Begin typing your search above and press return to search.

చంద్రబాబు చెంపలు వాయించారట

By:  Tupaki Desk   |   7 Feb 2016 10:05 AM GMT
చంద్రబాబు చెంపలు వాయించారట
X
గ్రేటర్ ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి మాత్రం తగ్గినట్లుగా లేదు. తెలంగాణలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఇంకా మిగిలి ఉండడంతో కొంత రాజకీయ వేడి కనిపిస్తోంది. గ్రేటర్ లో దక్కిన విజయం స్పూర్తితో నారాయణ్ ఖేడ్ లోనూ భారీ విజయం నమోదు చేయాలని టీఆరెస్ ఉవ్విళ్లూరుతోంది. నారాయణఖేడ్ ఎన్నికల వ్యవహారం చూసుకుంటున్న టీఆరెస్ మంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ ప్రజలు ఆ చెంపా ఈ చెంపా వాయించి పంపించారంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు.

నారాయణ ఖేడ్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... ''వరంగల్ లో ప్రజలు చంద్రబాబూ ..నీ మొహం బాగోలేదని వెళ్లగొట్టారు. అయినా ఆయన మాత్రం నోరు పెద్దగా చేసుకుని హైదరాబాద్ లో మాట్లాడారు. అక్కడ కూడా ప్రజలు ఆ చెంపా,ఈ చెంపా వాయించారు'' అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.హైదరాబాద్ లో చెల్లని టిడిపి - కాంగ్రెస్ మొఖాలు నారాయణ ఖేడ్ లు చెల్లుతాయా అని ఆయన అన్నారు.

అంతేకాదు... హైదరాబాద్ లో బామ్మర్ది - పార్టీలో తన పోటీదారు కేటీఆర్ సాధించిన విజయంపైనా హరీశ్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ప్రజల తీర్పుతో టీడీపీ - కాంగ్రెస్ లకు మైండ్ బ్లాంక్ అయిందని ఆయన అన్నారు. దీంతో ఆ పార్టీల వారు ఇంట్లోనుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్ లోనూ అదే సీను రిపీటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆరెస్ లో కేసీఆర్ కు రాజకీయ వారసుడు కేటీఆరే అన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో హరీశ్ హైదరాబాద్ విజయాన్ని ప్రశంసిస్తుండడం గొప్ప విషయమే. కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి హరీశ్ సిద్ధమైపోతున్నారనడానికి ఆయన తరచూ చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు నిదర్శనమంటున్నారు రాజకీయ పండితులు.