Begin typing your search above and press return to search.

ఏపీ.. టీ సర్కారుల్ని కడిగేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   28 Nov 2015 7:45 AM GMT
ఏపీ.. టీ సర్కారుల్ని కడిగేసిన హైకోర్టు
X
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఒకే విధంగా ఉందన్న విషయం తాజాగా బయటపడింది. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వ్యవహరించటం.. వీరి కారణంగా సాదాసీదా ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడటం జరుగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాలు పలు వివాదాలపై ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం.. తిట్టుకోవటం.. తప్పు మీదంటే మీదని బురద జల్లుకోవటం కనిపిస్తుంది. నిజానికి వీరిద్దరిలో తప్పు ఎవరు చేస్తున్నారన్న విషయంపై ఎవరూ మాట్లాడని పరిస్థితి.

ఇలాంటి సమయంలో తాజాగా హైకోర్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని కడిగిపారేసింది. రెండు ప్రభుత్వాలు దొందూదొందే అన్నట్లు వ్యవహరిస్తున్నాయని.. ప్రజల గురించి పట్టించుకోవటం లేదని తేల్చేసింది. అంబేడ్కర్.. తెలుగు యూనివర్సిటీలకు సంబంధించి సేవల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు అనుసరించిన పద్దతులపై మండి పడింది. ఈ విషయంలో ఇద్దరూ వైరి వర్గం మీద విమర్శలు చేసినా.. ఇద్దరూ తక్కువ తినలేదన్న విషయం అర్థమవుతుంది. ఈ విషయాన్న సింఫుల్ గా అర్థం చేసుకోవాలంటే..

అసలు వివాదం ఏమిటి?

విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించిన సేవలు ఏపీకి అందించటం.. ఏపీ విద్యార్థులు వాటిని పొందటం. అయితే.. వీటిని అందించటం లేదన్నది ఏపీ వాదన. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామన్నది తెలంగాణ సర్కారు వాదన.

ఇందులో నిజం ఎంత?

ఏపీలోని 92 విద్యా కేంద్రాలకు సేవలు అందించాలని అంబేడ్కర్ వర్సిటీ రిజిష్ట్రార్ కు కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. అంబేడ్కర్.. తెలుగు వర్సిటీలకు సంబంధించి ఏపీలో పని చేసే ఉద్యోగులకు ఏపీ సర్కారే జీతాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. స్టడీ సెంటర్ల నిర్వహణ లాంటివి ఏపీనే చూసుకోవాలని చెప్పింది.

మరేం జరిగింది?

తెలంగాణలోని అంబేడ్కర్ వర్సిటీ.. తెలుగు వర్సిటీలు హైకోర్టు సూచనల్ని పట్టించుకోలేదన్నది ఆరోపణ. అంబేడ్కర్ వర్సిటీ కి అనుబంధమైన ఏపీలోని 92 స్టడీ సెంటర్ల వివరాల్ని తన వెబ్ సైట్ నుంచి తొలగించి.. విద్యా కేంద్రాల్లో సేవలు అందించలేదని ఏపీ సర్కారు తరఫు వాదనలు వినిపించారు. అదే నిజమైతే.. చాలా తప్పు అని హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు తెలంగాణ న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ.. ఏపీలో పని చేసే ఉద్యోగులకు సంబంధించి జీతభత్యాలు చెల్లించలేదని పేర్కొన్నారు. దీనిపై ఏపీ న్యాయవాది మాట్లాడుతూ.. జీతాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. దీనికి బదులిచ్చిన తెలంగాణ న్యాయవాది అంబేడ్కర్ వర్సిటీకి మాత్రమే జీవో జారీ చేశారని.. తెలుగు వర్సిటీకి మాత్రం అలాంటిది చేయలేదని చెప్పారు.

హైకోర్టు ఏం చెప్పింది

ఇలా ఎవరికి వారు.. తమ తప్పుల్ని కవర్ చేసుకోవటం.. ఎదుటోళ్ల తప్పుల్ని ఎత్తి చూపటంపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. విద్యార్థుల జీవితాల్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడింది.

నిజానికి.. రెండు రాష్ట్రాల న్యాయవాదుల వాదనను చూస్తే ఇది నిజం అనిపించక మానదు. వేలాది మంది విద్యార్థుల విషయంలోనూ.. ఉద్యోగుల విషయంలోనూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ‘‘ఇగో’’ ప్రదర్శించిన వైనం విస్మయానికి గురి చేయక మానదు