Begin typing your search above and press return to search.

క్రైంథ్రిల్లర్ ను తలపిస్తున్న డాక్టర్ల కాల్పుల కేసు

By:  Tupaki Desk   |   10 Feb 2016 4:45 AM GMT
క్రైంథ్రిల్లర్ ను తలపిస్తున్న డాక్టర్ల కాల్పుల కేసు
X
ఒక థ్రిల్లర్ సినిమాను మధ్యలో చూస్తే అస్సలు అర్థం కాదు. అచ్చం అదే తీరులో ఉంది తాజాగా హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న డాక్టర్ కాల్పుల వ్యవహారం. ఈ ఉదంతాన్ని మధ్య నుంచి ఫాలో అయితే అస్సలు అర్థం కాదు. మొదట్నించి ఫాలో కావాల్సిందే. ఏదో ఆర్థిక ఇబ్బందులు.. ఆపై గొడవ.. కాల్పులు అన్నట్లు కాకుండా.. లోతుల్లోకి వెళ్లే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. క్రైం థిల్లర్ ను తలపించేలా ఉన్న ఈ ఉదంతం సోమవారం నుంచి షురూ అయి.. ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. గంటలు గడుస్తున్న కొద్దీ.. కొత్త కొత్త పాత్రలు తెర మీదకు రావటమే కాదు.. పైకి కనిపించినంత సింఫుల్ వ్యవహారం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోతుగా వెళితే.. చాలానే లెక్కలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

డాక్టర్ల కాల్పుల ఉదంతాన్ని మొదట్నించి సింఫుల్ గా చెప్పుకొస్తే..

మాదాపూర్ లో లోరెల్ అనే ఆసుపత్రిని ముగ్గురు డాక్టర్లు.. (శశికుమార్.. ఉదయ్.. సాయి) స్టార్ట్ చేశారు. రూ.15కోట్లతో ప్రారంభించిన (ఆ విషయాన్ని ముగ్గురు డాక్టర్లు చెందిన వారు చెబుతున్న లెక్క ప్రకారం) ఈ ఆసుపత్రికి సంబంధించి ఆర్థిక సంబంధమైన అంశాల్లో తేడా వచ్చింది. దీనిపై ఈ ముగ్గురు మాట్లాడుకోవటానికి హియాయత్ నగర్ బ్లూఫాక్స్ హోటల్ కు వెళ్లారు. అక్కడ మాట్లాడుకోవటానికి అనువుగా లేకపోవటంతో అక్కడి దగ్గర్లోని ఓ గల్లీలోకి కార్లలో చేరుకున్నారు. అక్కడ వీరి మధ్య మాటామాటా పెరిగి డాక్టర్ శశికుమార్.. డాక్టర్ ఉదయ్ మీద కాల్పులు జరిపాడు. అనంతరం అతగాడు పారిపోయాడు. గాయపడిన ఉదయ్ ను ఆసుపత్రిలో చేర్పించారు. నగరం నడిబొడ్డున జరిగిన సంఘటన కావటం.. అందులోకి తుపాకీ కాల్పులు చోటు చేసుకోవటంతో పోలీసులు వెనువెంటనే రంగప్రవేశం చేశారు. ఇక.. కాల్పుల్లో గాయపడిన ఉదయ్ ను ఆసుపత్రికి చేర్పించి చికిత్స షురూ చేశారు. ఇది.. సోమవారం నాటికి బయటకు వచ్చిన విషయాలు.

ఇక.. మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే..

1. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతానికే ఈ ఉదంతానికి సంబంధించి సరికొత్త సమాచారం బయటకు వచ్చింది. డాక్టర్ ఉదయ్ పై కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడన్నది సంచలనంగా మారింది. నగర శివారుల్లోని ఫాంహౌస్ లో తుపాకీని కణతకు గురి పెట్టుకొని కాల్చుకున్నట్లుగా గుర్తించారు. దీంతో.. ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగినట్లైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ తాను సూసైడ్ చేసుకున్న ఫాంహౌస్ అతడిది కాదు. అతడి స్నేహితురాలు చంద్రకళదిగా గుర్తించారు.

2. ఇదిలా ఉంటే.. సూసైడ్ చేసుకున్నారని భావిస్తున్న డాక్టర్ శశికుమార్ ఉదంతంపై ఆయన సతీమణి క్రాంతి మీడియా ముందుకు వచ్చారు. తన భర్తది ఆత్మహత్య కాదని.. కచ్ఛితంగా హత్యేనని ఆరోపించారు. తన భర్తను డాక్టర్ సాయి.. ఉదయ్ లు సోమవారం పిలిపించుకొని చంపేసి.. కాల్పుల ఘటనను సృష్టించారన్నది ఆమె ఆరోపణ. తన భర్త మరణించినట్లుగా చెబుతున్న ఫాంహౌస్ ఎవరిదో తనకు తెలీదని ఆమె వ్యాఖ్యానించటం గమనార్హం. ఆసుపత్రికి తన భర్త ఎక్కువ డబ్బు పెట్టారని.. తన భర్తను మోసం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు.

