Begin typing your search above and press return to search.

పట్టిసీమపై కేసీఆర్ మాటను మరిచారా హరీశ్?

By:  Tupaki Desk   |   4 May 2016 5:13 AM GMT
పట్టిసీమపై కేసీఆర్ మాటను మరిచారా హరీశ్?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల పంచాయితీలు తీవ్రం కానున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకు ముందు పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులు తాజాగా చోటు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు.. డిండి ప్రాజెక్టులపై ఏపీ అధికార.. విపక్షాల వైఖరి పట్ల తెలంగాణ అధికారపక్షం తీవ్రంగా తప్పు పడుతోంది. తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టు మీద చంద్రబాబు సర్కారు వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. పాలమూరు.. డిండి ప్రాజెక్టు పాత ప్రాజెక్టులని.. వాటికి సంబంధించిన నిర్ణయాలు గతంలోనే తీసుకున్నట్లుగా వెల్లడించారు.

కృష్ణాలోని 70 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేలా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం నివేదిక తయారు చేయాలని 2013లోనే జీవోను జారీచేసిన విషయాన్ని హరీశ్ గుర్తు చేస్తున్నారు. ఇక.. కృష్ణాలోని 30 టీఎంసీల నీటిని వాడుకుంటే డిండి ఎత్తిపోతలకు 2007 జులై 7న జీవో జారీ చేసినట్లుగా హరీశ్ చెబుతున్నారు. ఇవన్నీ పాత ప్రాజెక్టులుగా అభివర్ణిస్తున్న హరీశ్.. ఉమ్మడి ఏపీలోనే నీటి కేటాయింపులుచేసి.. సర్వేలు చేసి.. కొంత ఖర్చు పెట్టిన తర్వాత ప్రాజెక్టులను తప్పు పడతారా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టును తప్పు పట్టటం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా విభజన చట్టాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉల్లంఘించారంటూ హరీశ్ తప్పు పట్టారు. ఒకవేళ హరీశ్ చెప్పినట్లుగా ఏపీ సర్కారు తప్పు చేసి ఉంటే..తెలంగాణ సర్కారు కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? తెలంగాణ ప్రాజెక్టుల కారణంగా ఏపీకి నష్టం వాటిల్లేలా జరిగితే.. వాటిపై కేంద్రానికి.. అవసరమైతే సుప్రీంకోర్టుకు సైతం వెళ్లేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమవుతున్నప్పుడు.. అదే తీరులో తెలంగాణ సర్కారు ఎందుకు చేయటం లేదన్నది ఒక ప్రశ్న.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపై తాను కామెంట్ చేయనంటూనే.. అలాంటివి అవసరమని వ్యాఖ్యానించటాన్ని ఏపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించటం సరైనదన్న మాట సాక్ష్యాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి వస్తే.. ఈ రోజున ఆ ప్రాజెక్టు ఆక్రమంగా తెలంగాణ ముఖ్యమంత్రి మేనల్లుడు హరీశ్ రావు ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. నిజమే.. ఇది కూడా పాయింటే. మరి.. దీనిపై హరీశ్ ఎలా రియాక్ట్ అవుతారో..?