Begin typing your search above and press return to search.

ఐసిస్‌ ను వ్య‌తిరేకించిన ఉగ్ర‌వాది

By:  Tupaki Desk   |   29 Nov 2015 5:15 AM GMT
ఐసిస్‌ ను వ్య‌తిరేకించిన ఉగ్ర‌వాది
X
ఐసిస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న మూలాల‌ను విస్త‌రించిన రాక్ష‌స మూక‌. ఉగ్ర‌వాదం అనే పిచ్చిపీక్ స్టేజీకి చేరిపోయిన వారంతా ఇందులో భాగ‌స్వామ్యం పంచుకుంటున్నారు. అయితే చిత్రంగా ఈ సంస్థ తీరును ఓ ఉగ్ర‌వాది త‌ప్పుప‌ట్టారు. ముంబయి దాడుల సూత్రధారిగా అనుమానిస్తున్న లష్కరీ-ఇ-తోయిబా మిలిటెంట్‌ గ్రూప్‌ నేత హఫీజ్‌ సయీద్‌ పారిస్‌ ఉగ్రదాడి ఘటనను ఖండించారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ద్వారా పశ్చిమ దేశాల్లో ఇస్లాంను దెబ్బకొట్టే కుట్రగా ఈ దాడిని ఆయన అభివర్ణించారు.

హఫీజ్‌ సయీద్‌ ను 2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారిగా ఇండియా పేర్కొంటున్న విషయం తెలిసిందే. ముంబయి దాడులు జ‌రిగిన తీరుతో ఉగ్రవాదులు స్ఫూర్తి పొంది పారిస్‌ ఘటనకు పాల్పడ్డారని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది రక్షణ రంగ నిపుణులు విశ్లేషించారు. నాటి ముంబయి దాడిలో 174 మంది చనిపోగా, నేటి పారిస్‌ ఉగ్రదాడిలో 129 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ లో లష్కరీ-ఇ-తోయిబా మిలిటెంట్‌ గ్రూప్‌ ను నడుపుతున్న హఫీజ్‌ సయీద్‌ ను పాకిస్తాన్‌ న్యూస్‌ ఏజెన్సీ ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. ఇందులో హఫీజ్‌ సయీద్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ దాడుల్ని ఖండిస్తూ...ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

"పారిస్‌ ఉగ్రదాడికి అక్కడి ముస్లింలను నిందించాల్సిన అవసరం లేదు. నిజమేమిటంటే.. పాశ్చాత్య దేశాలు సృష్టించిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఈ ఉగ్రదాడి చేసిందన్నది తెలుసుకోవాలి. ఇది నేను చెబుతున్నది కాదు. ఇస్లామిక్‌ స్టేట్‌ ను పాశ్చాత్యదేశాలు సృష్టించి తప్పుచేశాయని...కొద్ది రోజుల క్రితమే బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ చెప్పారు. పాశ్చాత్య దేశాల దాష్టికాలకు ఒకరూపమే 'ఇస్లామిక్‌ స్టేట్‌'. పాశ్చాత్యదేశాల సామ్రాజ్యవాదానికి అనుగుణంగా ఐఎస్‌ ఏర్పాటు జరిగింది. దీనిని ముస్లింలపైనే ప్రయోగిస్తున్నారు" అని అన్నారు

అయితే హ‌ఫీజ్ ఇస్లామిక్‌ స్టేట్‌ కు వ్యతిరేకంగా మాట్లాడ‌టం ఇదే మొద‌టిసారి కాదు. గతంలోనూ హఫీజ్‌ సయీద్‌ గళమెత్తారు. అమెరికా, యూరప్‌ లోని దాని మిత్రదేశాలు ఐఎస్‌ ను సృష్టించాయని, ప్రపంచ ముస్లింలకు ఐఎస్‌ కన్నా మించిన ప్రమాదం మరొకటి లేదని ఫైసలాబాద్‌ లో ప్రసంగిస్తూ హఫీజ్‌ సయీద్‌ అన్నారు. ఐఎస్‌ దుశ్చర్యల వల్ల ఇస్లాంకు చెడ్డపేరు వస్తోందని, శత్రువులు మరింత బలోపేతమవుతున్నారని పేర్కొన్నారు. ముంబయి దాడుల తర్వాత భారత్‌ అందజేసిన ఆధారాల ప్రకారం, హఫీజ్‌ సయీద్‌ తో సహా అనేకమందిని పాకిస్తాన్‌ అరెస్ట్‌ చేసింది. అయితే సరైన ఆధారాలు లేవన్న కారణంతో పాక్‌ కోర్టు అతన్ని విడుదల చేసింది.