Begin typing your search above and press return to search.

హజీ అలీ దర్గాలోకి ఎంట్రీకి ఓకే అన్నకోర్టు

By:  Tupaki Desk   |   26 Aug 2016 9:36 AM GMT
హజీ అలీ దర్గాలోకి ఎంట్రీకి ఓకే అన్నకోర్టు
X
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శని సింగనాపూర్.. త్రయంబకేశ్వర్ ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని కోరుతూ పోరాటం చేసిన భూమాతా బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ తాజాగా మరో విజయాన్ని సాధించారు. దేశ ఆర్థికరాజధాని ముంబయిలోని హజీ అలీ దర్గాలో మహిళలు ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని బాంబే హైకోర్టు తప్పు పట్టింది. దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ కోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది.

తొలుత ఈ దర్గాలోకి మహిళల్ని అనుమతించే వారు. 2012లో దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని విధించారు. దీంతో.. దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన బాంబే హైకోర్టు తాజాగా తన తీర్పును ప్రకటించింది. దర్గాలోకి మహిళల్ని రాకుండా నిషేధం విధించటం వారి ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లేలా చేయటమేనని చెప్పిన కోర్టు.. వారి ప్రవేశానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దర్గాలోకి మహిళల ప్రవేశానికి అనుమతి ఇచ్చిన కోర్టు.. పురుషులతో పాటు సమానంగా మహిళలుకూడా దర్గాలోకి వెళ్లొచ్చని.. అయితే.. దర్గాలోకి వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దర్గా ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును ఆరు వారాలపాటు నిలిపివేశారు.