Begin typing your search above and press return to search.

వర్షం..వరదతో వణికిపోతున్న18 లక్షల మంది

By:  Tupaki Desk   |   2 Aug 2015 10:43 AM GMT
వర్షం..వరదతో వణికిపోతున్న18 లక్షల మంది
X
వరుణుడి జాడ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కిందామీదా పడిపోతుంటే.. మరోవైపు భారీ వర్షాలతో కొన్ని రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో కురిసిన భారీ వర్షంతో ఆ రాష్ట్రం వణికిపోతోంది. భారీ వర్షం.. ఆ పై వరదల్ని ఏ రకంగా హ్యండిల్ చేయాలో అర్థం కాక సతమతమవుతోంది. లండన్ లో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తన విదేశీ పర్యటనను కుదించుకొని మరీ హుటాహుటిన కోల్ కతాకు పయనమైన పరిస్థితి.

గడిచిన 18 గంటల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కాగా.. వరదల కారణంగా దాదాపు 18 లక్షల మంది నిరాశ్రయలు అయ్యారు. మరి కొన్ని లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.

భారీ వర్షాల కారణంగా డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంతో రాకపోకలకు.. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. బెంగాల్ ఇంత భారీగా ఇబ్బంది పడుతుంటే కేంద్రం తమను అస్సలు పట్టించుకోవటం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైరయ్యారు. తాము కేంద్రాన్ని సాయం కోసం అర్థించమంటూ వ్యాఖ్యానించారు.

ఇక.. వర్ష తీవ్రత ఎంత భారీగా ఉందన్న విషయం ఉదయాన్నే నిద్ర లేచి బయటకు వచ్చిన ప్రజలకు అర్థమై షాక్ తిన్న పరిస్థితి. జాతీయ రహదారుల్లో 5 నుంచి 10 అడుగుల ఎత్తులో నీళ్లు నిలిచిన దృశ్యాలు వర్ష తీవ్రత ఎంతన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి.