Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప‌గ‌పై నీళ్లు చ‌ల్లిన హైకోర్టు

By:  Tupaki Desk   |   24 April 2018 7:08 AM GMT
కేసీఆర్ ప‌గ‌పై నీళ్లు చ‌ల్లిన హైకోర్టు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ టీం దూకుడుకు రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం బ్రేకులు వేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరణ చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా...ఎమ్మెల్యేలు స్పందించినంత వేగంగా తాము స్పందించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరించడం చెల్లదని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌పై వచ్చే గురువారం అంటే ఈనెల 26న విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం సరైన నిర్ణయమేనని, జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరుతూ టీఆర్ఎస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. తాము మార్చి 12న గవర్నర్ ప్రసంగించే సమయంలో శాసనసభలో ప్రత్యక్ష సాక్షులమని, సభ్యులుగా సభలో ఉండి వారిద్దరూ చేసిన చర్యల్ని కళ్లారా చూశామని అప్పీల్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్ - మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి - కాలె యాదయ్య - రవీంద్రకుమార్ రమావత్ - బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి - జి.సాయన్న- మర్రి జనార్దన్‌రెడ్ - గాదరి కిషోర్ కుమార్ - వివేకానంద - అరికెపూడి గాంధీ - మాధవరం కృష్ణారావులు ఈ అప్పీల్‌ను దాఖలు చేశారు. ఇందులో కోమటిరెడ్డి,సంపత్‌కుమార్, న్యాయ,శాసనవ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్లను ప్రతివాదులను చేశారు. కోమటిరెడ్డి, సంపత్ దాఖలు చేసిన కేసులో ప్రతివాదులు కాని ఈ 12 మంది ఎమ్మెల్యేలు అప్పీల్ చేయాలంటే కోర్టు అనుమతి విధిగా పొందాలి. అందుకు అనుగుణంగా వీరంతా విడిగా దరఖాస్తు చేసుకున్నారు. సింగిల్ జడ్జి శివశంకర్‌రావు తీర్పును రద్దు చేయాలని అధికారపార్టీ ఎమ్మెల్యేలు వేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.

అప్పీల్ వ్యాజ్యం ప్రాధాన్యత గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు లాయర్ రవీందర్‌రెడ్డి శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ సారధ్యంలో బెంచ్‌కి విన్నవించారు. ఇప్పటికిప్పుడే ఈ కేసును విచారించాల్సిన అవసరం లేదని, కోమటిరెడ్డి కేసులో మీరు ప్రతివాదులు కాదు కాబట్టి అనుమతి కోసం దాఖలు చేసిన అప్పీల్‌ను ముందుగా విచారించి ఆపై అసలు కేసు గురించి నిర్ణయం తీసుకోవచ్చునని బెంచ్ తెలిపింది. `ఇప్పుడు శాస‌న‌స‌భా స‌మ‌వేశాలు జ‌రుగడం లేదు. ఈ నేప‌థ్యంలో వెంట‌నే విచారించాల్సిన అవ‌స‌రం లేదు` అని కోరు తెలిపింది. త‌ద్వారా కేసీఆర్ టీం ఎమ్మెల్యేల‌ దూకుడుకు బ్రేకులు వేసింది. తద్వారా పరోక్షంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వెంటనే పగ తీర్చుకోవాలన్న కేసీఆర్ ఆశలపై నీళ్లుచల్లింది.