పేర్కొంటూ ప్రధానికి ఫిర్యాదు చేస్తూ.. లేఖ రాశారు. వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ రక్షణ రంగ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న వరుణ్‌గాంధీని బెదిరించి సమాచారాన్ని సేకరించార‌ని వెల్లడించారు. 2010లో వాయుసేన 6700కోట్లు (బిలియన్ డాలర్లు) విలువజేసే విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు టెండర్లను పిలిచేందుకు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలోని వివరాలను తెలుసుకొనేందుకు అభిషేక్‌వర్మ వరుణ్‌గాంధీ, నాటి ఎయిర్ మార్షల్ హరీశ్ మసాంద్ సహాయం తీసుకున్నారని తెలిపారు. అమెరికా సంస్థ హాకర్ బీచ్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ సంస్థ ఉత్పత్తులను వాయుసేన కొనుగోలు చేసేందుకు సహకరించేలా 2010లో ఎయిర్‌మార్షల్ మసాంద్‌కు వర్మ భారీగా ముడుపులు అందజేశారని అల్లెన్ ఆరోపించారు. వీరందరూ కలిసి హాకర్ బీచ్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ సంస్థకు 6700 కోట్లు విలువజేసే శిక్షణ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందం దక్కేలా చేసేందుకు ప్రయత్నించారని లేఖలో పేర్కొన్నారు. కాగా, వర్మ, అల్లెన్ వ్యాపార భాగస్వాములు! మనీలాండరింగ్, నిధుల మళ్లింపు, మోసం తదితర ఆరోపణలతో ఇద్దరూ 2012లో విడిపోయారు.

అయితే ఈ ఆరోప‌ణ‌ల‌పై వరుణ్‌గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర విషయాలతో తనను ముడివేస్తున్నారని, ఇలాంటి చెత్త విషయాలపై తాను ఎలా స్పందించగలనని ప్రశ్నించారు. అభిషేక్ వర్మను తాను 15 ఏండ్ల కిందట కలిశానని, అప్పటినుంచి అతడితో సంబంధాలు లేవని, అల్లెన్ పేర్కొంటున్న రక్షణరంగ పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో తాను పాల్గొనలేదన్నారు. మీడియాలో వచ్చిన ఫొటోలు కూడా తనవి కావని వ‌రుణ్ గాంధీ స్పష్టం చేశారు. కాగా, వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వరుణ్‌గాంధీ పేరును ప్రకటిస్తారని.. ఆ రాష్ట్రంలోని కొందరు పార్టీ కార్యకర్తలు భావిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగుచూడటం గమనార్హం. కాగా, తన మాజీ వ్యాపార భాగస్వామి అల్లెన్ చేసిన ఆరోపణలను వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ తోసిపుచ్చారు. అల్లెన్ విడుదల చేసిన ఫొటోలు కృత్రిమమైనవి స్పష్టం చేశారు.