Begin typing your search above and press return to search.

స్విస్ ఛాలెంజ్ మీద హైకోర్టు మాట విన్నారా?

By:  Tupaki Desk   |   27 Sep 2016 5:53 AM GMT
స్విస్ ఛాలెంజ్ మీద హైకోర్టు మాట విన్నారా?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగులుతుందా? అన్న సందేహం కలిగేలా తాజాగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానంపై సింగిల్ జడ్జి ఆదేశాలపై హైకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం ఏపీ వాదనతో ఏకీభవించకపోవటం తాజా పరిణామంగా చెప్పాలి. పిటీషనర్లు పేర్కొన్న అంశాలకే పరిమితం కావాల్సిన అవసరం లేదని.. ప్రజా ప్రయోజనాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్.. న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ లతో కూడిన డివిజన్ బెంచ్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.

స్విస్ ఛాలెంజ్ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్వీయన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ఆదిత్య కన్ స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన సింగిల్ జడ్జి టెండర్ నోటిఫికేషన్లపై స్టే విధించారు. దీన్ని సవాలు చేస్తూ.. మున్సిపల్ శాఖ.. సీఆర్డీఏ వేర్వేరుగా పిటీషన్లను దాఖలు చేశారు. వీటి విచారణ సోమవారం జరిగింది.

విచారణ సందర్భంగా పిటిషనర్లు పిల్స్ దాఖలు చేయలేదని.. సింగిల్ జడ్జి పిల్స్ మాదిరిగా పిటిషన్ల‌ను పేర్కొన్నారని.. వివిధ అంశాల్లోకి వెళ్లి స్టే ఇచ్చారంటూ ఏపీ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఈ సందర్భంగా స్పందించిన డివిజన్ బెంచ్.. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని సవాలు చేసిన పిటీషన్ లో పేర్కొన్న అంశాలకు మాత్రమే పరిమితం కావాల్సిన అవసరం లేదని.. ప్రజా ప్రయోజనాన్ని పరిగణలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రాథమిక దశలోనే సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదిత ఆదాయ వివరాలు బహిర్గతం చేయాలని సింగిల్ జడ్జి చెప్పారని.. అది సరైనది అయినప్పుడు మిగిలిన విషయాలు కూడా కరెక్టే అవుతాయని బెంచ్.. ఏపీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసు విచారణ మంగళవారం కూడా జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో స్విస్ ఛాలెంజ్ అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/