Begin typing your search above and press return to search.

హైకోర్టు తీర్పుతో ఆందోళ‌న‌లో కార్మికులు...!

By:  Tupaki Desk   |   15 Oct 2019 1:45 PM GMT
హైకోర్టు తీర్పుతో ఆందోళ‌న‌లో కార్మికులు...!
X
ఆర్టీసీ కార్మికుల స‌మ్మెపై హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆర్టీసీ కార్మికులు ఆందోళ‌న‌లో ప‌డ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆర్టీసీ కార్మికులు ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క కార్మికులు ఆయోమ‌యంలో ప‌డిపోయారు. ఇంత‌కు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి.. ఎందుకు కార్మికులు ఆందోళ‌న‌లో ప‌డ్డారు. స‌మ్మె విర‌మించ‌డ‌మా.. లేక అలాగే ముందుకు సాగ‌డ‌మా.. లేక న్యాయం కోసం మ‌రోమారు కోర్టు త‌లుపు త‌ట్ట‌డ‌మా అనేది ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్న స‌మ‌స్య‌.. ఇంత‌కు ఆర్టీసీ స‌మ్మెపై హైకోర్టులో ఏమి జ‌రిగిందంటే..

ఆర్టీసీలో స‌మ్మె ను హైకోర్టు త‌ప్పు ప‌ట్టింది. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా స‌మ్మె చేయ‌డం, ప్ర‌యాణికుల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌డ‌మేనని అన్నారు. ఇప్పుడు జ‌రుగుతున్న స‌మ్మెతో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని - ప్ర‌భుత్వం - కార్మికుల న‌డుమ ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, అందుకు స‌మ్మెను వెంట‌నే విర‌మించి ప్ర‌భుత్వంతో వెంట‌నే చ‌ర్చ‌లకు వెళ్లాల‌ని హైకోర్టు చూచించింది. అంతే కాదు. నిర‌స‌న తెలుప‌డానికి అనేక మార్గాలు ఉన్నాయ‌ని - ఆఖ‌రి అస్త్రం ప్ర‌యోగించినా ఫ‌లితం లేకుండా పోయింది క‌దా - ప్ర‌భుత్వం ఎస్మా ప్ర‌యోగిస్తే ఏం చేస్తారు - మీరు చేస్తున్న స‌మ్మె న్యాయ‌మైందే కావొచ్చు.. న్యాయ‌మైన డిమాండ్ల కోస‌మే స‌మ్మె చేస్తుండొచ్చు.. పండుగ పూట ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెట్ట‌డానికే స‌మ్మెనా ? అంటూ హైకోర్టు కార్మిక సంఘాల‌ను ప్ర‌శ్నించింది.

ఆర్టీసికి పూర్తి స్థాయి ఎండీ లేర‌ని - అందుకే స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు ఎవ్వ‌రు లేర‌ని - స‌మ‌స్య‌లు ఎవ్వ‌రికి చెప్పుకోవాల‌ని - అందుకే ఆఖ‌రి ఆస్త్రంగా స‌మ్మె చేస్తున్నామ‌ని కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపారు. ఇక ప్ర‌భుత్వం పండుగ పూట స‌మ్మెతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డార‌ని, అయినా కూడా బ‌స్సులు పూర్తిస్థాయిలో న‌డుపుతున్నామ‌ని - ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం కుద‌ర‌ని - స‌మ్మెతో బ‌డుల‌కు సెల‌వులు ఇచ్చామ‌ని హైకోర్టుకు తెలిపింది. అయితే బ‌స్సులు పూర్తిస్థాయిలో న‌డిస్తే బ‌డుల‌కు ఎందుకు సెల‌వులు పొడిగించార‌ని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది.

అంతే కాదు వెంట‌నే కార్మికుల‌ను చ‌ర్చ‌లు పిల‌వాల‌ని - స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని - ఆర్టీసీకి వెంట‌నే పూర్తి స్థాయి ఎండీని నియ‌మించాల‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చ‌ర్చ‌ల‌కు పిలిస్తే మేము వెళ్లేందుకు సిద్ద‌మేన‌ని - కాని ప్ర‌భుత్వ‌మే చ‌ర్చ‌ల‌కు పిల‌వ‌డం లేద‌ని కార్మిక సంఘాలు హైకోర్టు తెలిపారు. కేసును ఈనెల 18 హైకోర్టు వాయిదా వేసింది.