Begin typing your search above and press return to search.

మోడీ ఘ‌న‌త‌...అప్పుల కుప్ప‌గా దేశం

By:  Tupaki Desk   |   20 Jan 2019 5:19 AM GMT
మోడీ ఘ‌న‌త‌...అప్పుల కుప్ప‌గా దేశం
X
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌ డీఏ సర్కారు పాలనలో దేశం అప్పుల‌కుప్ప‌గా మారుతోంది. మోడీ ఏలుబ‌డిలో గడిచిన నాలుగున్నరేళ్ల‌లో దేశ రుణ భారం దాదాపు 50 శాతం పెరిగిపోయింది. భార‌త రుణ భారం రూ.82 లక్షల కోట్లను దాటిపోయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అప్పులపై ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎనిమిదో ఎడిషన్ స్టేటస్ పేపర్ ప్రకారం గతేడాది సెప్టెంబర్ నాటికి మొత్తం కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ.82,03,253 కోట్లను చేరుకున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన జూన్ 2014లో రూ.54,90,763 కోట్లుగానే ఉన్నాయి. దీంతో మోదీ హయాంలో సర్కారీ రుణాలు మరో రూ.27,12,490 కోట్లు పెరిగాయన్నమాట. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానన్న నమో.. అప్పుల సేకరణకున్న ఏ అవకాశాన్నీ విడిచిపెట్టకపోవడం గమనార్హం. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి రాకముందు గోల్డ్ బాండ్ల ద్వారా సమీకరించిన రుణాలేమీ లేవు. అయితే ఇప్పుడు ఆ మార్గంలో అందుకున్న అప్పుల విలువ రూ.9,089 కోట్లుగా ఉంది. ఇక మార్కెట్ ఆధారిత రుణాలూ గతంతో పోల్చితే 47.5 శాతం పెరిగి రూ.52 లక్షల కోట్లకుపైగా పేరుకుపోయాయని ఈ నివేదిక‌ స్ప‌ష్టం చేసింది.

ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరం తారాస్థాయికి చేరుతుండటంతో ద్రవ్యలోటు లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతుండటంతో పాలనాపరమైన నిర్వహణలో భాగంగా ప్రభుత్వం అప్పుల బాట పడుతోంది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకట్టుకోవడంలో భాగంగా సంక్షేమ పథకాల కేటాయింపులను పెంచుతుండటం కూడా ఆర్థిక క్రమశిక్షణకు భంగం వాటిల్లుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19)గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో ద్రవ్యలోటును దేశ జీడీపీలో 3.3 శాతానికి (రూ.6.24 లక్షల కోట్లు) కట్టడి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)లో ద్రవ్యలోటును 3.5 శాతానికే కట్టడి చేశారు. అయితే గతేడాది నవంబర్‌ తో ముగిసిన ఎనిమిది నెలల కాలంలోనే ద్రవ్యలోటు రూ.7.17 లక్షల కోట్లకు చేరింది. ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే 114.8 శాతంగా నమోదు కావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మ‌రోవైపు పెట్టుబడుల ఉపసంహరణ సైతం ఫ‌లితాలు ఇవ్వ‌డం లేదని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఖజానాకు రూ.80,000 కోట్ల నిధులను తరలించాలని మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటిదాకా రూ.34,000 కోట్లకుపైగానే సమీకరించింది. ఓ వైపు పెరుగుతున్న రుణ భారం.. మరోవైపు నెరవేరని పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం.. ఇంకోవైపు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తదితర మార్గాల ద్వారా పడిపోతున్న ఆదాయం.. మోడీ సర్కారుపై ముప్పేట దాడినే చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంస్థల నుంచి డివిడెండ్లపై ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మిగులు నిల్వలపై కన్నేసింది. ఆ సొమ్ముతో పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ఏర్పడిన ఇబ్బందులనేగాక, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ ఎస్ రుణ సంక్షోభం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో కలిగిన సమస్యలనూ అధిగమించవచ్చునని భావించింది. అది కుదురకపోవడంతో ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ ను మోడీ సర్కారు కోరుతున్న విషయం తెలిసిందే.