Begin typing your search above and press return to search.

దేవినేని ఉమకు హరీశ్ ఫోన్ చేశారు

By:  Tupaki Desk   |   4 May 2016 10:10 AM GMT
దేవినేని ఉమకు హరీశ్ ఫోన్ చేశారు
X
ఏపీ మంత్రివర్గసమావేశం తీసుకున్ననిర్ణయం చెల్లని నాణెం లాంటిదంటూ తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు.. తాను వ్యాఖ్యలు చేసిన 24 గంటల వ్యవధిలోనే ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమకు ఫోన్ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు పొడసూపటం.. తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద ఏపీ సర్కారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనని.. కాదనుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించటం తెలిసిందే.

మరోవైపు.. ఏపీ ప్రభుత్వంతో పాటు.. ఏపీ విపక్ష నేత జగన్ సైతం పాలమూరు.. డిండీ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఈ నెల 16 నుంచి 18 వరకు కర్నూలులో నిరసన దీక్ష చేయాలని నిర్ణయించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ అధికార.. విపక్ష అధినేతలపై తెలంగాణ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ మాటల జోరుతో.. రెండు ప్రాంతాల మధ్య ఒకలాంటి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో అనూహ్యంగా తెలంగాణ మంత్రి హరీశ్ రావు.. ఏపీ మంత్రి దేవినేనికి ఫోన్ చేయటం.. ఆర్డీఎస్ ప్రాజెక్టు భేటీ అవుదామని ప్రతిపాదించారని చెబుతున్నారు.

హరీశ్ ప్రతిపాదనపై స్పందించిన ఏపీ మంత్రి దేవినేని.. ఒకట్రెండు ప్రాజెక్టుల మీద కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న అన్ని ప్రాజెక్టుల వ్యవహారాలపై భేటీ కావాలని ఉమ సూచించినట్లుగా తెలుస్తోంది. దీనికి ఉభయుల మధ్య అంగీకారం కుదిరిందని చెబుతున్నారు. అదే సమయంలో.. విభజన చట్టానికి కట్టుబడే ప్రాజెక్టులు నిర్మించుకుందామని.. మహారాష్ట్ర.. కర్ణాటకల మీద కలిసి పోరాటం చేయాలని హరీశ్ కోరినట్లుగా చెబుతున్నారు. అయితే.. రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల మీద ఉన్న విభేదాల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కేంద్రమంత్రి ఉమాభారతి సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందన్న ఆలోచనను దేవినేనికి హరీశ్ చెప్పినట్లుగా చెబుతున్నారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ తీరును మండిపడుతున్న తెలంగాణ అధికారపక్షం మరోవైపు.. ఏపీ సర్కారుతో భేటీ అయ్యేందుకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు స్వయంగా అడుగు వేయటం గమనార్హం. కలిసి కూర్చొని మాట్లాడుకొని.. విభేదాల్ని పరిష్కరించుకునే ఆలోచన మంత్రి హరీశ్ కు ఉన్నప్పుడు.. ఆవేశంతో నాలుగు మాటలు అనేయటం తొందరపాటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.