Begin typing your search above and press return to search.

హుజూర్‌ న‌గ‌ర్ వార్‌..రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్‌..

By:  Tupaki Desk   |   14 Oct 2019 6:06 AM GMT
హుజూర్‌ న‌గ‌ర్ వార్‌..రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్‌..
X
హ‌జూర్‌ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో అధికార టీఆర్ ఎస్ ను గెలిపించేందుకు ట్ర‌బుల్ షూట‌ర్ మంత్రి హ‌రీశ్‌ రావు రంగంలోకి దిగుతున్నారు. టీఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా ఆయ‌న‌ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 17,18 తేదీల్లో మంత్రి ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు. హుజూర్‌ న‌గ‌ర్‌ లో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం మంత్రి జ‌గ‌దీశ్‌ రెడ్డి త‌దిత‌రులు మాత్ర‌ర‌మే ప్ర‌చారం చేస్తున్నారు.

ఇన్నాళ్లూ త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయిన మంత్రి హ‌రీశ్‌ రావు రాక‌తో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతాయ‌ని - ప‌రిస్థితుల‌న్నీ గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. నిజానికి.. హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ - మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఈ మేర‌కు ఈనెల 4న ప్ర‌చారంలో కూడా పాల్గొన్నారు. కానీ.. ఈనెల 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ప్రారంభం కావ‌డంతో మంత్రి కేటీఆర్ ప్ర‌చారానికి దూరంగా ఉంటున్నారు.

జ‌నంలోకి వ‌స్తే.. కార్మికులు అడ్డుకుని నిల‌దీసే అవ‌కాశం ఉంటుంద‌న్న ఇంటెలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారంతో ఈనెల 10 - 11వ తేదీల్లో చేప‌ట్టాల్సిన ప‌ర్య‌ట‌న‌ల‌ను కూడా ర‌ద్దు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మొన్న పార్టీ నేత‌ల‌తో కేవ‌లం టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. మ‌రోవైపు.. 18న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భారీ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. స‌మ్మె ప్ర‌భావంతో సభకు సీఎం కేసీఆర్ రాకపోవచ్చుననే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

రోజురోజుకూ స‌మ్మె ఉధృతం అవుతుండ‌డంతో అటు కేసీఆర్‌గానీ.. ఇటు మంత్రి కేటీఆర్‌ గానీ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. అయితే.. స‌భ‌కు కేసీఆర్‌ కు బ‌దులు మంత్రి కేటీఆర్ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ట్ర‌బుల్ షూట‌ర్ మంత్రి హ‌రీశ్‌రావు రంగంలోకి దిగుతున్నారు. అయితే.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె నేప‌థ్యంలో మంత్రి ఎలా ప‌ర్య‌టిస్తార‌న్న‌ది అందరిలో ఉత్కంఠ‌ను రేపుతోంది. నిజానికి.. గతంలో ఆర్టీసీ యూనియ‌న్‌కు హ‌రీశ్‌ రావు గౌర‌వ అధ్య‌క్షుడిగా కూడా కొన‌సాగారు. డైరెక్టుగా కార్మికుల‌తో సంబంధాలు ఉన్న ఆయ‌న హుజూర్‌ న‌గ‌ర్‌ కు వ‌స్తే.. ఎలాంటి పరిస్థితులు ఎదుర‌వుతాయోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె ప్రభావంపై సీఎం పర్యటనలు రద్దవుతున్న నేప‌థ్యంలో వ‌స్తున్న మంత్రి హరీశ్‌ రావుకు హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక పెద్ద స‌వాల్‌ గా మారుతోంది. ఇదిలా ఉండ‌గా.. కాగా కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ - ఎంపీ రేవంత్ రెడ్డి 17 - 18 తేదీల్లో హుజూర్‌ నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారయ్యింది. కాగా - ఈ నెల 18వతేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. 21న పోలింగ్ జరుగుతుంది. 24న ఫలితాలు వెల్లడవుతాయి.