3. సూసైడ్ చేసుకున్నారని భావించిన డాక్టర్ శశికుమార్ సతీమణి క్రాంతి తన వెర్షన్ వెల్లడించిన వేళ.. మరో అర్థం కాని విషయం ఏమిటంటే.. డాక్టర్ శశికుమార్ సూసైడ్ చేసుకున్న ఫాంహౌస్ ఓనర్ చంద్రకళ అని.. ఆమె డాక్టర్ శశికి మంచి స్నేహితురాలని చెబుతున్నారు. మరి.. అంత మంచి స్నేహితురాలకు చెందిన ఫాంహౌస్ విషయం సూసైడ్ చేసుకున్నారని చెబుతున్న డాక్టర్ శశికుమార్ సతీమణికి ఎందుకు తెలీదు? అన్నది మరో ప్రశ్న.

4. ఇలా సాగుతున్న వ్యవహారంలోకి ఫాంహౌస్ ఓనర్ చంద్రకళ వెర్షన్ మరింత ఆసక్తికరంగా ఉంది. అదేమంటే.. సోమవారం సాయంత్రం తన ఇంటికి డాక్టర్ శశికుమార్ వచ్చారని.. తాను చాలా ఒత్తిడిలో ఉన్నానని.. రిలాక్స్ అయ్యేందుకు ఫాంహౌస్ వెళదామని చెప్పటంతో రెండు మందు బాటిల్స్ తీసుకొని ఫాంహౌస్ వెళ్లినట్లుగా చంద్రకళ చెబుతున్నారు. ఫాంహౌస్ చేరుకున్నాక.. డాక్టర్ సార్ కు అవసరమైన ఏర్పాట్లు చూసుకోవాలని వాచ్ మన్ శంకరయ్యకు చెప్పి తాను ఇంటికి తిరిగి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తే.. డాక్టర్ శశికుమార్ ఇష్యూ తెలిసిందని.. వెంటనే డాక్టర్ శశికి ఫోన్ చేస్తే అతడి ఫోన్ ఆఫ్ చేసి ఉండటంతో వాచ్ మన్ కి ఫోన్ చేసి డాక్టర్ తో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేశారని.. దీంతో తనకు తెలిసిన మేజర్ మిత్రుడికి ఫోన్ చేస్తే.. సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించినట్లుగా ఆమె చెబుతున్నారు.

5. ఆమె ఇచ్చిన సమాచారంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోలీసులు డాక్టర్ శశికుమార్ ను అదుపులో తీసుకునేందుకు వెళ్లేసరికి అతడు రక్తం మడుగులో పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

సందేహాలెన్నో..

1. సూసైడ్ చేసుకుంటున్నట్లు డాక్టర్ శశికుమార్.. చంద్రకళతో చెప్పి ఉంటే.. ఆ విషయాన్ని వాచ్ మన్ కి చెప్పి.. ఎందుకు అలెర్ట్ చేయలేదు?

2. డాక్టర్ సాబ్ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఆమె ఎందుకు నిరోధించలేదు?

3. మనసు బాగోలేదని చెప్పి.. మందుబాటిల్స్ తో రిలాక్స్ కావటానికి ఫాంహౌస్ కి రావాలని మంచి స్నేహితురాలు చంద్రకళను డాక్టర్ శశికుమార్ అడగటం ఒక ఎత్తు అయితే.. తన భర్త మరణించిన ఫాంహౌస్ ఎవరిదో తనకు తెలీదని భార్య క్రాంతి చెప్పటం ఏమిటి?

4. మంచి స్నేహితురాలు చంద్రకళ అయినా క్రాంతికి తెలుసా? లేదా?

5. డాక్టర్ శశికుమార్ సూసైడ్ చేసుకోబోతున్నట్లు.. తనకు ఫోన్లోఈ విషయాన్ని చెప్పారని.. తానే అతన్ని ఫాంహౌస్ తీసుకెళ్లినట్లుగా చెబుతున్న చంద్రకళ గురించి డాక్టర్ సతీమణి క్రాంతి పోలీసులకు ఏం చెప్పారు?

6. డాక్టర్ స్నేహితురాలు చంద్రకళ చెప్పే వెర్షన్ కు.. డాక్టర్ భార్య క్రాంతి చేస్తున్న వాదనకు మధ్య అంత వ్యత్యాసం ఎందుకు వచ్చినట్లు..?