Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల‌తో కేంద్రం ఆడుకుంటోందా?

By:  Tupaki Desk   |   2 Sep 2015 7:13 AM GMT
తెలుగు రాష్ట్రాల‌తో  కేంద్రం ఆడుకుంటోందా?
X
మొన్న గోస్వామి...నిన్న గోయల్‌. నేడు...రాజీవ్‌ మెహర్షి. ఇలా 15 నెలల్లో ముగ్గురు కీల‌క అధికారుల‌ను మార్చడం ద్వారా హోమ్‌ శాఖ కార్యదర్శి సీటును మ్యూజికల్‌ చైర్‌ గా మార్చేసిన న‌రేంద్ర‌మోడీ సర్కారు వ్యవహార శైలితో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారే అవ‌కాశాలు ఉన్నాయా? ఇది ఇరు రాష్ర్టాల అభివృద్ధిని ప్ర‌భావితం చేస్తుందా? అంటే అవున‌నే అంటున్నారు.

గోస్వామి పోయారు గోయల్‌ వచ్చా రు.. గోయల్‌ పోయారు రాజీవ్‌ మెహర్షి వచ్చారు. ఇదంతా అధికారంలో ఉన్నవారికి, బ్యూరోక్రాట్లకు మధ్య జరిగే పిల్లీ ఎలుకా చెలగాటం వంటిదే క‌దా దీని వల్ల తెలుగు రాష్ట్రాలకు వచ్చే నష్టం ఏమిటనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. ఈ ప్రశ్నలోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన వ్యవహారాల్లో కేంద్ర హోమ్‌ శాఖ పోషిస్తున్న ముఖ్య భూమికను సమాధానంగా చెప్ప‌వ‌చ్చు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఖాయం అని తేలిపోయిందో అప్పట్నుంచే కేంద్ర హోమ్‌ శాఖ కొలువుదీరిన నార్త్‌ బ్లాక్‌ తెలుగువారికి సుపరిచితంగా మారిపోయింది. ఏపీ పునర్విభజన చట్టం పురుడు పోసుకుంది ఇక్కడే. చట్టం రూపకల్పన, విధి, విధానాలకు సంబంధించిన చర్చలు జరిపే అఖిలపక్ష సమావేశాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారి పోయింది. ఆ తర్వాత పునర్విభజన బిల్లు పార్లమెంట్‌ కు చేరుకో వడం, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అది ఆమోదానికి నోచుకొని చట్టబద్ధత కావడం తెలుగువారి స్మృతి పథంలో ఇప్పటికీ తాజాగా ఉన్న సంఘటనల సమాహారం.

జూన్‌లో తెలంగాణ రాష్ట్రం అవతరించడం,ఆంధ్రప్రదేశ్‌ తనకంటూ సొంత రాజధాని వెదుక్కోవడానికి పనులు ప్రారంభించడం ఏకకాలంలో జరిగాయి. ఆ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అప్పులు, ఆస్తులు, ఉద్యోగులు,తదితరాల పంపిణీకి ఏర్పాటైన కమల్‌నాథన్‌ కమిటీ ఇప్పటికీ తన పూర్తి చేయకపోవడంతో ఢిల్లిలో హోమ్‌ శాఖ తలుపు తట్టడం తెలుగు రాష్ట్రాల మంత్రులు, బ్యూరోక్రాట్లకు త‌ప్ప‌నిస‌రి అయింది. పంపకాలకు సంబంధించి అనేక అంశాలపై ఇంకా ఒక స్పష్టత రాకపోవడంతో వెళ్లింది ఏ పనిమీదైనా హోమ్‌ శాఖను సందర్శించకుంటే హస్తిన యాత్ర సంపూర్ణం కాదనే అభిప్రాయం ఇరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారికి, బ్యూరోక్రాట్లకు నెలకొంది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ప్రత్యేక హోదా లేకున్నా దానికి తగ్గట్లుగా నిధులు ఇస్తామన్నారు కదాని కేంద్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకున్న టీడీపీ ప్రభుత్వం నమ్మబలుకుతుంటే, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదాకా విశ్రమించేది లేదని విపక్షాలు తేల్చి చెబుతున్నాయి. అంతకుముందు ప్రత్యేక హోదా వ్యవహారం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సెలవిచ్చారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని పూనుకున్నప్పటికీ ఆ తతంగానికి శ్రీకారం చుట్టాల్సింది హోమ్‌ శాఖ అన్న విషయం తెలిసిందే. విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదా వస్తుందా రాదా అని యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ఒకటే టెన్షన్‌ పడిపోతుంది. పోనీ తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఏమైనా కేంద్రం పట్ల సానుకూలంగా ఉందా అంటే అదీ లేదు. స్థానికత కారణంగా రిలీవ్‌ చేసిన విద్యుత్‌ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని కేంద్ర హోమ్‌ శాఖ సూచిస్తే.. కోర్టులో ఉన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పడం ద్వారా ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా కేంద్రం పట్ల తనకు గల అసంతృప్తిని తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తూనే ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చిన ప్రతిసారీ వాటికి మధ్యవర్తిగా వ్యవహరించడం హోమ్‌ శాఖకు అనివార్యంగా మారింది. ఆ విధంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు, సర్వతోముఖాభివృద్ధికి అత్యంత కీలకమైందిగా మారింది. చివ‌ర‌కు ఎంసెట్‌ పరీక్షల నిర్వహణ కూడా నార్త్‌ బ్లాక్‌ గడప తొక్కడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలా తుమ్మినా, దగ్గినా కూడా కేంద్రంపై మరీ ముఖ్యంగా హోమ్‌ శాఖపైనే తెలుగు రాష్ట్రాలు ఆధారపడాల్సి వస్తోంది. పూటకో రకంగా పుట్టుకొస్తున్న సమస్యలతో తెలుగు ప్రజలు సతమతమైపోతుంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా అధికారుల‌ను మార్చ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఐదు నెలలకు ఒకరు ఆ పదవిలోకి వచ్చి కూర్చుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన అంశాలు, సమస్య లపై ఒక అవగాహనకు వచ్చి వాటికి నిర్ణయాలు తీసుకునేదె ప్పుడు, పరిష్కారాలు సూచించెందెప్పుడు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని పరిష్కారిం చాల్సిన హోం శాఖ హోమ్‌ కార్యదర్శి పదవితో కేంద్రం బంతాట ఆడుకోవడం సబబు కాద‌ని వాద‌న వినిపిస్తోంది.

రెండేళ్ళ పదవీకాలానికి సంబంధించిన హోమ్‌ శాఖ కార్యదర్శి పదవిలో ఒకరి పదవీకాలం ముగియకుండానే సైకిల్‌ స్టాండులో ఒకదాన్ని కదిలిస్తే వరుసగా మిగతావి పడుతున్నట్లుగా ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరు బ్యూరోక్రాట్లు ఒకే కారణంతో అదీ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నామనే ఏకైక కారణంతో మూడో వ్యక్తికి కుర్చీ అప్పగించడం గతంలో నార్త్‌ బ్లాక్‌ ఎన్నడూ కనీవినీ ఎరుగని విడ్డూరమ‌ని భావిస్తున్నారు. అయితే కేంద్రం ఇలా సగటున ఐదు నెలలకో అధికారిని హోమ్‌ శాఖ కార్యదర్శిగా నియమించడం 2014 నాటి ఏపీ పునర్విభజన చట్టం అమలుకు విఘాతంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి బదులు వాటిని పెంచి పెద్ద చేయడానికి కేంద్రం వ్యవహార శైలి కారణమయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.