Begin typing your search above and press return to search.

నోటా ఓట్లన్నీ కూడా ఈ పార్టీలకు రాలేదట..

By:  Tupaki Desk   |   12 Dec 2018 6:36 AM GMT
నోటా ఓట్లన్నీ కూడా ఈ పార్టీలకు రాలేదట..
X
ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎవరు ఏ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నారో తేటతెల్లమైంది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లోని రాజస్తాన్- మధ్యప్రదేశ్- చత్తీస్ ఘడ్ ఫలితాల పై ఆసక్తి నెలకొంది. ఇక్కడ పొత్తులు లేకుండా కాంగ్రెస్- బీజేపీ పోటాపోటీ గా తలపడ్డాయి. కాంగ్రెస్ విజేతగా నిలిచింది.

అయితే గట్టిపోటీనిస్తామని భావించిన ఆమ్ ఆద్మీ- సమాజ్ వాదీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు తేలిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇవి కనీస ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఈ సారి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని భావించిన ఆమ్ ఆద్మీ- సమాజ్ వాదీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కనీసం నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా తెచ్చుకోకపోవడం విస్తుగొలిపింది.

ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. చత్తీస్ గఢ్ లో 2.1శాతం (2,46,918) ఓట్లు నోటాకు వచ్చాయి. అక్కడ 85 స్థానాల్లో పోటీచేసిన ఆమ్ ఆద్మీ కేవలం 0.9శాతం (1,04,362) ఓట్లు మాత్రమే తెచ్చుకోవడం విశేషం. ఎస్పీ, ఎన్సీపీలకు (20,233) 0.52 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. ఇక సీపీఐ కి అయితే కేవలం 0.3 (38811) ఓట్లు మాత్రమే తెచ్చుకోవడం గమనార్హం.

ఇక మధ్యప్రదేశ్ లో నోటాకు 1.5శాతం ఓట్లు రాగా.. ఎస్పీకి 1శాతం, ఆమ్ ఆద్మీకి 0.7శాతం ఓట్లు తెచ్చుకుంది. రాజస్తాన్ లో నోటాకు 1.3శాతం ఓట్లు రాగా.. సీపీఐకి 1.3శాతం, ఎస్పీలకు 0.2శాతం మాత్రమే ఓట్లు లభించాయి. మిజోరంలో నోటాకు 0.5శాతం ఓట్లు లభించగా.. ఫ్రిజమ్ పార్టీ కి 0.2శాతం ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.

ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ బొక్కా బోర్లా పడింది. ఈ దెబ్బకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ- మిజోరంలో ప్రాంతీయ పార్టీలు గెలువగా.. రాజస్తాన్- మధ్యప్రదేశ్- చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. ఇప్పటివరకూ అప్రతిహతంగా సాగిన బీజేపీ గెలుపు యాత్రకు మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వడంతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద నాయకులెవరూ లేకుండా పోయారు. దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ కార్యాయలం వద్ద ఏర్పాటు చేసిన బారీ కేడ్లను కూడా పోలీసులు తొలగించడం విశేషం.