Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ పై అంత ప్రేమ ఎందుకు హ‌రీశ్‌?

By:  Tupaki Desk   |   10 Feb 2016 1:47 PM GMT
జ‌గ‌న్‌ పై అంత ప్రేమ ఎందుకు హ‌రీశ్‌?
X
మెద‌క్ జిల్లా నారాయ‌ణ్‌ ఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా ప్ర‌చారం చివ‌రి ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో నేత‌ల కామెంట్లు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ అయిన‌ నారాయ‌ణ్‌ ఖేడ్‌ లో కారు జోరును కొన‌సాగించే బాధ్య‌త‌ను నెత్తిన వేసుకున్న మంత్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు హరీష్‌ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. త‌మ అభ్య‌ర్థిని ఏక‌గ్రీవం చేయకుండా టీఆర్ ఎస్ రాజ‌కీయం చేస్తోందని అందుకే ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని కాంగ్రెస్ చేసిన‌ కామెంట్‌తో హ‌రీశ్‌ రావుకు కాలిపోయింది. స‌హ‌జంగానే మాట‌కారి అయిన హరీశ్ రావు ఈ ఆరోప‌ణ‌తో కాంగ్రెస్ పుట్టుపూర్వోత్త‌రాల‌ను ఏక‌రువు పెట్టారు. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ కు మ‌ద్ద‌తిచ్చేలా మాట్లాడారు.

నారాయణ్ ఖేడ్‌ లో ఎన్నికలకు భయపడి కాంగ్రెస్ నాయ‌కులు వారసత్వ‌ రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని హ‌రీశ్ మండిప‌డ్డారు. వారసత్వ రాజకీయాలకు విరుద్దంగా నారాయణఖేడ్‌ లో టీఆర్ ఎస్ అభ్యర్థిని పోటీకి నిలిపిందని చెప్పారు. 2015లో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ చనిపోతే ఆయన భార్య సుగుణకు టీడీపీ టికెట్ ఇచ్చిందని అయితే అక్క‌డ‌ ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించకుండా కాంగ్రెస్ తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది నిజం కాదా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ సీఎం వైఎస్ రాజేశేఖర్‌ రెడ్డి అకాల మరణం చెందినపుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు కాంగ్రెస్ పార్టీ సీఎం పదవిని ఇచ్చిందా? అని ప్రశ్నించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాల గురించి, ఏక‌గ్రీవాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

నారాయణ్‌ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని ...తేలాల్సింది ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కుతాయా? లేదా అనే విషయమేనని హ‌రీశ్‌రావు తెలిపారు. టీఆర్‌ ఎస్‌ ను గెలిపిస్తే నారాయణ్‌ ఖేడ్‌ ను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని, సిద్ధిపేట‌లాగా తీర్చిదిద్దుతాన‌ని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వస్తారు, వెళతారు కానీ అభివృద్ధి మాత్రం చేయ‌ర‌ని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నపుడే అభివృద్ధి చేయని ఆ నేతలు ఇప్పుడేం చేస్తారని ప్ర‌శ్నించారు. ఉప ఎన్నిక సంద‌ర్భంగా కాంగ్రెస్‌ పై విరుచుకుప‌డేందుకు టీడీపీ - వైఎస్ జ‌గ‌న్‌ ల‌ను హ‌రీశ్‌ రావు బాగానే లైన్లోకి లాగి కాంగ్రెస్ పార్టీని ఇర‌కాటంలో ప‌డేశార‌ని గులాబీద‌ళం ఖుష్ అవుతోంది.