Begin typing your search above and press return to search.

సీడీలో ఉన్నది నేనే.. మాటలు నావి కావంటున్న సీఎం

By:  Tupaki Desk   |   2 May 2016 4:13 AM GMT
సీడీలో ఉన్నది నేనే.. మాటలు నావి కావంటున్న సీఎం
X
కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఒక స్టింగ్ ఆపరేషన్ జరగటం.. అందులో ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ అడ్డంగా బుక్ కావటం తెలిసిందే. ఎమ్మెల్యేల్ని కొనేందుకు కోట్లాది రూపాయిలు వెచ్చించేందుకు తాను సిద్ధమని చెప్పిన సీడీలు బయటకు వచ్చి సంచలనం సృష్టించాయి. ఇప్పటివరకూ సీడీలతో తనకు సంబంధం లేదని.. ఆ సీడీల్లో ఉన్నది తాను కాదని చెప్పిన ఈ మాజీ సీఎం.. తాజాగా సీడీలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టారు.

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు సంబంధించి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేల్ని కొనేందుకు ఒక జర్నలిస్ట్ తో కలిసి మాజీ సీఎం రావత్ ఒప్పందం చేసుకున్నట్లుగా చెప్పే సీడీపై తాజాగా స్పందించిన రావత్.. ఆ సీడీలో ఉన్నది తానేనని.. కాకుంటే మాటలు మాత్రమే తనవి కావని వ్యాఖ్యానించటం గమనార్హం. తనపై జరిగిన కుట్రలో బాగంగానే తనను ఇరికించారని రావత్ ఆక్రోశిస్తున్నారు.

ఇంతకాలం స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన సీడీలు నకిలీవని చెప్పిన రావత్.. మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీడీలో ఉన్నది తానేనని అంగీకరించారు. అయితే.. అందులో వినిపిస్తున్న మాటలు తనవి కావంటున్న ఆయన.. ‘‘ఎవరైనా నా కోసం రూ.15కోట్లు ఎందుకు ఖర్చు చేస్తారు? వీడియోలో ఉన్న జర్నలిస్ట్ నా టైం తినేసేందుకు ఏవో అర్థంపర్థం లేని విషయాలు చెబుతున్నాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు నేనేదో చెప్పా. రోజూ ఇలాంటివి చెబుతూనే ఉంటాం. ఇవేమైనా పెద్ద విషయాలా? నేను మాట్లాడిన మాటల్ని నాకు వ్యతిరేకంగా వాడుకుంటారా?’’ అంటూ రివర్స్ గేర్ లో చెలరేగిపోతున్నారు. కెమేరా కంటికి అడ్డంగా బుక్ అయ్యాక కూడా ఎంత పెడసరంగా మాట్లాడుతున్నారో కదా..?